Begin typing your search above and press return to search.

అత్య‌ధిక పారితోషికంలో వీళ్లే టాప్‌!

By:  Tupaki Desk   |   21 Jun 2022 2:30 AM GMT
అత్య‌ధిక పారితోషికంలో వీళ్లే టాప్‌!
X
టాలీవుడ్ లో హీరోల‌కున్న డిమాండ్‌, వారు సొంతం చేసుకుంటున్న పారితోశికాలు చాలా ఎక్కువే. గ‌తంతో పోలిస్తే ప్ర‌స్తుతం తెలుగు సినిమాకున్న మార్కెట్ ప‌రిథి పెరిగిన నేప‌థ్యంలో మ‌న హీరోలు భారీగానే డిమాండ్ చేస్తున్నారు. వీళ్ల‌తో పోలిస్తే హీరోయిన్ లు రెమ్యున‌రేష‌న్ లు చాలా త‌క్కువే అయితే చాలా మంది క్రేజీ హీరోయిన్ లు క‌రోనా త‌రువాత భారీ స్థాయిలో త‌మ పారితోషికాల‌ని పెంచేశారు. దీపం వుండ‌గానే ఇల్లు చ‌క్క‌బెట్టుకున్న‌ట్టుగా డిమాండ్ వుండ‌గానే భారీగా స‌ర్దేస్తున్నారు. వాళ్ల గురించి ఒక‌సారి చూద్దాం. ఈ లిస్ట్ లో క్రేజీ హీరోయిన్ లు దాదాపు 11 మంది వున్నారు.

ముందుగా టాప్ లో నిలుస్తున్న బ్యూటీ న‌య‌న‌తార‌. ఈ క్రేజీ లేడీ ఒక్క మూవీకి దాదాపు రూ. 10 కోట్లు డిమాండ్ చేస్తున్న‌ట్టుగా తెలుస్తోంది. ఈ హీరోయిన్ త‌రువాత స్థానంలో నిలుస్తోంది బుట్ట‌బొమ్మ‌ పూజా హెగ్డే. ఒక్క మూవీకి ఈ క్రేజీ లేడీ డిమాండ్ చేస్తున్న మొత్తం 2 నుంచి 3 కోట్లు.

అయితే ఈ మ‌ధ్య 5 కోట్ల వ‌ర‌కు డిమాండ్ చేస్తున్న‌ట్టుగా తెలుస్తోంది. ప్ర‌స్తుతం తెలుగులో ఈ హీరోయిన్ చేతిలో ప్ర‌స్తుతం రెండు భారీ ప్రాజెక్ట్ లున్నాయి. ఒక‌టి సూప‌ర్ స్టార్ మ‌హేష్ తో మ‌రొక‌టి విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా పూరి జ‌గ‌న్నాథ్ తెర‌కెక్కిస్తున్న `జ‌న‌గ‌ణ‌మ‌న‌`. ఈ రెండు చిత్రాల్లో ప్ర‌స్తుతం `జ‌న‌గ‌ణ‌మ‌న‌` షూటింగ్ మొద‌లైంది.

ఇక స్టార్ హీరోయిన్ స‌మంత కూడా బ‌గానే డిమాండ్ చేస్తోంది. మైథ‌లాజిక‌ల్ మూవీ `శాకుంత‌లం`ని పూర్తి చేసిన స‌మంత ప్ర‌స్తుతం విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో క‌లిసి `ఖుషీ`, సోలో హీరోయిన్ గా లేడీ ఓరియెంటెడ్ మూవీ `య‌శోద‌`లో న‌టిస్తోంది. ఒక్క మూవీకి స‌మంత డిమాండ్ చేస్తున్న అమౌంట్ 3 నుంచి 5 కోట్లు అని చెబుతున్నారు. వీరి త‌రువాతి స్థానంలో ర‌కుల్ ప్రీత్ సింగ్ నిలుస్తోంది. తెలుగులో పెద్ద‌గా అవ‌కాశాలు లేని ర‌కుల్ ప్ర‌స్తుతం హిందీ, త‌మిళ చిత్రాల్లో న‌టిస్తోంది. అజ‌య్ దేవ‌గ‌న్ తో చేసిన `ర‌న్ వే 34` కోసం మూడున్న‌ర కోట్లు డిమాండ్ చేసింద‌ట‌.

ఇక రీసెంట్ గా తెలుగులో రిలీజ్ అయిన `ఎఫ్ 3` మూవీతో ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది త‌మన్నా. ప్ర‌స్తుతం ఈ మిల్కీ బ్యూటీకి తెలుగులో పెద్ద‌గా డిమాండ్ లేదు.. సినిమాలు కూడా లేవు. `భోళా శంక‌ర్`లో చిరుకు జోడీగా న‌టిస్తోంది. ఈ మూవీతో పాటు స‌త్య‌దేవ్ హీరోగా న‌టించిన `గుర్తుందా సీతాకాలం` చేస్తోంది. ప్ర‌స్తుతం డిమాండ్ త‌గ్గినా స‌రే త‌మ‌న్నా ఒక్కో సినిమాకు 3 కోట్లు ఛార్జ్ చేస్తోంద‌ని చెబుతున్నాయి. `పుష్ప‌`తో పాన్ ఇండియా వైడ్ గా క్రేజ్ ని సొంతం చేసుకున్న ర‌ష్మిక కూడా భారీగానే డిమాండ్ చేస్తోంది. ఒక్కో సినిమాకు ఈ నేష‌న‌ల్ క్ర‌ష్ 3 కోట్లు డిమాండ్ చేస్తోంద‌ట‌.

ఇక చంద‌మామ కాజ‌ల్ 2 కోట్లు డిమాండ్ చేస్తుంటే దేవ‌సేన అనుష్క మాత్రం ఏకంగా 4 కోట్లు అడుగుతున్న‌ట్టు తెలుస్తోంది. `బాహుబ‌లి` సిరీస్ చిత్రాల త‌రువాత అనుష్క క్రేజ్ బాగా పెరిగింది. అంతే కాకుండా పాన్ ఇండియా వైడ్ గా పాపులారిటీని సొంతం చేసుకుంది. దీంతో త‌న క్రేజ్ ని దృష్టిలో పెట్టుకుని అనుష్క భారీగానే డిమాండ్ చేస్తోంద‌ని చెబుతున్నారు.

ప్ర‌స్తుతం అనుష్క న‌వీన్ పొలిశెట్టితో క‌లిసి ఓ మూవీ చేస్తోంది. వీరి త‌రువాత శృతిహాస‌న్‌, కీర్తి సురేష్ నిలిచారు. వీరు ఒక్కో సినిమాకు తీసుకుంటున్న పారితోషికం అక్ష‌రాలా 2 కోట్లు. ప్ర‌స్తుతం శృతి ఇద్ద‌రు సీనియ‌ర్ హీరోలు మెగాస్టార్ చిరంజీవి, నంద‌మూరి బాల‌కృష్ణ‌ల‌తో క‌లిసి రెండు చిత్రాల్లో న‌టిస్తోంది. ఈ సినిమాల‌కు శృతి త‌న డిమాండ్ కి మించే పారితోషికం తీసుకుని వుంటుద‌ని ఇన్ సైడ్ టాక్‌.