Begin typing your search above and press return to search.

మొత్త‌నాకి క్రేజీ లిస్ట్ ఖాలీ అవుతోంది!

By:  Tupaki Desk   |   22 April 2022 1:30 PM GMT
మొత్త‌నాకి క్రేజీ లిస్ట్ ఖాలీ అవుతోంది!
X
గ‌త రెండేళ్లుగా క‌రోనా కార‌ణంగా షూటింగ్ లు పూర్తి కాక చాలా వ‌ర‌కు క్రేజీ చిత్రాల రిలీజ్ లు ఆగిపోయిన విష‌యం తెలిసిందే. ఇటీవ‌ల ప‌రిస్థితుల్లో మార్పులు రావ‌డంతో బ్యాక్ టు బ్యాక్ భారీ చిత్రాలు థియేట‌ర్ల‌లో సంద‌డి చేయ‌డం మొద‌లైంది. గ‌త ఏడాది మాస్ మ‌హారాజా ర‌వితేజ `క్రాక్‌` సినిమాతో భారీ క్రేజీ చిత్రాలు బ్యాక్ టు బ్యాక్ థియేట‌ర్ల‌లో సంద‌డి చేయ‌డం మొద‌లుపెట్టాయి. ఈ సినిమాలు ఇచ్చిన ఊపుతో భారీ చిత్రాలు కూడా ధైర్యంగా ప్రేక్ష‌కుల ముందుకొచ్చాయి.

అయితే గ‌త ఏడాది చివ‌ర్లో థియేట‌ర్ల‌లో సంద‌డి చేసిన చిత్రాల‌తో థియేట‌ర్ల వ‌ద్ద మ‌ళ్లీ ప్రేక్ష‌కులు హంగామా మొద‌లైంది. గ‌త కొంత కాలంగా సినీ వ‌ర్గాలు ఎదురుచూస్తున్న సాధార‌ణ వాతావ‌ర‌ణం క‌నిపించింది. ఆ ధైర్యంతో నంద‌మూరి బాల‌కృష్ణ `అఖండ‌`, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ న‌టించిన `పుష్ప‌`, నేచుర‌ల్ స్టార్ `శ్యామ్ సింగ రాయ్‌` చిత్రాలు థియేట‌ర్ల‌లో సంద‌డి చేశాయి. డిసెంబ‌ర్ నెల‌లో విడుద‌లైన ఈ చిత్రాలు వ‌రుస‌గా బాక్సాఫీస్ వ‌ద్ద భారీ విజ‌యాల్ని సాధించిన వ‌సూళ్ల వ‌ర్షం కురిపించాయి.

భారీ చిత్రాలు విడుద‌లైతే ప్రేక్ష‌కులు ఆ స్థాయిలో థియేట‌ర్ల‌కు వ‌స్తారా? .. ఆశించిన స్థాయిలో సినిమాకు కాసుల వ‌ర్షం కురుస్తుందా? అని అనుమానంతో చూసిన ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు ఈ చిత్రాలు మ‌నో ధైర్యాన్ని అందించి మ‌ళ్లీ మునుప‌టి రోజులొచ్చాయని, ప్రేక్ష‌కులు ఎలాంటి సినిమా ని అయినా ఆద‌రిస్తార‌ని నిరూపించాయి. దీంతో గ‌త రెండు మూడేళ్లుగా రిలీజ్ కోసం ఎదురు చూస్తున్న పాన్ ఇండియా చిత్రాలు కూడా వ‌రుస‌గా క్యూ క‌ట్టాయి.

ఈ త‌ర‌హా చిత్రాల‌కు `పుష్ప‌` కొత్త ధైర్యాన్ని అందించింది. ఈ సినిమా ఉభ‌య తెలుగు రాష్ట్రాల‌తో పాటు ఉత్త‌రాదిలోనూ భారీ స్థాయిలో వ‌సూళ్లు సునామీని సృష్టించింది. దీని ప్ర‌భావం వ‌ల్లే పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ న‌టించిన `రాధేశ్యామ్‌` ఐదు భాష‌ల్లో భారీ స్థాయిలో విడుద‌లైంది. డివైడ్ టాక్ ని సొంతం చేసుకున్నా రెండు వారాల పాటు త‌న స‌త్తాని చాటింది. ఆ త‌రువాత ఇదే ఊపుతో రాజ‌మౌళి తెర‌కెక్కించిన `ట్రిపుల్ ఆర్` కూడా థియేట‌ర్లలో సంద‌డి చేసింది. భారీ చిత్రాల‌కు మార్గం సుగ‌మం కావ‌డంతో ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో విడుద‌ల చేశారు.

ఈ మూవీస్ త‌రువాత టాలీవుడ్ లో ఇంకా బ్యాలెన్స్ గా వున్న నాలుగు సినిమాలు కూడా బ్యాక్ టు బ్యాక్ థియేట‌ర్ల‌లోకి రాబోతున్నాయి. ఏప్రిల్ 29న మెగాస్టార్ చిరంజీవి, రామ్ చ‌ర‌ణ్ క‌లిసి న‌టించిన `ఆచార్య‌` విడుద‌ల కాబోతోంది. దీని త‌రువాత మే 12నే సూప‌ర్ స్టార్ మ‌హేష్ న‌టించిన `స‌ర్కారు వారి పాట‌` రాబోతోంది. ఆ వెంట‌నే అంటే మే 27న విక్ట‌రీ వెంక‌టేష్ , వ‌రుణ్ తేజ్ ల `ఎఫ్ 3` ని కూడా విడుద‌ల చేస్తున్నారు. ఇక లాస్ట్ లో విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టించిన `లైగ‌ర్‌` ఆగ‌స్టులో థియేట‌ర్ల‌లోకి రాబోతోంది. ఈ సినిమాతో క‌రోనా ముందు నుంచి రిలీజ్ కోసం ఎదురుచూస్తున్న సినిమాల లిస్ట్ ఎండ్ కాబోతోంది.