Begin typing your search above and press return to search.

ఆ స్టార్ హీరో సీక్వెల్ స‌క్సెస్ పాయింట్ తో!

By:  Tupaki Desk   |   19 Aug 2022 10:59 AM GMT
ఆ స్టార్ హీరో సీక్వెల్ స‌క్సెస్ పాయింట్ తో!
X
విశ్వ‌నటుడు క‌మ‌ల్ హాస‌న్ క‌థానాయ‌కుడిగా గౌత‌మ్ మీన‌న్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన 'వెట్టియాడు వెలియాడు' ఎంత పెద్ద స‌క్సెస్ సాధించిందో తెలిసిందే. ఇదే యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ తెలుగులో 'రాఘ‌వ‌న్' టైటిల్ తో అనువాద‌మై ఇక్కడా మంచి విజ‌యాన్ని అందుకుంది. 40 కోట్ల బడ్జెట్ తో తెర‌కెక్కిన సినిమా 16 ఏ ళ్ల క్రిత‌మే 150 కోట్ల‌కు పైగా వ‌సూళ్ల‌ని సాధించింది.

ఇందులో క‌మ‌ల్ కి జోడీగా జ్యోతిక‌..క‌మ‌లినీ ముఖ‌ర్జీ న‌టించారు. హ్యారీస్ జైరాజ్ సంగీతం అందించిన సినిమా మ్యూజిక‌ల్ గాను పెద్ద హిట్ అయింది. మ‌రి ఇప్పుడిదే కాంబినేష‌న్ రాఘ‌వ‌న్ కి సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారా? అంటే అవున‌నే వినిపిస్తుంది.ఇప్ప‌టికే స్ర్కిప్ట్ ప‌నులు పూర్త‌యిన‌ట్లు తెలుస్తోంది. క‌మ‌ల్ న‌టిస్తోన్న సినిమాలు పూర్త‌యిన త‌ర్వాత ఈ చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకెళ్లాల‌ని భావిస్తున్నారు.

ఇందులో హీరోయిన్ గా కీర్తి సురేష్ ని ఎంపిక చేసిన‌ట్లు స‌మాచారం. న‌య‌న‌తార‌.. అనుష్క శెట్టి పేర్లు సైతం ప‌రిశీలించిన‌ప్ప‌టికీ చివ‌రిగా కీర్తికే ఆ ఛాన్స్ ద‌క్కిన‌ట్లు కోలీవుడ్ వ‌ర్గాల స‌మాచారం. 'రాఘ‌వ‌న్ -2'గా దీన్ని తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్న‌ట్లు తెలుస్తోంది.

ఇక క‌మ‌ల్ హాస‌న్ ఇటీవ‌లి కాలంలో హిట్ సినిమాల‌కు సీక్వెల్స్ పైనే దృష్టి పెట్టిన‌ట్లు తెలుస్తోంది. 'భార‌తీయుడు' కు సీక్వెల్ గా ఇండియ‌న్ -2న శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిస్తోన్న సంగ‌తి తెలిసిందే. కొంత షూటింగ్ పూర్తిచేసుకుని మ‌ధ్య‌లో నిలిచిపోయిన చిత్రాన్ని మ‌ళ్లీ తిరిగి ప్రారంభిస్తున్నారు. ఆగస్టు 22 నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం అవుతుంది.

ఈ సినిమా త‌ర్వాత‌నే 'రాఘ‌వ‌న్-2' ని ప్రారంభిస్తార‌ని స‌మాచారం. అలాగే ఇటీవ‌లే యంగ్ మేక‌ర్ లోకేష్ క‌న‌గ‌రాజ్ తో 'విక్ర‌మ్' తో మ‌రో స‌క్సెస్ ని ఖాతాలో వేసుకున్నారు క‌మ‌ల్. ఈ సినిమాకి సీక్వెల్ గా 'విక్ర‌మ్-2' ని తెర‌కెక్కించ‌నున్నారు.

దానికి సంబంధించిన క‌థ రెడీ అవుతోంది. 'విశ్వ‌రూపం-3' కూడా చేసే ఛాన్స్ ఉందంటున్నారు. అలాగే లోక‌నాయ‌కుడు గ‌త విజ‌యాల్ని ఆధారంగా చేసుకుని మ‌రిన్ని సీక్వెల్స్ చేయాల‌న్న ఆలోచ‌న‌లోనూ ఉన్న‌ట్లు కోలీవుడ్ వ‌ర్గాల స‌మాచారం.