Begin typing your search above and press return to search.

SSMB29 కోసం ఇద్ద‌రు స‌ర్ ప్రైజింగ్ స్టార్స్‌?

By:  Tupaki Desk   |   30 May 2022 5:27 AM GMT
SSMB29 కోసం ఇద్ద‌రు స‌ర్ ప్రైజింగ్ స్టార్స్‌?
X
సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు రెండేళ్ల విరామం త‌రువాత 'స‌ర్కారు వారి పాట‌' మూవీతో ప్రేక్ష‌కుల ముందుకొచ్చారు. ప‌ర‌శురామ్ డైరెక్ష‌న్ లో తెర‌కెక్కిన ఈ చిత్రం ఇటీవ‌లే ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన ఈ మూవీ తొలి రోజే డివైడ్ టాక్ ని సొంతం చేసుకుని ప్రేక్ష‌కుల్ని, అభిమానుల్ని ఆశించిన స్థాయిలో సంతృప్తి ప‌ర‌చ‌లేక‌పోయింది. అయితే క‌లెక్ష‌న్ ల ప‌రంగా కొంత వ‌ర‌కు ఫ‌ర‌వాలేద‌నిపించింది. కీర్తి సురేష్ హీరోయిన్ గా న‌టించిన ఈ మూవీని మైత్రీ మూవీ మేక‌ర్స్‌, 14 ప్ల‌స్ రీల్స్‌, జీఎంబీ ఎంట‌ర్ టైన్‌మెంట్స్ సంస్థ‌లు సంయుక్తంగా నిర్మించాయి.

ఈ మూవీ త‌రువాత మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ తెర‌కెక్కించ‌నున్న SSMB28 కోసం రెడీ అవుతున్నారు మ‌హేష్. ఈ మూవీ పూజా కార్య‌క్ర‌మాల్ని ఇటీవ‌లే పూర్తి చేసుకుంది. ప్ర‌స్తుతం వెకేష‌న్ పూర్తి చేసుకుని హైద‌రాబాద్ తిరిగి వ‌చ్చిన మ‌హేష్ .. త్రివిక్ర‌మ్ ప్రాజెక్ట్ పై దృష్టి పెట్టారు.

ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ జూలై నుంచి ప్రారంభం కాబోతోంది. ఇదిలా వుంటే ఈ మూవీ త‌రువాత మ‌హేష్ చేయ‌బోతున్న SSMB29 కు సంబంధించిన రోజుకో వార్త నెట్టింట హ‌ల్ చ‌ల్ చేస్తోంది. త్రివిక్ర‌మ్ ప్రాజెక్ట్ త‌రువాత మ‌హేష్ ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి డైరెక్ష‌న్ లో ఓ అడ్వెంచ‌ర‌స్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ ని చేయ‌బోతున్న విష‌యం తెలిసిందే.

ఇటీవ‌ల 'ట్రిపుల్ ఆర్‌'తో పాన్ ఇండియా వైడ్ గా మ‌రో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ ని త‌న ఖాతాలో వేసుకున్న రాజ‌మౌళి ఈ సారి సూప‌ర్ స్టార్ మ‌హేష్ తో అంత‌కు మించిన మూవీని తెర‌పైకి తీసుకురావాల‌ని ప్లాన్ చేస్తున్న విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే ఫైన‌ల్ లైన్ ని, స్క్రిప్ట్ ని లాక్ చేసిన రాజ‌మౌళి ఈ మూవీని భారీ లెవెల్లో క‌నీ వినీ ఎరుగ‌ని స్థాయిలో తెర‌పై ఆవిష్క‌రించ‌బోతున్నార‌ట‌. ఈ సినిమా కోసం క‌మ‌ల్ హాస‌న్ ని కీల‌క పాత్ర కోసం రాజ‌మౌళి అడుగుతున్నారంటూ వార్త‌లు వినిపిస్తున్న నేప‌థ్యంలో తాజాగా ఈ మూవీకి సంబంధించి మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన వార్త ఇప్ప‌డు హ‌ల్ చ‌ల్ చేస్తోంది.

ఆఫ్రికా అడ‌వుల నేప‌థ్యంలో సాగే అడ్వెంచ‌ర‌స్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ గా రూపొంద‌నున్నీ మూవీ కోసం ఇద్ద‌రు టాప్ స్టార్స్ ని రంగంలోకి దింపాల‌ని రాజ‌మౌళి ప్లాన్ చేస్తున్నార‌ట‌. హాలీవుడ్ స్థాయి మేకింగ్ టేకింగ్ తో సాగే ఈ సినిమా లో ఇద్ద‌రు ప్ర‌ధాన విల‌న్ లు వుంటార‌ని తెలుస్తోంది. ఆ పాత్ర‌ల కోసం ఇద్ద‌రు క్రేజీ స్టార్ ల‌ని రంగంలోకి దించ‌బోతున్నార‌ట‌. ఓ విల‌న్ గా త‌మిళ హీరో, హీరో సూర్య సోద‌రుడు కార్తిని అనుకుంటున్నార‌ట‌. మ‌రో విల‌న్ గా బాలీవుడ్ స్టార్ ని రంగంలోకి దించాల‌ని ప్లాన్ చేస‌క్తున్నార‌ట‌.

ఇప్ప‌టికే ఈ విష‌యాన్ని త‌మిళ హీరో కార్తికి వెల్ల‌డించార‌ని, బాలీవుడ్ లో మ‌రో స్టార్ కోసం రాజ‌మౌళి అన్వేష‌ణ మొద‌లు పెట్టార‌ని తాజా స‌మాచారం. మ‌రి మ‌హేష్ మూవీలో నెగెటివ్ పాత్ర‌లో క‌నిపించ‌డానికి కార్తి ఒప్పుకుంటాడా? అన్న‌ది తెలియాల్సి వుంది. గ‌తంలో రాజ‌మౌళి డైరెక్ష‌న్ లో న‌టించ‌డానికి ఆస‌క్తిగా వుంద‌ని హీరో సూర్య వెల్ల‌డించిన విష‌యం తెలిసిందే. అయితే హీరోగా వ‌రుస క్రేజీ ప్రాజెక్ట్ ల‌లో న‌టిస్తున్న కార్తి త‌న కెరీర్ ని ప‌ణంగా పెట్టి నెగెటివ్ క్యారెక్ట‌ర్ ని రాజ‌మౌళి, మ‌హేష్ ల కోసం అంగీక‌రిస్తాడా? అన్న‌దే మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌.