Begin typing your search above and press return to search.

సూపర్ స్టార్ కృష్ణ.. సింహాసనం సంచలనాలు ఎన్నో..!

By:  Tupaki Desk   |   16 Nov 2022 5:27 AM GMT
సూపర్ స్టార్ కృష్ణ.. సింహాసనం సంచలనాలు ఎన్నో..!
X
తెలుగు తెరకు కొత్త సాంకేతికతను తీసుకువచ్చేందుకు తన వంతు కృషి చేస్తూ వచ్చారు సూపర్ స్టార్ కృష్ణ. సినిమా పరంగా కొత్తగా ఏదైనా వస్తుంది అంటే దానిపై కృష్ణ కన్ను పడుతుంది. అలాంటి వాటిలో ఒకటే తొలి 70 ఎం.ఎం మూవీ. నటుడిగానే కాదు దర్శకుడిగా కూడా తన మార్క్ చూపించాలనుకున్న కృష్ణ దర్శకుడిగా మారి చేసిన తొలి సినిమా సింహాసనం తో కూడా మరో కొత్త ప్రయత్నం చేశారు. తెలుగులో మొదటి 70 ఎం.ఎం సినిమాగా సింహాసనం తెరకెక్కింది. ఈ సినిమాను డైరెక్ట్ చేయడమే కాదు నిర్మించింది కూడా కృష్ణ గారే.

మూలకథ కృష్ణ గారిదే కాగా ఈ సినిమాకు మహారథి రచనా సహకారం అందించారు. జానపద కథలు తగ్గుతున్న రోజుల్లో కృష్ణ కావాలని సింహాసనం కథ సిద్ధం చేశారు. అయితే అప్పట్లో ఆయన సినిమాలు 50 లక్షల బడ్జెట్ లో పూర్తయ్యేవి.. కానీ సింహాసనం కోసం ఆ మొత్తం ఒక సెట్టుకే ఖర్చు పెట్టేశారు కృష్ణ. తను అనుకున్న అవుట్ పుట్ వచ్చే వరకు ఎంత రిస్క్ అయినా తీసుకోవడం ఆయనకే చెల్లుతుంది. సింహాసనం సినిమాకు కళాదర్శకుడు భాస్కర్ రాజు పనిచేశారు. అప్పట్లో సింహాసనం సెట్లు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారాయి.

సినిమాకు 3 కోట్ల బడ్జెట్ అవుతుందని తెలుసుకుని తెలుగు లో మాత్రమే రిలీజ్ అయితే రిస్క్ అనుకుని హిందీలో కూడా ఒకేసారి తెరకెక్కించారు కృష్ణ. హిందీలో సింఘాసన్ గా తెరకెక్కిన ఈ మూవీలో జితేంద్ర హీరోగా చేశారు. తెలుగులో హీరోగా కృష్ణ.. హిందీలో హీరోగా జితేంద్ర తప్ప మిగతా పాత్రలన్ని అలానే ఉంచారు. 65 రోజుల్లో సినిమాని పూర్తి చేశారు కృష్ణ. తెలుగులోనే కాదు హిందీలో కూడా సింహాసనం సూపర్ హిట్ అయ్యింది.

ఈ సినిమా పోస్టర్స్ విషయంలో కూడా సంచలనంగా మారాయి. అప్పటివరకు తెలుగులో 4 షీట్, 6 షీట్, 9 షీట్ వాల్ పొస్టర్స్ మాత్రమే ఉండేవి. కానీ సింహాసనం సినిమాకు 24 షీట్ వాల్ పోస్టర్స్ సిద్ధం చేశారు పద్మాలయ స్టూడియోస్ వారు. అప్పటి సినీ వాణిజ్య రాజధాని విజయవాడ లోని అలంకార్ థియేటర్ దగ్గర 95 అడుగులు, బెంజి సర్కిల్ దగ్గర 75 అడుగుల భారీ కటౌట్లు.. ఏర్పాటు చేశారు. అప్పట్లో ఈ కటౌట్లు కూడా టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారాయి.

సింహాసనం కన్నా ముందే 70 ఎం.ఎం సినిమాలు ట్రై చేశారు. ఎన్.టి.ఆర్ బొబ్బిలిపులి, చిరంజీవి కొండవీటి దొంగ సినిమాలు 70 ఎం.ఎం లో తెరకెక్కించాలని ప్రయత్నాలు చేశారు కానీ మధ్యలోనే వద్దనుకున్నారు. తెలుగులో వచ్చిన రెండో 70 ఎం.ఎం సినిమా అగ్నిపుత్రుడు సినిమా వచ్చింది. ఇదే కాదు తెలుగు తెరకు బప్పీలహరిని పరిచయం చేసింది కృష్ణ గారే.. అప్పట్లో ఎస్బీ బాలసుబ్రహ్మణ్యంతో కొత్త దూరం ఏర్పడగా కొత్త సింగర్ రాజ్ సీతారాం ని తీసుకొచ్చారు. ఆకాశంలో ఒకతార పాటని ప్రయోగాత్మకంగా పాడించారు. సింహాసనం సినిమాలోని అన్ని పాటలు రాజ్ సీతారాం పాడటం విశేషం.

సింహాసనం రిలీజ్ కూడా భారీగానే జరిగింది. 70 ఎం.ఎం ప్రింట్ లు కేవలం ఆరు మాత్రమే.. అయితే 70 ఎం.ఎం సినిమా ఆడించే సాంకేతికలేని థియేటర్లు అప్పట్లో ఎక్కువగా ఉన్నాయి. అందుకే 70 ఎం.ఎం సినిమా వేసేందుకు అందుబాటులో ఉన్న థియేటర్ లలోనే ఈ ప్రింట్ లు వేశారు. సింహాసనం సినిమా 80 ప్రింట్ లతో 150 కేంద్రాలలో రిలీజైంది. హిందీ వర్షన్ 120 నుంచి 130 ప్రింట్ లు వేశారు. అప్పట్లో 35 ఎం.ఎం ప్రింట్ తీయడానికి 40 వేల దాకా ఖర్చు అయ్యేది. 70 ఎం.ఎం ప్రింట్ కోసం లక్షా అరవై వేలు అయ్యేవట. ఇలా సినిమా విషయంలో ఇలాంటివి ఎన్నో కొత్త ప్రయోగాలు చేశారు కృష్ణ.

ప్రస్తుతం తెలుగు సినిమా బాహుబలి, ఆర్.ఆర్.ఆర్ సినిమాలతో ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చుకుంటుందని.. పాన్ ఇండియా మార్కెట్ అని చెబుతున్నారు. సింహాసనం టైం లోనే కృష్ణ పాన్ ఇండియా సినిమాలు చేశారు. అంతేకాదు ఇప్పటి లెక్కలతో పోల్చితే ఒక్క సినిమాకు 3,4 బాఘుబలి సినిమాల బడ్జెట్ పెట్టేశారు. సాహసమే ఊపిరిగా చేసుకున్నారు కాబట్టి సినిమా మేకింగ్ లో ఏ విషయంలో తగ్గలేదు కృష్ణ. అందుకే ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన చేసిన ప్రయోగాలు.. చూపించిన సినిమాలు ఎప్పటికీ తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో నిలిచి ఉంటాయి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.