Begin typing your search above and press return to search.

ఇచ్చిన మాట నిల‌బెట్టుకున్న త్రివిక్ర‌మ్‌

By:  Tupaki Desk   |   26 Feb 2022 7:30 AM GMT
ఇచ్చిన మాట నిల‌బెట్టుకున్న త్రివిక్ర‌మ్‌
X
ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ న‌టించిన మూవీ `భీమ్లానాయ‌క్‌`. ప‌వ‌న్ క‌ల్యాణ్ ప‌వ‌ర్ ప్యాక్డ్ పెర్ఫార్మెన్స్ తో తెర‌కెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద వ‌సూళ్ల సునామీని సృష్టిస్తోంది. మ‌ల‌యాళ హిట్ ఫిల్మ్ `అయ్య‌ప్ప‌నుమ్ కోషియుమ్‌` ఆధారంగా ఈ చిత్రాన్ని రీమేక్ చేశారు. సాగ‌ర్‌ కె. చంద్ర డైరెక్ట్ చేసిన ఈ మూవీ గ‌త కొన్ని రోజుల‌గా వాయిదా ప‌డుతూ ఎట్ట‌కేల‌కు ఈ శుక్ర‌వారం ప్ర‌పంచ వ్యాప్తంగా థియేట‌ర్ల‌లోకి వ‌చ్చేసింది. `వ‌కీల్ సాబ్` సినిమా త‌రువాత ప‌వ‌న్ నుంచి వ‌స్తున్న సినిమా కావ‌డంతో అభిమానులు, ప్రేక్ష‌కులు ఈ మూవీపై భారీ అంచ‌నాలతో థియేట‌ర్ల‌కు వ‌చ్చారు.

సినిమాలో ప‌వన్ ప‌వ‌ర్ ఫుల్ పాత్ర‌లో క‌నిపించ‌డం.. ప‌వ‌న్ న‌ట విశ్వ‌రూపం క‌నిపించ‌డంతో ఈ చిత్రానికి ప్రేక్ష‌కులు, అభిమానులు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. అత్య‌ధిక సెంట‌ర్ల‌లో విడుద‌లైన ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద సంచ‌ల‌నాలు సృష్టిస్తోంది. ఇదిలా వుంటే ఈ మూవీ స‌క్సెస్ పై ఓ ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ నెట్టింట జ‌రుగుతోంది. మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ త‌ను ఇచ్చిన మాట‌ని నిల‌బెట్టుకున్నాడ‌ని అంటున్నారు. వివ‌రాల్లోకి వెళితే.. ప‌వ‌న్ క‌ల్యాణ్ - త్రివిక్ర‌మ్ మ‌ధ్య వున్న అనుబంధం గురించి ఇండ‌స్ట్రీలో వున్న ప్ర‌తీ ఇక్క‌రికీ తెలిసిందే.

అయితే వీరిద్ద‌రి క‌ల‌యిక‌లో వ‌చ్చిన `అజ్ఞాత‌వాసి` త‌రువాత త్రివిక్ర‌మ్ టార్గెట్ అవుతూ వ‌స్తున్నాడు. అన్నీ తెలిసి కూడా త్రివిక్ర‌మ్ ఇలాంటి డిజాస్ట‌ర్ ని అందించాడేంట‌ని ప‌వ‌న్ అభిమానులు ఓ రేంజ్ లో త్రివిక్ర‌మ్ ని ఆడుకున్నారు. చాలా వ‌ర‌కు ట్రోల్ చేశారు కూడా. ఇంత జ‌రిగానా ఈ సినిమా ఫ‌లితం ప‌వ‌న్ - త్రివిక్ర‌మ్ ల స్నేహ బంధంపై ఎలాంటి ప్ర‌భావాన్ని చూపించ‌లేక‌పోయింది. కార‌ణం త్రివిక్ర‌మ్ పై ప‌వ‌న్ కున్న న‌మ్మ‌క‌మే. అదే వారి మ‌ధ్య ఎలాంటి మ‌న‌స్ప‌ర్థ‌లు రాకుండా చేసింది.

అది గ‌మ‌నించిన త్రివిక్ర‌మ్ .. ప‌వ‌న్ ని మ‌ళ్లీ ఎలాగైనా స‌క్సెస్ ట్రాక్ లోకి తీసుకురావాల‌ని భావించి `పింక్‌` రీమేక్ చేయ‌మ‌ని చెప్పార‌ట‌. దాదాపు మూడున్న‌రేళ్ల విరామం త‌రువాత ప‌వ‌న్ చేసిన ఈ మూవీ త‌న‌కు ఎలాంటి ఫ‌లితాన్ని అందించిందో తెలిసిందే. తాజాగా `అయ్య‌ప్ప‌నుమ‌మ్ కోషియుమ్‌` చిత్రాన్ని ప్ర‌త్యేకంగా చూసిన త్రివిక్ర‌మ్ దీన్ని కూడా చేస్తే బాగుంటుంద‌ని ప‌వ‌న్ కు బ‌లంగా చెప్పార‌ట‌. ఈ మూవీ ఆధారంగా రూపొంది రీసెంట్ గా విడుద‌లైన `భీమ్లానాయ‌క్‌` బాక్సాఫీస్ వ‌ద్ద బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచింది. ఈ చిత్రానికి త్రివిక్ర‌మ్ డైరెక్ట‌ర్ కాదు కానీ ప్ర‌త్యేక ఫోక‌స్ పెట్టి స్క్రీన్ ప్లే, డైలాగ్స్ తో పాటు క‌థా విస్త‌ర‌ణ‌లో భాగం అయ్యారు. తెర వెనుక వుండి అంతా తానై న‌డిపించారు.

ప‌వ‌న్‌కు ఎలాగైనా ఈ సినిమాతో మ‌రో బ్లాక్ బ‌స్ట‌ర్ ని అందించాల‌ని భావించి వ‌ర్క్ చేశారు. ఫ‌లితంగా `భీమ్లా నాయ‌క్‌` బాక్సాణీస్ వ‌ద్ద బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచింది. `అజ్ఞాత‌వాసి`లో ఫ్లాప్ ని అందించిన త్రివిక్ర‌మ్ తాజాగా `భీమ్లానాయ‌క్‌`తో బ్లాక్ బ‌స్ట‌ర్ అందించిన త‌న ప్రామిస్ ని నిల‌బెట్టుకున్నాడు. ఈ చిత్రానికి త‌ను చేసిన వ‌ర్క్ కి ఫ్యాన్స్ ఫిదా అయిపోయార‌ట‌. ఈ స‌క్సెస్ నేప‌థ్యంలో ప‌వ‌న్ కు త్రివిక్ర‌మ్ మ‌రో ప్రామిస్ చేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. త‌మిళ హిట్ ఫిల్మ్ `వినోధాయ సిత‌మ్‌`.

స‌ముద్ర‌ఖ‌ని న‌టించి తెర‌కెక్కించిన ఈ మూవీ విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌ల‌తో పాటు అక్క‌డ భారీ విజ‌యాన్ని సాధించింది. ఈ మూవీ రీమేక్ హ‌క్కుల్ని తాజాగా ద‌క్కించుకున్నారు. దీన్ని రీమేక్ చేసే బాధ్య‌త‌ల్ని ప‌వ‌న్ ..త్రివిక్ర‌మ్ కు అప్ప‌గించార‌ట‌. ప్ర‌స్తుతం దీనిపై వ‌ర్క్ చేయ‌బోతున్నారాయ‌న‌. ఇందులో ప‌వ‌న్ న‌టిస్తాడా? లేక సాయి ధ‌ర‌మ్ తేజ్ న‌టిస్తాడా? అన్న‌ది తెలియాల్సి వుంది.