Begin typing your search above and press return to search.

నాగ్ టైటిల్ పై మనసు పడ్డ విజయ్..?

By:  Tupaki Desk   |   16 Jun 2022 4:30 PM GMT
నాగ్ టైటిల్ పై మనసు పడ్డ విజయ్..?
X
'మహర్షి' వంటి నేషనల్ అవార్డ్ విన్నింగ్ చిత్రాన్ని అందించిన డైరెక్టర్ వంశీ పైడిపల్లి.. మూడేళ్ళ గ్యాప్ తీసుకొని ఇప్పుడు కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తో ఓ సినిమాని తెరకెక్కిస్తున్నారు. #Thalapathy66 అనే వర్కింగ్ టైటిల్ తో సెట్స్ మీదకు వెళ్లిన ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో దిల్ రాజు - శిరీష్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇదొక ద్విభాషా చిత్రం. అంతేకాదు విజయ్ కు ఫస్ట్ స్ట్రెయిట్ తెలుగు సినిమా. టాలీవుడ్ ఫిలిం మేకర్స్ - కోలీవుడ్ హీరో కలిసి చేస్తున్న ఈ ప్రాజెక్ట్ పై తమిళంతో పాటు తెలుగులోనూ మంచి అంచనాలు నెలకొన్నాయి.

అయితే తలపతి66 సినిమా టైటిల్ కు సంబంధించిన ఓ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే, విజయ్ సినిమా కోసం చిత్ర బృందం ''వారసుడు'' అనే టైటిల్‌ ను పరిశీలిస్తున్నారట. ఇది తెలుగు వెర్షన్ కు మాత్రమే టైటిల్‌ గా ఉండబోతుందట. తమిళ్ లో వేరొక టైటిల్‌ ను లాక్ చేయబోతున్నారట.

గతంలో తెలుగులో 'వారసుడు' అనే టైటిల్ తో అక్కినేని నాగార్జున సూపర్ హిట్ అందుకున్నారు. ఇప్పుడు తన ఊపిరి హీరో టైటిల్ ను వంశీ పైడిపల్లి.. విజయ్ చిత్రానికి ఫిక్స్ చేయనున్నట్లు చెప్పుకుంటున్నారు. ఇందులో నిజమెంతో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.

ఇకపోతే ఈ సినిమాలో విజయ్ సరసన రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తోంది. ప్రభు - శరత్ కుమార్ - ప్రకాష్ రాజ్ - జయసుధ - శ్రీకాంత్ - కిక్ శామ్ - యోగి బాబు - సంగీత - సంయుక్త తదితరులు ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

భారీ నిర్మాణ విలువలతో లావిష్ అండ్ విజువల్ గ్రాండియర్ తెరకెక్కుతున్న ఈ చిత్రానికి అత్యున్నత స్థాయిలో సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు. వంశీ పైడిపల్లితో పాటు హరి - అహిషోర్‌ సాల్మన్‌ ఈ సినిమాకు కథ - స్క్రీన్ ప్లేను అందిస్తున్నారు. ఎస్ఎస్ థమన్ సంగీతం సమకూరుస్తుండగా.. కార్తీక్ పలనీ సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్నారు.

డబ్బింగ్ సినిమాలతో తెలుగులో మార్కెట్ ఏర్పరచుకున్న విజయ్ ఇటీవల ''బీస్ట్'' చిత్రంతో ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయారు. దీంతో వంశీ పైడిపల్లి చిత్రంతో బ్లాక్ బస్టర్ సాధించాలని నిర్ణయించుకున్నారు. Thalapathy66 చిత్రాన్ని 2023 పొంగల్ బరిలో నిలపనున్నట్టు నిర్మాత దిల్ రాజు ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు.