Begin typing your search above and press return to search.

'బాహుబలి' తర్వాత శోభు ఎందుకు పెద్ద సినిమాలు చేయలేదు..?

By:  Tupaki Desk   |   4 July 2022 5:21 PM GMT
బాహుబలి తర్వాత శోభు ఎందుకు పెద్ద సినిమాలు చేయలేదు..?
X
తెలుగు కన్నడ హిందీ ఒరియా భాషల్లో అనేక టీవీ షోలు రూపొందించిన టాలీవుడ్ నిర్మాత శోబు యార్లగడ్డ.. ఆర్కా మీడియా బ్యానర్ పై 'బాహుబలి: ది బిగినింగ్' 'బాహుబలి: కన్ క్లూజన్' వంటి భారీ చిత్రాలను నిర్మించారు. అయినప్పటికీ వెంటనే మరో పెద్ద సినిమా చేయకుండా 'ఉమామహేశ్వర ఉగ్రరూపస్య' వంటి చిన్న చిత్రంతో వచ్చారు.

చివరగా 'పెళ్లి సంద D' చిత్రాన్ని అందించిన శోభు.. 'బాహుబలి' వచ్చి మరి కొన్ని రోజుల్లో ఏడేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడారు. బుల్లితెర నుంచి సినిమాల ప్రొడక్షన్ లోకి రావడం గురించి.. నిర్మాణంలో తన పాత్ర గురించి వివరించారు.

'బాహుబలి' వంటి భారీ బడ్జెట్ సినిమాల తర్వాత చిన్న చిత్రాలు చేయడానికి కారణాలు చెబుతూ.. హడావిడిగా ఎక్కువ చిత్రాలు చేయాలని తాను అనుకోలేదని.. స్క్రిప్ట్ మరియు డైరెక్టర్ కే ప్రాధాన్యత ఇవ్వాలని అనుకున్నామని శోభు చెప్పారు. కొన్ని సినిమాలు ప్లాన్ చేయగా కరోనా కారణంగా కుదరలేదని.. వచ్చే ఏడాది పలు ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ తో రాబోతున్నామని తెలిపారు.

ఇటీవలి తెలుగు చిత్రాల బాక్సాఫీస్ పనితీరును విశ్లేషిస్తూ.. గత కొన్ని నెలలుగా ప్రేక్షకులు అభిరుచులు అనూహ్యంగా మారాయని శోబు అన్నారు. సాలిడ్ కంటెంట్ తో 'ఆచార్య' లాంటి సినిమా ఓపెనింగ్స్ రాబట్టలేకపోయింది. ఇది చాలా ఆందోళన కలిగించే విషయమని చెప్పారు. హిందీలో పరిస్థితి మరీ అధ్వాన్నంగా ఉందన్నారు.

నార్త్ సర్కూట్స్ లో అజయ్ దేవగన్ - అక్షయ్ కుమార్ లాంటి బిగ్ స్టార్స్ నటించే సినిమాలు జీరో ఒపెనింగ్స్ తెచ్చుకోవడం నిజంగా కలవరపెట్టే విషయమని శోభు అన్నారు. వీకెండ్ తర్వాత వసూళ్ళు సాధించకపోవడం ఓకే కానీ.. మరీ ఫస్ట్ వీకెండ్ లోనే కలెక్షన్స్ రాబట్టకపోవడం ఆలోచించాల్సిన విషయమని తెలిపారు.

RRR మరియు KGF2 లాంటి భారీ స్థాయి సినిమాలు బాక్సాఫీస్ వద్ద బాగా వసూలు చేశాయని.. 'జాతి రత్నాలు' 'డీజే టిల్లు' వంటి హాస్య చిత్రాలు బాగా ఆడాయని అన్నారు. ఈ రోజుల్లో సీరియస్ డ్రామా చిత్రాలను థియేటర్లలో చూడటానికి ప్రజలు తమ ఇళ్ల నుండి బయటకు రావడానికి సిద్ధంగా లేరనేది అర్థమవుతోందని నిర్మాత చెప్పారు.

కంటెంట్ పరంగా చాలా ఎక్కువ సరఫరా ఉందని.. ఐదు నెలల గ్యాప్ లో చాలా సినిమాలు రావడం వల్ల కూడా ప్రేక్షకులు కొన్ని చిత్రాలకు దూరమయ్యారని అభిప్రాయ పడ్డారు. ఈ రోజుల్లో ఆడియన్స్ ఆ సినిమాని ఎందుకు థియేటర్లలో చూడాలి.. ఓ నెల రోజులు వెయిట్ చేసి ఓటీటీలో సినిమాలు చూసేయొచ్చు కదా అనే ఆలోచనలో ఉన్నారని శోబు తెలిపారు.