Begin typing your search above and press return to search.

కృష్ణను కడసారి చూడటానికి నాగ్ ఎందుకు రాలేదు..?

By:  Tupaki Desk   |   17 Nov 2022 4:56 AM GMT
కృష్ణను కడసారి చూడటానికి నాగ్ ఎందుకు రాలేదు..?
X
సూపర్ స్టార్ కృష్ణ మృతితో ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. నటశేఖర ఇంక లేరనే విషయాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. లెజెండరీ నటుడికి అంతిమ నివాళులు అర్పించేందుకు తెలుగు చిత్ర పరిశ్రమ అంతా తరలివచ్చింది.

సినీ రాజకీయ ప్రముఖులు మరియు అభిమానులు కృష్ణ కు నివాళులర్పించారు. ఘట్టమనేని కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఒకే ఏడాదిలో తన సోదరుడు మరియు తల్లి దండ్రులను కోల్పోయిన మహేశ్ బాబుకు ధైర్యం చెప్పడానికి దాదాపు టాలీవుడ్ లోని ప్రముఖులందరూ వచ్చారు.

అయితే సీనియర్ హీరో అక్కినేని నాగార్జున కనిపించకపోవడం ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్స్ లో చర్చనీయాంశంగా మారింది. కృష్ణ పార్ధీవ దేహానికి నివాళులర్పించడానికి ఆయన ఎందుకు హాజరు కాలేకపోయారనే విషయంపై మాట్లాడుకుంటున్నారు.

అక్కినేని ఫ్యామిలీతో సూపర్ స్టార్ కుటుంబానికి మంచి సత్సంబంధాలు ఉన్నాయి. నటసామ్రాట్ నాగేశ్వర రావు మరియు కృష్ణ చాలా సన్నిహితంగా ఉంటారు. వీరిద్దరూ కలిసి దాదాపు 10 సినిమాల్లో నటించారు.

అలానే కృష్ణ - నాగార్జునకూ మంచి స్నేహం ఉందనే సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మహేశ్ బాబు - సుమంత్ - అఖిల్ అక్కినేని కూడా అదే బంధాన్ని కొనసాగిస్తున్నారు. వారి అభిమానుల్లో కూడా ఎక్కువగా మ్యాచ్వల్స్ ఉంటారు.

గతంలో కృష్ణ - నాగార్జున కలిసి "వారసుడు" "రాముడొచ్చాడు" వంటి చిత్రాల్లో తండ్రీకొడులుగా నటించారు. కృష్ణతో ఎంత ప్రేమతో ఉండేవాడో.. మహేష్ తో కూడా అంతే ప్రేమగా ఉండేవాడు నాగ్. ఇటీవల మహేష్ తో నటించాలనే కోరికను నాగ్ వెలిబుచ్చారు.

కానీ కృష్ణను కడసారి చూడడానికి నాగార్జున రాకపోవడంపై నెటిజన్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. నాగ్ విదేశాల్లో ఉన్నారా? లేదా పక్క రాష్ట్రాల్లో ఇతర పనులతో రాలేనంత బిజీగా ఉన్నారా? ఆరాలు తీస్తున్నారు.

అయితే, అక్కినేని ఫ్యామిలీ నుంచి నాగ చైతన్య మరియు అఖిల్.. కృష్ణ కు నివాళులు అర్పించి మహేష్ బాబు మరియు అతని కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేసారు. ఇద్దరూ చాలా సేపు మహేశ్ పక్కనే కూర్చొని సమయం గడిపారు.

కాకపొతే దిగ్గజ నటుడికి అంతిమంగా నివాళులు అర్పించేందుకు నాగార్జున కూడా వచ్చి ఉండాల్సిందని పలువురు అభిమానులు సోషల్ మీడియాలో అభిప్రాయ పడుతున్నారు. ఇతర కార్యక్రమాలకు ప్రైవేట్ ఛాపర్ వేసుకొని వెళ్ళిన నాగ్.. ఇప్పుడు అలా చేయలేకపోయారని కామెంట్స్ చేస్తున్నారు.

నిజానికి ఇండస్ట్రీలో ఎవరైనా ప్రముఖులు చనిపోయినప్పుడు నాగార్జున సోషల్ మీడియాలో నివాళులు అర్పిస్తూ ఉంటారు. కానీ ఇటీవల మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి మరణించినప్పుడు నాగ్ వచ్చారు. మహేశ్ ను పరామర్శించి వెళ్ళారు.

ఇప్పుడు కృష్ణ మరణ వార్త తెలిసిన వెంటనే ట్విట్టర్ ద్వారా సంతాపం ప్రకటించారు. కృష్ణ భౌతిక కాయానికి నివాళులు అర్పించకపోవడానికి.. అంత్యక్రియలకు హాజరు కాకపోవడానికి ఏదైనా తీవ్రమైన మరియు బలమైన కారణం ఉండొచ్చని అక్కినేని ఫ్యాన్స్ అంటున్నారు.

కుదిరితే తప్పకుండా వచ్చేవాడని.. రాకపోవడానికి కచ్చితమైన కారణం తెలియకుండా నాగార్జున ను నిందించడం సరికాదని అంటున్నారు. అక్కినేని ఫ్యామిలీ నుంచి నాగచైతన్య మరియు అఖిల్ వచ్చి కృష్ణ కు నివాళులు అర్పించారనే విషయాన్ని గుర్తు చేస్తున్నాను.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.