Begin typing your search above and press return to search.

తను ఏ మల్లూ యాక్టర్ తో మ్యాచ్ అవుతాడో టెస్ట్ చేసుకున్న అల్లు అర్జున్..!

By:  Tupaki Desk   |   7 Sep 2021 5:41 AM GMT
తను ఏ మల్లూ యాక్టర్ తో మ్యాచ్ అవుతాడో టెస్ట్ చేసుకున్న అల్లు అర్జున్..!
X
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కేవలం తెలుగులోనే కాకుండా, పొరుగు ఇండస్ట్రీల్లోనూ విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నారు. 'ఆర్య' నుంచి ప్రతీ చిత్రాన్ని మలయాళంలో కూడా రిలీజ్ చేస్తూ.. అక్కడి స్టార్ హీరోలకు పోటీగా మార్కెట్ క్రియేట్ చేసుకున్నారు. మన దగ్గర బన్నీ సినిమాలు ఎంతలా అలరిస్తాయో.. అందుకు ఏమాత్రం తగ్గకుండా మాలీవుడ్ లోనూ ఆడుతుంటాయి. అక్కడి స్టార్ హీరోలు సైతం అల్లు అర్జున్ సినిమా వస్తుందంటే వారి చిత్రాలను వాయిదా వేసుకునే పరిస్థితి ఉంది. ఈ క్రమంలోనే మలయాళ చిత్ర పరిశ్రమలో ''మల్లు అర్జున్'' అయ్యారు.

సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్ గా ఉండని అల్లు అర్జున్.. సోమవారం ఓ ఫన్ టాస్క్ నిర్వహించారు. ఇన్స్టాగ్రామ్ స్టోరీలలో ఉండే ఫిల్టర్ల ద్వారా అభిమానులను అలరించే ప్రయత్నం చేశారు. "మీరు ఏ మల్లు యాక్టర్?" అని ఇన్స్టా ఫిల్టర్ లో బన్నీ చెక్ చేసుకోగా.. మాలీవుడ్ యాక్టర్స్ అందరిలో విలక్షణ నటుడు కుంచాకో బోబన్ ను మ్యాచ్ చేసి చూపించింది. ఈ వీడియోని ట్విట్టర్ లో షేర్ చేసిన అల్లు అర్జున్ "ఫన్ స్టఫ్" అని పేర్కొన్నారు.

కుంచాకో బోబన్ మలయాళ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్నారు. ఇప్పటి వరకు 90 కి పైగా చిత్రాలలో నటించిన బోబన్.. విభిన్నమైన చిత్రాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. కథ నచ్చితే పాత్ర నిడివి గురించి ఆలోచించకుండా అందులో నటించడానికి రెడీ అవుతారు కుంచాకో. ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న 'నిఫా వైరస్' 'మిడ్ నైట్ మర్డర్స్' 'నీడ' వంటి డబ్బింగ్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను కూడా ఆకట్టుకున్నాడు.

బోబన్ ప్రధాన పాత్ర పోషించిన సూపర్ హిట్ 'నాయట్టు' చిత్రాన్ని ఇప్పుడు అల్లు అర్జున్ హోమ్ బ్యానర్ గీతా ఆర్ట్స్ లో రీమేక్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఇక బన్నీ విషయానికొస్తే.. ప్రస్తుతం 'పుష్ప' అనే పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్నాడు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని కేరళలో కూడా భారీ స్థాయిలో రిలీజ్ చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే మలయాళ స్టార్ ఫహద్ ఫాజిల్ ను ఈ చిత్రంలో ప్రధాన విలన్ పాత్ర కోసం తీసుకున్నారు.

రెండు భాగాలుగా రానున్న ఈ చిత్రం ఫస్ట్ పార్ట్ ని ''పుష్ప: ది రైజ్'' పేరుతో డిసెంబర్ నెలలో విడుదల చేయనున్నారు. ఇందులో లారీ డ్రైవర్ పుష్పరాజ్ గా అల్లు అర్జున్.. IPS భన్వర్ సింగ్ షెకావత్ గా ఫహద్ నటిస్తున్నారు. బిగ్ స్క్రీన్ మీద వీరిద్దరూ ముఖాముఖి తలపడితే చూడాలని మల్లు ఆడియన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.