Begin typing your search above and press return to search.

RC15 కి బ్రేక్ వేస్తున్న ది గ్రేట్ సేనాప‌తి..!?

By:  Tupaki Desk   |   23 Aug 2022 1:30 AM GMT
RC15 కి బ్రేక్ వేస్తున్న ది గ్రేట్ సేనాప‌తి..!?
X
కమల్ హాసన్ - శంకర్ కాంబినేష‌న్ లో 1996లో వచ్చిన సోష‌ల్ డ్రామా బార‌తీయుడు (ఇండియన్) సంచ‌ల‌న విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ఈ కాంబినేష‌న్ సీక్వెల్ తో తిరిగి వ‌స్తోంది. 2017లో సీక్వెల్ ప్రీప్రొడ‌క్ష‌న్ ప‌నులు మొద‌ల‌య్యాయి. అయితే 2020లో దురదృష్టవశాత్తూ జరిగిన ప్రమాదం తర్వాత ఈ ప్రాజెక్ట్ ఆగిపోయింది. క్రేన్ యాక్సిడెంట్ సిబ్బంది మరణానికి దారితీసింది. ఆ త‌ర్వాత మొద‌లైనా కానీ ర‌క‌ర‌కాల కార‌ణాల‌తో ఈ ప్రాజెక్ట్ కి ప‌దే ప‌దే బ్రేక్ ప‌డ‌డం తీవ్రంగా నిరాశ‌ప‌రిచింది. కరోనా క్రైసిస్ స‌హా కోర్టు గొడ‌వ‌లు కూడా డిలే అవ్వ‌డానికి కార‌ణ‌మ‌య్యాయి. ఇక‌ ఈ ఏడాది ఆగస్టు 24 నుంచి పెండింగ్ చిత్రీక‌ర‌ణ‌కు వెళ్ల‌నున్నార‌నేది తాజా సమాచారం.

తాజా ఇంట‌ర్వ్యూలో కమల్ హాసన్ ఇండియన్ 2 ఆలస్యం గురించి ఓపెన‌య్యారు. ``ఇది చాలా పెద్ద చిత్రం అనే వాస్తవం అంద‌రికీ తెలుసు. అదే కాకుండా మధ్యలో చాలా ఇబ్బందులు ఎదుర‌య్యాయి. మాపై కోవిడ్ ప్ర‌భావం ఉంది. సెట్ లో ప్రమాదం జరిగింది. కార్మికులు మరణించారు. ఇది చాలా అసహ్యంగా అనిపించినా కానీ మేము చిత్రీక‌ర‌ణ‌ను ఆప‌కుండా కొనసాగించాం`` అని తెలిపారు.

నేను రాజ్ కమల్ ఫిల్మ్స్ అనే తెల్ల ఏనుగును నడుపుతున్నాను.. శ్రీ శంకర్ త‌న‌ ఎస్ ప్రొడక్షన్స్ అనే కంపెనీని నడుపుతున్నారు. ఇవి మనకు ఆహారం ఇవ్వడానికి అవసరమైన తెల్ల ఏనుగులు కాబట్టి మేము క‌ష్ట‌ప‌డి పని చేస్తాం. మనం ఒక్క సినిమాతో ఇరుక్కుపోలేం.. మొఘల్-ఏ-ఆజం రోజులను పునరావృతం చేయలేం.. ఒక్క సినిమాతో దశాబ్దకాలం పాటు కూర్చోలేం. అందుకే ఇత‌ర సినిమాలు చేస్తూ వెళుతున్నాం.. అని క‌మల్ తెలిపారు.

ఇటీవ‌లే కాజల్ అగర్వాల్ స్వ‌యంగా భారతీయుడు 2లో కథానాయికగా నటిస్తున్నాన‌ని అధికారికంగా ధృవీకరించింది. సత్యరాజ్ - కార్తీక్ కూడా చిత్ర తారాగణంలో భాగం. షూటింగ్ కోసం చెన్నైలో ఓ సెట్ కూడా వేశారు. ఇండియన్ 2 కాకుండా దర్శకుడు శంకర్ ప్రస్తుతం రామ్ చరణ్ తో తన తదుపరి చిత్రాన్ని చేస్తున్నాడు. తాత్కాలికంగా RC 15 అనే టైటిల్ వినిపిస్తోంది. ఇందులో చ‌ర‌ణ్‌ ద్విపాత్రాభినయం ప్ర‌ధాన హైలైట్ గా ఉండ‌నుంది. అయితే భార‌తీయుడు 2 కోసం ఆర్.సి 15 చిత్రీక‌ర‌ణ‌కు కొంత‌కాలం పాటు బ్రేక్ ప‌డ‌నుంది.

ఆస్కార్ విజేత‌ను దించారు!

తాజా స‌మాచారం ప్ర‌కారం.. ఆస్కార్ గ్ర‌హీత‌.. ప్ర‌ముఖ హాలీవుడ్ మేక‌ప్ ఆర్టిస్ట్ మైకేల్ వెస్ట్ మోర్ ని మ‌రోసారి క‌మ‌ల్ హాస‌న్ త‌న మేక‌ప్ కోసం బ‌రిలో దించుతున్నార‌ని తెలిసింది. ఆయ‌న‌తో కమల్ వ్యక్తిగతంగా స‌మావేశ‌మై త‌న పాత్ర‌ల‌కు మేక‌ప్ ఎలా ఉండాలో సుదీర్ఘంగా చర్చించార‌ని తెలిసింది. ఇక భార‌తీయుడు 2లో సేనాప‌తి లుక్ డిజైన్ పైనా ముచ్చ‌టించార‌ని కూడా తెలుస్తోంది. దశావ‌తారంలో ప‌ది పాత్ర‌ల‌కు మేక‌ప్ వేసిన ప్ర‌తిభావంతుడు మైఖేల్. ఇప్పుడు భార‌తీయుడు 2 కోసం ప‌ని చేయ‌డం ఎంతో గౌర‌వం అని క‌మ‌ల్ భావిస్తున్నారు. ఈ సంవత్సరం సెప్టెంబర్ లో తిరిగి ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లనుంద‌ని స‌మాచారం. సన్నాహక పని కోసం క‌మల్ హాసన్ ఇప్పటికే యుఎస్ వెళ్ళారని మూడు వారాల పాటు స్టేట్స్ లో గడుపుతారని ఇంత‌కుముందే క‌థ‌నాలొచ్చాయి.