Begin typing your search above and press return to search.

బాలీవుడ్ లో VD క్రేజ్ కు ఇదే నిదర్శనం..!

By:  Tupaki Desk   |   23 July 2022 10:30 AM GMT
బాలీవుడ్ లో VD క్రేజ్ కు ఇదే నిదర్శనం..!
X
'అర్జున్ రెడ్డి' సినిమాతో యూత్ లో మంచి ఫాలోయింగ్ ఏర్పరచుకున్న యువ హీరో విజయ్ దేవరకొండ.. ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వీడీ నటించిన 'లైగర్' చిత్రాన్ని తెలుగు తమిళ మలయాళ కన్నడ హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు. అయితే ఈ సినిమా రిలీజ్ కాకముందే రౌడీ స్టార్ బీటౌన్ లో హాట్ టాపిక్ గా మారాడు.

'లైగర్' చిత్రాన్ని ఆగస్ట్ 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి తీసుకురానున్నారు. ఈ నేపథ్యంలో మేకర్స్ జోరుగా ప్రమోషన్స్ చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇటీవల హైదరాబాద్ మరియు ముంబై నగరాలలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. అయితే ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సుదర్శన్ థియేటర్ లో ఈవెంట్ కు ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో.. ముంబైలోనూ అలాంటి స్పందనే రావడం విశేషం.

అంధేరీ సినీపోలీస్ లో జరిపిన కార్యక్రమంలో 'లైగర్' ట్రైలర్ ను విడుదల చేశారు. దీనికి బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్ గెస్టుగా హాజరవ్వగా.. విజయ్ దేవరకొండ చాలా సింపుల్ గా చెప్పులతో వచ్చి అందరినీ ఆశ్చర్యపరిచాడు. తన స్పీచ్ తో బీటౌన్ జనాల దృష్టిని మరింతగా ఆకర్షించాడు.

'లైగర్' ట్రైలర్ ఈవెంట్ ముగిసిన తర్వాత విజయ్ దేవరకొండ బయటకు వెళ్తుండగా.. పెద్ద సంఖ్యలో అభిమానులు అతన్ని అనుసరిస్తూ 'రౌడీ రౌడీ..' అంటూ స్లొగన్స్ చేస్తూ ఉత్సాహంగా చప్పట్లు కొడుతూ ఈలలు వేస్తూ కనిపించారు. విజయ్ సైతం ప్రేక్షకుల ప్రేమకు కృతజ్ఞతలు తెలుపుతూ కనిపించాడు. దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి.

సాధారణంగా హైదరాబాద్ లో మన హీరోలకు అలాంటి క్రేజ్ ఉంటుంది. ఇటీవల కాలంలో పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటడం మొదలైన తర్వాత టాలీవుడ్ స్టార్స్ కి బాలీవుడ్ లో ఘనస్వాగతం లభిస్తోంది. ఈ క్రమంలో విజయ్ దేవరకొండ కూడా ఇప్పుడు ముంబైలో క్రేజీ హీరోగా మారిపోయాడని తెలుస్తోంది.

మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన 'లైగర్' చిత్రంలో విజయ్ దేవరకొండ సరసన అనన్య పాండే హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రంతో బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ ఇండియన్ స్క్రీన్ పై అరంగేట్రం చేస్తున్నారు. పూరి కనెక్ట్స్ - ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్లపై పూరి జగన్నాథ్ - ఛార్మీ కౌర్ - కరణ్ జోహర్ - అపూర్వ మెహతా సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు.

'లైగర్' సినిమా నుంచి ఇప్పటికే వచ్చిన టీజర్, పోస్టర్లు , ఫస్ట్ సింగిల్ మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. లేటెస్టుగా రిలీజ్ చేయబడిన ట్రైలర్ సోషల్ మీడియాలో మిలియన్ల వ్యూస్ తో ట్రెండింగ్ లో కొనసాగుతోంది. మరి వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా విజయ్ దేవరకొండకు ఎలాంటి ఇమేజ్ తెచ్చిపెడుతుందో చూడాలి.