Begin typing your search above and press return to search.

ఏపీలో సినిమా టికెట్ల ఆన్ లైన్ అమ్మకాల కోసం 'యువర్ స్క్రీన్స్' పోర్టల్..!

By:  Tupaki Desk   |   23 Jun 2022 6:30 AM GMT
ఏపీలో సినిమా టికెట్ల ఆన్ లైన్ అమ్మకాల కోసం యువర్ స్క్రీన్స్ పోర్టల్..!
X
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సినిమా టికెట్ల వ్యవహారంలో కీలక నిర్ణయం తీసుకుంది. బ్లాక్ టికెటింగ్ దందాకు చెక్ పెట్టి అంతా పారదర్శకంగా జరిగేలా చూడటానికి ఆన్లైన్ లో సినిమా టికెట్ల విక్రయాలు జరిపేందుకు సన్నాహాలు మొదలు పెట్టింది. ఇందులో భాగంగా ఏపీ ఆన్లైన్ టికెట్ల బుకింగ్ కోసం 'యువర్ స్క్రీన్స్' పోర్టల్ ను తీసుకొస్తోంది.

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న థియేటర్లలో ఇకపై ఏపీ స్టేట్ ఫిల్మ్ టెలివిజన్ థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎఫ్డీసీ) ఆధ్వర్యంలో నడిచే 'యువర్ స్క్రీన్స్' పోర్టల్ నుంచే సినిమా టికెట్ల అమ్మకాలు జరుపనున్నారు. ఇతర పోర్టల్స్ కంటే రూ.20 - రూ.25 తక్కువకు టికెట్లను విక్రయించనున్నారు.

ప్రభుత్వం తీసుకొస్తోన్న యువర్ స్క్రీన్స్ ద్వారా టికెట్లు బుక్ చేసుకుంటే అదనపు ఛార్జీల నుంచి మినహాయింపు ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. ఏ రోజు డబ్బులను ఆరోజే థియేటర్ల ఖాతాలలో జమ చేస్తామని జగన్ సర్కార్ చెబుతోంది. అంతేకాదు ఇతర పోర్టల్స్ తో ఉన్న ఒప్పందాలను కూడా కొనసాగించనుంది.

ప్రభుత్వం తీసుకొచ్చే ఆన్ లైన్ టికెటింగ్ విధానంతో థియేటర్లకు ఉన్న గత ఒప్పందాలు రద్దు కావని ఏపీఎఫ్డీసీ ఎండీ విజయ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. దీనివల్ల ప్రేక్షకులు నచ్చిన పోర్టల్ నుంచి టికెట్లు బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది.

ప్రభుత్వం నిర్దేశించిన ధరలను మాత్రమే థియేటర్ల యాజమాన్యాలు అమలు చేయాలని.. అందుకోసం ఆన్ లైన్ టికెటింగ్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు విజయ్ కుమార్ తెలిపారు. త్వరలోనే 'యువర్ స్క్రీన్స్' పోర్టల్ అందుబాటులోకి రానుంది.

కాగా, సినిమా టిక్కెట్ల అమ్మకాల్లో పారదర్శకత తీసుకురావాలని ఏపీ ప్రభుత్వం గత కొంతకాలంగా చర్చలు జరుపుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే ఆన్ లైన్ టికెటింగ్ విధానాన్ని తీసుకొస్తున్నట్లు పేర్కొన్నారు. ఇది ఏ విధంగా పని చేస్తుంది.. ప్రభుత్వం చెబుతున్న విధంగా బ్లాక్ దందాకు చెక్ పడుతుందా లేదా.. సినిమా వాళ్లకు ఇది ఏ మేరకు హెల్ప్ అవుతుంది? అనేది రాబోయే రోజుల్లో తెలుస్తుంది.