Begin typing your search above and press return to search.

ఎలివేష‌న్ లు స‌రే క‌థేక్క‌డంటున్నారుగా!

By:  Tupaki Desk   |   13 Jan 2023 7:19 AM GMT
ఎలివేష‌న్ లు స‌రే క‌థేక్క‌డంటున్నారుగా!
X
త‌మిళ స్టార్ హీరో ద‌ళ‌ప‌తి విజ‌య్ క‌థానాయ‌కుడిగా టాలీవుడ్ డైరెక్ట‌ర్ వంశీ పైడిప‌ల్లి తెర‌కెక్కించిన ఫ్యామిలీ యాక్ష‌న్ డ్రామా 'వారీసు'. స్టార్ ప్రొడ్యూస‌ర్ దిల్ రాజు అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మించిన ఈ మూవీ సంక్రాంతి సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 11నే త‌మిళ వెర్ష‌న్ ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. తెలుగు సినిమాలు సంక్రాంతి బ‌రిలో భారీ స్థాయిలో రిలీజ్ అవుతున్న నేప‌థ్యంలో ఈ మూవీ తెలుగు వెర్ష‌న్ ని మూడు రోజుల ఆల‌స్యంగా విడుద‌ల చేస్తున్నారు.

తెలుగులో క్రేజీ స్టార్ల‌తో వంశీ పైడిప‌ల్లి సినిమాలు చేసిన విష‌యం తెలిసిందే. ప్ర‌భాస్ తో మున్నా, రామ్ చ‌ర‌ణ్‌, బ‌న్నీల‌తో ఎవ‌డు, ఎన్టీఆర్ తో 'బృందావ‌నం, నాగార్జున‌, కార్తీల‌తో 'ఊపిరి', మ‌హేష్ బాబుతో మ‌హ‌ర్షి వంటి సినిమాలు అందించాడు. ప్ర‌భాస్ తో చేసిన 'మున్నా'ని ప‌క్క‌న పెడితే వంశీ పైడిప‌ల్లి చేసిన ప్ర‌తీ సినిమా హిట్టే. ద‌ర్శ‌కుడిగా మంచి ట్రాక్ రికార్డ్ వున్నా వంశీ పైడిప‌ల్లికి 'మ‌హ‌ర్షి' త‌రువాత టాలీవుడ్ లో ఏ స్టార్ హీరో అందుబాటులో లేకుండా పోయాడు.

'మ‌హ‌ర్షి' త‌రువాత మ‌హేష్ తో సినిమా చేయాల‌ని విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేశాడు. కానీ క‌థ విష‌యంలో మ‌హేష్ ని మెప్పించ‌లేక‌పోవ‌డంతో వంశీ పైడిప‌ల్లి మ‌రో మరో హీరో కోసం వెతుక్కోవాల్సి వ‌చ్చింది. బ‌న్నీ, రామ్ చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్.. ఇలా ప్ర‌తీ హీరోని ట‌చ్ చేసినా డేట్స్ కుద‌ర‌క‌పోవ‌డం.. ఇత‌ర ప్రాజెక్ట్ ల‌తో బిజీగా వుండ‌టంతో తెలుగులో వంశీ పైడిప‌ల్లికి హీరో ల‌భించ‌లేదు. ఇదే స‌మ‌యంలో దిల్ రాజు ఇచ్చిన ఐడియాతో త‌మిళ హీరో విజ‌య్ కి క‌థ న‌రేట్ చేయ‌డం, త‌ను ఓకే చెప్ప‌డంతో 'వారీసు' ప‌ట్టాలెక్కింది.

అయితే ఇదేమైనా కొత్త క‌థా? అంటే అదీ కాదూ.. తెలుగులో చాలా సార్లు మార్చి మార్చి తీసి అరిగిపోయిన స్టోరీ. దాన్నే మ‌ళ్లీ విజ‌య్ కి చెప్ప‌డం.. త‌ను ఓకే చేయ‌డంతో సెట్స్ పైకి వెళ్లింది.

అభిమానుల భారీ అంచ‌నాల మ‌ధ్య విడుద‌లైన 'వారీసు' అక్క‌డ ఫ్యాన్స్ ని మోస్తారుగా ఆక‌ట్టుకుంటోంది. విజ‌య్ ని భారీ ఎలివేష‌న్ సీన్ ల‌తో ఎలివేట్ చేయ‌డం అక్క‌డి ఫ్యాన్స్ ని అమితంగా అల‌రిస్తోంది. అయితే క‌థ విష‌యానికి వ‌చ్చేసే స‌రికి ఫ్యాన్స్ చాలా వ‌ర‌కు డిజ‌ప్పాయింట్ అవుతున్నార‌నే కామెంట్ లు వినిపిస్తున్నాయి.

విజ‌య్ ఎలివేష‌న్ ల‌కు మాత్ర‌మే ప్రాధాన్య‌త‌నిచ్చిన ద‌ర్శ‌కుడు క‌థ‌ని మాత్రం మ‌రిచిపోయాడ‌ని నెట్టింట కామెంట్ లు వినిపిస్తున్నాయి. విజ‌య్ లాంటి స్టార్ హీరో కు స‌రైన క‌థ ప‌డితే దాని రేంజ్ నెక్స్ట్ లెవెల్ లో వుంటుంద‌ని, ఆ విష‌యంలో ద‌ర్శ‌కుడు వంశీ పైడిప‌ల్లి ఫెయిల్ అయ్యాడ‌ని త‌మిళ తంబీలు ఫైర్ అవుతున్నార‌ట‌. విజ‌య్ కి త‌గ్గ మాస్ ఎలివేష‌న్ లు, ఆఫీస్ సీన్ లు వున్నా అంత‌కు త‌గ్గ రీతిలో ఖ‌థ కూడా కొత్త‌గా వుంటే 'వారీసు' రేంజ్ మ‌రో లెవెల్లో వుండేద‌ని కామెంట్ లు చేస్తున్నార‌ట‌.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.