Begin typing your search above and press return to search.

SSMB29: హైప్ ఎక్కిస్తున్న జక్కన్న తనయుడు..!

By:  Tupaki Desk   |   14 Sep 2022 7:32 AM GMT
SSMB29: హైప్ ఎక్కిస్తున్న జక్కన్న తనయుడు..!
X
దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి మరియు సూపర్ స్టార్ మహేష్ బాబు SSMB29 కోసం చేతులు కలపనున్న సంగతి తెలిసిందే. ఇది భారతీయ సినిమాలో అత్యంత ఎదురుచూస్తున్న ప్రాజెక్ట్‌ లలో ఒకటిగా చెప్పొచ్చు. అపజయం ఎదురుగని జక్కన్న.. గత కొన్నేళ్లుగా వరుస హిట్స్ తో దూకుడు మీదున్న మహేశ్ కలిసి చేస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

వాస్తవానికి దశాబ్దం క్రితమే మహేష్ - రాజమౌళి కాంబినేషన్ లో చర్చలు జరిగాయి. అయితే ఇతర కమిట్మెంట్స్ వల్ల ప్రాజెక్ట్ ఆలస్యమవుతూ వచ్చింది. అయితే ఇన్నాళ్లకు ఈ క్రేజీ కాంబోలో సినిమా సెట్ అయినందుకు ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. అది 'ఆర్.ఆర్.ఆర్' వంటి గ్లోబల్ హిట్ తర్వాత జక్కన్న చేస్తున్న సినిమా కావడంతో యావత్ సినీ అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.

మహేష్ బాబు తో రాజమౌళి ఎలాంటి సినిమా చేస్తాడని ఎప్పటి నుంచో చర్చలు జరుగుతున్నాయి. విజయేంద్ర ప్రసాద్ ఓ ఇంటర్వ్యూలో ఆఫ్రికన్ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఓ అడ్వెంచరస్ మూవీ అనుకుంటున్నట్లు హింట్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో లేటెస్టుగా SSMB29 జోనర్ పై అగ్ర దర్శకుడు క్రేజీ అప్డేట్ అందించారు.

టొరెంటో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో పాల్గొన్న రాజమౌళి.. అక్కడ మీడియా ఇంటరాక్షన్‌ లో మాట్లాడుతూ.. మహేశ్ బాబుతో గ్లోబ్‌ ట్రాటింగ్ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ చేయనున్నట్లు తెలిపారు. దీంతో ఫుల్ ఎగ్జైట్ అవుతున్న సూపర్ స్టార్ ఫ్యాన్స్.. అసలు 'గ్లోబ్‌ ట్రాటింగ్' అంటే ఏంటని నెట్టింట వెతకడం ప్రారంభించారు.

ఇకపోతే రాజమౌళి తనయుడు.. తన ప్రాజెక్ట్‌ లకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌ గా వ్యవహరించే ఎస్ఎస్ కార్తికేయ కూడా ఇప్పుడు మహేష్ అభిమానులకు హై ఇస్తున్నాడు. మహేష్‌ తో సినిమా గ్లోబ్‌ ట్రాటింగ్ యాక్షన్‌గా ఉంటుందని రాజమౌళి ప్రకటించిన తర్వాత కార్తికేయ "#Globetrotter" అని ట్వీట్ చేశాడు.

కార్తికేయ చేసిన ట్వీట్ వైరల్ అవ్వడమే కాదు.. 'గ్లోబ్‌ ట్రాటింగ్' అనే హ్యాష్‌ ట్యాగ్ ఇప్పుడు ట్విట్టర్‌ లో ట్రెండ్ అవుతోంది. కార్తికేయ ప్రస్తుతం తండ్రితో పాటుగా టొరెంటో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ కు హాజరయ్యాడు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి.

కాగా, రాజమౌళి సినిమాలో ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి ట్రావెల్ చేసే అడ్వెంచరర్ గా మహేష్ కనిపించనున్నారని టాక్ మొదలైంది. ఇది భారతీయ మూలాలతో ముడిపడి ఉంటుందని తెలుస్తోంది. ఇండియానా జోన్స్ తరహాలో సాహసాల ప్రపంచం నేపథ్యంలో యాక్షన్ ప్రధానంగా ఈ ఉంటుందని ఊహిస్తున్నారు.

హాలీవుడ్‌ సినిమాల మాదిరిగానే హై ఇంటెన్స్ యాక్షన్ సన్నివేశాలు ఉంటాయని భావిస్తున్నారు. భారీ బడ్జెట్ తో అత్యున్నత సాంకేతిక విలువలతో అంతర్జాతీయ స్థాయిలో ఈ మూవీని తెరకెక్కించే అవకాశం ఉంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నారు.

అప్పటిలోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో SSMB28ని పూర్తి చేస్తాడు మహేష్. SSMB29 ప్రాజెక్ట్ ని దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కేఎల్ నారాయణ నిర్మిస్తారు. ఎస్ గోపాల్ రెడ్డి సహ నిర్మాతగా వ్యవహరించే అవకాశం ఉంది. త్వరలో ఈ ప్రతిష్టాత్మక సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడి కానున్నాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.