Begin typing your search above and press return to search.

కొత్త క‌థ త‌గిలిందా.. రైట్ రైట్ అంటున్నారు!

By:  Tupaki Desk   |   12 Nov 2022 12:30 AM GMT
కొత్త క‌థ త‌గిలిందా.. రైట్ రైట్ అంటున్నారు!
X
క‌రోనా కార‌ణంగా రెండేళ్ల పాటు సినిమాల రిలీజ్ లు ఆల‌స్యం కావ‌డంతో మెగాస్టార్ చిరంజీవి నుంచి కిర‌ణ్ అబ్బ‌వ‌రం వ‌ర‌కు క‌థ న‌చ్చితే బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్ ల‌కు రైట్ రైట్ అంటూ ప‌చ్చ జెండా ఊపేస్తున్నారు. అందుకు ముందు అంగీక‌రించిన సినిమాలు సెట్స్ పై వున్నా స‌రే కొత్త వాళ్లు.. త‌మ‌తో సినిమాలు చేయాల‌ని లైన్ లో వున్న డైరెక్ట‌ర్ల‌కు, కొత్త క‌థ‌ల‌తో వ‌చ్చే వాళ్లకు ఓకే చెప్పేస్తున్నారు. ప్ర‌స్తుతం చేస్తున్న సినిమాల‌తో బిజీగా వున్నా స‌రే వెంట‌నే మ‌రో ప్రాజెక్ట్ ని లైన్ లో పెట్టేస్తున్నారు.

ఈ విష‌యంలో నేచుర‌ల్ స్టార్ నాని నుంచి నితిన్ వ‌ర‌కు ఎవ‌రూ ఎక్క‌డా త‌గ్గ‌డం లేదు. నేచుర‌ల్ స్టార్ నాని ప్ర‌స్తుతం 'ద‌స‌రా' మూవీలో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. ప‌క్కా తెలంగాణ నేప‌థ్యంలో సాగే ఈ మూవీలో నాని ఊర మాస్ పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నాడు. బొగ్గుగ‌ని కార్మికుడిగా సింగ‌రేణి కాల‌రీస్ కి చెందిన యువ‌కుడిగా హీరో నాని క‌నిపించ‌బోతున్నారు. ఇప్ప‌టికే విడుద‌లైన నాని లుక్ సినిమాపై అంచ‌నాల్ని పెంచేసింది. కీర్తి సురేష్ కూడా చాలా నేచుర‌ల్ గా క‌నిపించే క్యారెక్ట‌ర్ లో న‌టిస్తోంది. ఈ మూవీ ద్వారా కొత్త ద‌ర్శ‌కుడు శ్రీ‌కాంత్ ఓదెల ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నాడు.

చిత్రీక‌ర‌ణ పూర్తి చేసుకున్న ఈ మూవీ ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటోంది. వ‌చ్చే ఏడాది మార్చిలో ఈ మూవీని పాన్ ఇండియా స్థాయిలో ఐదు భాష‌ల్లో రిలీజ్ చేయ‌బోతున్నారు. ఈ మూవీ త‌రువాత నాని ..శౌర్య అనే యువ‌కుడిని ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం చేయ‌బోతున్నార‌ట‌. ప‌లు వెబ్ సిరీస్ ల‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన శౌర్య ఇటీవ‌ల నాని కి క‌థ వినిపించార‌ట‌. నానికి త‌ను చెప్పిన క‌థ బాగా న‌చ్చింద‌ని, రొమాంటిక్ కామెడీ ఎంట‌ర్ టైన‌ర్ గా తెర‌కెక్క‌నున్న ఈ మూవీని చెరుకూరి మోహ‌న్ నిర్మించే అవ‌కాశం వుంద‌ని తెలిసింది.

ప్ర‌స్తుతం త‌మిళ ద‌ర్శ‌కుడు వెంక‌ట్ ప్ర‌భుతో తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఓ ద్విభాషా చిత్రాన్ని చేస్తున్న నాగ‌చైత‌న్య త‌రువాత ప్రాజెక్ట్ పై ఆస‌క్తిక‌ర చ‌ర్చ జ‌రుగుతోంది. ఈ ప్రాజెక్ట్ కి ముందు ప‌ర‌శురాం ప్రాజెక్ట్ చేయాల్సింది. అయితే అనువార్య కార‌ణాల వ‌ల్ల వెంక‌ట్ ప్ర‌భు ప్రాజెక్ట్ ని చై లైన్ లో పెట్టారు. దీంతో ప‌ర‌శురాం ప్రాజెక్ట్ ఇక లేన‌ట్టేన‌నే కామెంట్ లు వినిపించాయి. అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం ప‌ర‌శురామ్ చెప్పిన క‌థ‌కు నాగ‌చైత‌న్య రీసెంట్ గా గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చార‌ని, వెంక‌ట్ ప్ర‌భు ప్రాజెక్ట్ త‌రువాత ఈ మూవీని ప‌ట్టాలెక్కించ‌నున్నార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. 14 ప్ల‌స్ రీల్స్ వారు నిర్మించ‌నున్నార‌ట‌.

చైతూ త‌ర‌హాలోనే శ‌ర్వానంద్ కూడా కొత్త ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశాడ‌ట‌. ఇటీవ‌ల కృష్ణ చైత‌న్య‌తో ఓ ప్రాజెక్ట్ ని ప్రారంభించిన శ‌ర్వానంద్ అనూహ్యంగా ఆ ప్రాజెక్ట్ ని ప‌క్క‌న పెట్టి కొత్త క‌థ‌ల కోసం వెత‌క‌డం మొద‌లు పెట్టార‌ట‌. ఈ నేప‌థ్యంలోనే భ‌లే మంచి రోజు,దేవ‌దాస్‌, హీరో చిత్రాల ద‌ర్శ‌కుడు శ్రీ‌రామ్ ఆదిత్య చెప్పిన క‌థ‌కు ఓకే చెప్పిన‌ట్టుగా తెలుస్తోంది. త్వ‌ర‌లోనే దీనికి సంబంధించిన ప్ర‌క‌ట‌న రానుంద‌ట‌.

ఇక ఇటీవ‌ల 'మాచ‌ర్ల నియోజ‌క వ‌ర్గం' అంటూ ప్రేక్ష‌కుల ముంద‌కొచ్చి ఫ్లాప్ ని చూసిన నితిన్ ప్ర‌స్తుతం వ‌క్కంతం వంశీ డైరెక్ష‌న్ లో ఓ మూవీ చేస్తున్నాడు. సురేంద‌ర్ రెడ్డి డైరెక్ష‌న్ లోనూ ఓ మూవీకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశాడు. ఇదే స‌మ‌యంలో త‌న‌కు 'భీష్మ‌'తో హిట్ ని అందించిన వెంకీ కుడుముల‌తో సినిమా చేయ‌బోతున్నాడ‌ట‌. మైత్రీ మూవీ మేక‌ర్స్ వారు ఈ మూవీని నిర్మించ‌నున్నార‌ని తెలిసింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.