Begin typing your search above and press return to search.

నయన్ దంపతులకు షాక్.. సరోగసీపై విచారణ చేపట్టనున్న ప్రభుత్వం..!

By:  Tupaki Desk   |   10 Oct 2022 12:39 PM GMT
నయన్ దంపతులకు షాక్.. సరోగసీపై విచారణ చేపట్టనున్న ప్రభుత్వం..!
X
సౌత్ స్టార్ కపుల్ నయనతార మరియు విఘ్నేష్ శివన్ కవల పిల్లలకు తల్లిదండ్రులైన సంగతి తెలిసిందే. తాము ట్విన్స్ కు పేరెంట్స్ అయ్యాం అంటూ సోషల్ మీడియా వేదికగా ఆదివారం ప్రకటించారు. ఈ ఏడాది జూన్ 9న వివాహ బంధంలోకి అడుగుపెట్టిన ఈ జంట.. నయన్ విఘ్నేన్లు నాలుగు నెలలకే బిడ్డలకు జన్మనివ్వడం ఏంటని అందరూ ఆశ్చర్యపోయారు. ఈ నేపథ్యంలో సరోగసీ విధానం ద్వారానే ఈ జంట తల్లిదండ్రులయ్యారనే వాదన వినిపిస్తోంది.

నయన్ - విగ్నేష్ దంపతులు సంతోషంగా పిల్లల పాదాలను ముద్దాడుతూ ఫోటోలు షేర్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పలువురు వారికి శుభాకాంక్షలు చెబుతుంటే.. మరికొందరు మాత్రం భారతదేశంలో బ్యాన్ చేయబడిన సరోగసీ ద్వారా ఎలా బిడ్డలకు జన్మనిచ్చారు అంటూ ప్రశ్నిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం సెలబ్రిటీ కపుల్ కు షాక్ ఇచ్చింది.

నయనతార - విఘ్నేష్ శివన్‌ లను సరోగసీకి సంబంధించిన వివరాలను సమర్పించాల్సిందిగా ప్రభుత్వం త్వరలో కోరనున్నట్లు తమిళనాడు ఆరోగ్య శాఖా మంత్రి సుబ్రహ్మణియన్ ప్రకటించారు. సరోగసీ ప్రక్రియ సక్రమంగా జరిగిందా లేదా? అనే దానిపై కూడా నయన్ దంపతులను ఆరా తీస్తామని ఆయన తెలిపారు. ఇవన్నీ చూస్తుంటే తల్లిదండ్రులైన మరుసటి రోజే ఈ జంట వివాదంలో చిక్కుకున్నట్లు తెలుస్తోంది.

నయన్ తల్లి అయిన నేపథ్యంలో ఒక సీనియర్ నటి అద్దె గర్భం గురించి ట్వీట్ చేయడం నెట్టింట చర్చనీయాంశమైంది. 'వైద్యపరంగా అనివార్య కారణాల వల్ల తప్ప భారతదేశంలో సరోగసీ నిషేధించబడింది. ఇది జనవరి 2022 నుండి వచ్చిన చట్టం. మేము దీని గురించి చాలా రోజులు వినబోతున్నాము' అని ట్వీట్ లో పేర్కొంది.

అర్హత గల న్యాయవాదిగా ఈ చట్టంపై విశ్లేషించే హక్కు తనకు ఉందని.. ఈ ట్వీట్ ఎవరినీ ఉద్దేశించి పెట్టలేదని కస్తూరి తెలిపింది. భారతదేశంలో సరోగసీ గురించి నా పోస్ట్‌ కు కొత్త తల్లిదండ్రులు నయనతార - విఘ్నేష్ శివన్‌ ని లింక్ చేస్తూ ఏదైనా మీడియా దురుద్దేశపూర్వకంగా కథనాలను ప్రచురించినట్లయితే పరువు నష్టం దావా వేయబడుతుంది. మిమ్మల్ని మీరు హెచ్చరించినట్లు పరిగణించండి అని సీనియర్ నటి ట్వీట్ చేసింది.

భారతదేశంలో నూతన సరోగసీ నియంత్రణ చట్టం ఈ ఏడాది జనవరి నుంచి అమల్లోకి వచ్చింది. దీని ప్రకారం ఎవరైనా మహిళ దేశంలోని దంపతుల కోసం బిడ్డను కనడానికి అనుమతి ఉంటుంది కానీ.. వాణిజ్య పరమైన అద్దె గర్భం - పిండాలను విక్రయించడం - సరోగసీలో బిడ్డను కన్నాక వదిలిపెట్టడం - అక్రమ రవాణా వంటి వాటిపై కేంద్రం నిషేధం విధించినట్లు తెలుస్తోంది. ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే గరిష్టంగా పదేళ్ల జైలు శిక్ష మరియు రూ.10. లక్షల జరిమానా విధించే అవకాశం ఉంది.

అయితే ఇప్పుడు పెళ్ళైన 4 నెలల తర్వాత నయన్ మరియు విఘ్నేష్ దంపతులు కవలలకు స్వాగతం పలికామని ప్రకటించడంతో... సరోగసీ అంశం హాట్ టాపిక్ గా మారింది. తమిళనాడు ప్రభుత్వం దీనిపై విచారణకు సిద్ధమైంది. ఈ విషయం పై కొత్త దంపతులు ఎలా స్పందిస్తారో చూడాలి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.