Begin typing your search above and press return to search.

ఒక్కచోట చేరిన టాలీవుడ్ డైరెక్టర్స్.. ఫ్రేమ్ అదిరిందిగా..!

By:  Tupaki Desk   |   25 Aug 2022 5:49 AM GMT
ఒక్కచోట చేరిన టాలీవుడ్ డైరెక్టర్స్.. ఫ్రేమ్ అదిరిందిగా..!
X
తెలుగు సినిమా పరిశ్రమలో నటీనటులు దర్శకుల మధ్య ఎంత పోటీ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే అది ఆహ్లాదకరమైన పోటీ మాత్రమే. సినిమాలను పక్కన పెడితే బయట మాత్రం అందరూ ఎంతో సన్నిహితంగా ఉంటారు.. ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా దర్శకుల మధ్య మంచి అవగాహన ఉంది.

సినిమా సక్సెస్ అయినప్పుడు ఒకరినొకరు అభినందించుకోవడమే కాదు.. వీలు కుదిరినప్పుడల్లా కలిసి పార్టీలు చేసుకుంటారు. ఒకప్పుడైతే ఏవైనా సినీ వేడుకలు జరిగితేనో.. సినీ ఉత్సవాల సమయంలోనో.. ఇండస్ట్రీలో ఏదైనా ఈవెంట్ జరిగితేనో అందరూ ఒకచోట కలుస్తుంటారు. అయితే నేటి తరం డైరెక్టర్స్ మాత్రం తరచుగా కలుస్తూ కనిపిస్తుంటారు.

గతంలో టాలీవుడ్ డైరెక్టర్స్ అందరూ కలిసి సెలబ్రేట్ చేసుకున్న పార్టీలకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. అయితే ఇప్పుడు తాజాగా మన దర్శకులు అందరూ ఒకే ఫ్రేమ్ లో కనిపించి నెట్టింట సందడి చేస్తున్నారు. కాకపోతే ఈసారి ఏదో పార్టీలో కాకుండా చిత్ర పరిశ్రమలోని సమస్యల పరిష్కారం చర్చించడానికి ఒకచోట చేరారు.

టాలీవుడ్ ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం షూటింగులు నిలిపివేసి, చర్చలు కొనసాగించిన విషయం తెలిసిందే. 25 రోజులుగా సాగిన ఈ చర్చలన్నీ కొలిక్కి రావడంతో సెప్టెంబర్ 1 నుంచి తిరిగి చిత్రీకరణలు జరుపుకోడానికి పచ్చజెండా ఉపారు. ఈ నేపథ్యంలో ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ బుధవారం తన కార్యాలయంలో దర్శకులతో కీలక సమావేశం నిర్వహించింది.

సినిమా షూటింగ్స్ చేసుకోవచ్చని చలన చిత్ర వాణిజ్య మండలి ప్రకటించడంతో టాలీవుడ్ ఫిలిం మేకర్స్ అందరూ మళ్లీ రంగంలోకి దిగేందుకు సన్నద్ధమయ్యారు. సినిమా రూపకల్పనలో.. నిర్మాణ వ్యయాన్ని కంట్రోల్ చేయడంలో దర్శకుల పాత్ర కీలకమనే సంగతి తెలిసిందే. అందుకే వాళ్లతో ఫిలిం ఛాంబర్ సమావేశమైంది. దర్శకుల సమస్యల్ని అడిగి తెలుసుకోడమే కాదు.. వారి సలహాలు సూచనలు తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఈ సమావేశానికి ప్రస్తుతం టాలీవుడ్ లోని ప్రముఖ దర్శకులు అందరూ హాజరయ్యారు. స్టార్ డైరెక్టర్స్ త్రివిక్రమ్ శ్రీనివాస్ - కొరటాల శివ - బోయపాటి శ్రీను - సుకుమార్ - అనిల్ రావిపూడి లతో పాటుగా పరశురామ్ - మెహర్ రమేష్ - వేణు శ్రీరామ్ - బాబీ - బుచ్చిబాబు - కృష్ణచైతన్య - సుధీర్ వర్మ - శ్రీవాస్ తదితరులు హాజరయ్యారు. ఇండస్ట్రీలోని డైరెక్టర్స్ అందరూ సింగిల్ ఫ్రేమ్ లో కనిపించడంతో సినీ అభిమానులు దీనికి సంబంధించిన ఫోటోని సోషల్ మీడియాలో వైరల్ చేసేస్తున్నారు.

షూటింగ్స్ కు అనుమతి రావడంతో టాలీవుడ్ డైరెక్టర్స్ అంతా ఇప్పుడు తమ సినిమాలను షురూ చేసేందుకు రెడీ అవుతున్నారు. కొందరు కొత్త చిత్రాలను సెట్స్ మీదకు తీసుకురాడానికి ప్లాన్ చేసుకోగా.. మరికొందరు నిలిచిపోయిన సినిమాలను పునఃప్రారంభించడానికి షెడ్యూల్స్ వేసుకుంటున్నారు.

సుకుమార్ ఇటీవలే అల్లు అర్జున్ తో 'పుష్ప: ది రూల్' చిత్రాన్ని పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించారు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టనున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా SSMB28 ప్రాజెక్ట్ సెట్స్ మీదకు వెళ్లనుంది. కొరటాల శివ - జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో NTR31 మూవీ స్టార్ట్ కావాల్సి ఉంది.

రామ్ పోతినేని హీరోగా బోయపాటి శ్రీను ఓ పాన్ ఇండియా చిత్రాన్ని ప్లాన్ చేయగా.. నందమూరి బాలకృష్ణ తో అనిల్ రావిపూడి NBK108 సినిమా చేస్తున్నారు. చిరంజీవి తో మెహర్ రమేష్ చేస్తున్న 'భోళా శంకర్' మూవీ తదుపరి షెడ్యూల్ త్వరలోనే ప్రారంభం కానుంది. చిరు - బాబీ కాంబోలో 'వాల్తేరు వీరయ్య' కూడా చిత్రీకరణ దశలో ఉంది.

గోపీచంద్ తో శ్రీవాస్ హ్యాట్రిక్ సినిమా చేస్తుండగా.. రవితేజ హీరోగా సుధీర్ వర్మ 'రావణాసుర' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. బుచ్చిబాబు ప్రస్తుతం ఎన్టీఆర్ కోసం స్క్రిప్టు రెడీ చేసే పనిలో బిజీగా ఉన్నాడు. నాగచైతన్య కోసం పరశురామ్ కథ సిద్ధం చేస్తున్నారు.

'రౌడీ ఫెలో' 'చల్ మోహన్ రంగా' సినిమాలతో దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న ప్రముఖ గీత రచయిత కృష్ణ చైతన్య.. తదుపరి ప్రాజెక్ట్ ని పట్టాలెక్కించేందుకు సన్నద్ధం అవుతున్నాడు. శర్వానంద్ హీరోగా ఓ భారీ సినిమా ప్లాన్ చేస్తున్నారని సమాచారం.

ఇలా ప్రస్తుతం టాలీవుడ్ లో యాక్టీవ్ గా ఉన్న దర్శకులు అందరూ ఛాంబర్ లో జరిగిన మీటింగ్ లో పాల్గొన్నారు. అయితే ఎస్ఎస్ రాజమౌళి - పూరీ జగన్నాథ్ - వంశీ పైడిపల్లి - హరీష్ శంకర్ - సురేందర్ రెడ్డి - సందీప్ రెడ్డి వంగా - నాగ్ అశ్విన్ - మారుతి - క్రిష్ వంటి పలువురు దర్శకులు కూడా ఉండుంటే పిక్చర్ పర్ఫెక్ట్ గా ఉండేదని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.