Begin typing your search above and press return to search.

తమిళ దర్శకుడితో గోపీచంద్ సినిమా లేనట్లేనా..?

By:  Tupaki Desk   |   21 July 2022 1:30 AM GMT
తమిళ దర్శకుడితో గోపీచంద్ సినిమా లేనట్లేనా..?
X
'తొలి వలపు' సినిమాతో హీరోగా పరిచయమైన గోపీచంద్.. వెంటనే 'జయం' చిత్రంలో విలన్ గా కనిపించి అందరినీ ఆశ్చర్య పరిచాడు. ఈ క్రమంలో వెంటవెంటనే 'నిజం' 'వర్షం' సినిమాల్లోనూ ప్రతినాయకుడిగా నటించి మెప్పించాడు. అయితే ఆ తర్వాత 'యజ్ఞం' మూవీతో మళ్లీ హీరోగా మారి విజయాన్ని అందుకున్నాడు.

కెరీర్ ప్రారంభం నుంచీ మాస్ యాక్షన్ సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు మ్యాచో స్టార్ గోపీచంద్. 'ఆంధ్రుడు' 'గోలీమార్' 'లక్ష్యం' 'రణం' 'లౌక్యం' వంటి సూపర్ హిట్లు అందుకున్నారు. అయితే కొన్నేళ్లుగా గోపీ ఆశించిన సక్సెస్ మాత్రం అందుకోలేకపోతున్నారు.

గతేడాది 'సీటీమార్' సినిమాతో గోపీచంద్ ఓ మోస్తరు విజయాన్ని అందుకున్నాడు కానీ.. 'లౌక్యం' రేంజ్ హిట్టయితే కాలేదు. దీంతో 'పక్కా కమర్షియల్' చిత్రం పై భారీ ఆశలు పెట్టుకున్నాడు. ప్రమోషనల్ కంటెంట్ తో ఆసక్తి కలిగించిన ఈ సినిమా.. గోపీచంద్ కు నిరాశే మిగిల్చింది.

మారుతి దర్శకత్వంలో గోపీచంద్ - రాశీ ఖన్నా జంటగా తెరకెక్కిన 'పక్కా కమర్షియల్' సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఫస్ట్ వీకెండ్ లో మంచి వసూళ్లనే రాబట్టింది కానీ.. ఆ తర్వాత నుంచీ బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. ఇదిలా ఉంటే గోపీచంద్ కమిట్ అయిన ఓ ప్రాజెక్ట్ పై నీలినీడలు కమ్ముకున్నాయనే టాక్ వినిపిస్తోంది.

తమిళ దర్శకుడు హరి మరియు గోపీ చంద్ కాంబినేషన్ లో ఓ మూవీ తెరకెక్కనుందని చాలా రోజుల క్రితమే వార్తలు వచ్చాయి. 'యముడు' 'సింగం' సినిమాలతో తెలుగులోనూ క్రేజ్ ఏర్పరచుకున్న మాస్ డైరెక్టర్ హరి.. టాలీవుడ్ మ్యాచో స్టార్ కు సరిపడే ఓ స్క్రిప్టు రెడీ చేసినట్లు తెలుస్తోంది.

అయితే ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ ని పక్కన పెట్టే అవకాశం ఉందని.. హరి - గోపీ కలిసి సినిమా చేయకపోవచ్చని ఓ రూమర్ ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది. దీంతో ఈ సినిమాని సెట్స్ మీదకు తీసుకెళ్లాలని సన్నాహాలు చేసుకున్న నిర్మాతలు డైలమాలో ఉన్నారని టాక్ వచ్చింది.

ఇకపోతే గోపీచంద్ ప్రస్తుతం శ్రీవాస్ దర్శకత్వంలో హ్యాట్రిక్ మూవీ చేస్తున్నారు. గతంలో వీరి కలయికలో వచ్చిన 'లక్ష్యం' 'లౌక్యం' సినిమాకు సక్సెస్ అవ్వడం ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. అందులోనూ ఇది గోపి కెరీర్ లో మైలురాయి 30వ చిత్రం. దీనికి "లక్ష్యం 2" అనే టైటిల్ ప్రచారంలో ఉంది.

కోల్‌ కతా బ్యాక్‌ డ్రాప్‌ లో ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రానికి భూపతి రాజా కథ అందిస్తున్నారు. ఇందులో గోపీచంద్ సరసన డింపుల్‌ హయాతీ హీరోయిన్ గా నటిస్తుండగా.. జగపతిబాబు - కుష్భూ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించనుండగా.. వివేక్ కుచిభోట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మిక్కీ జే మేయర్‌ సంగీతం సమకూరుస్తున్నారు. వెట్రి పళనిస్వామి సినిమాటోగ్రఫీ నిర్వహిస్తుండగా.. వెలిగొండ శ్రీనివాస్‌ మాటలు రాస్తున్నారు.