కామిక్కాన్లో 'అవతార్ 3' బిగ్ లీక్స్
ఫైర్ అండ్ యాష్ రెండవ చిత్రం ముగింపు తర్వాత సీక్వెన్సులతో ప్రారంభమవుతుంది. 'ది వే ఆఫ్ వాటర్' నెయ్టిరి- జేక్ కుమారుడు నెటెయెమ్ మరణాన్ని క్లైమాక్స్ లో చూసాం.
By: Tupaki Desk | 4 April 2025 2:06 PMఅవతార్ విశ్వంలో వరుస సినిమాలు ప్రతియేటా రిలీజవుతూ అభిమానులను అలరించనున్నాయి. ప్రస్తుతం ప్రపంచం దృష్టి అవతార్ 3 పైనే ఉంది. ఈ సినిమా కోసం కామెరూన్ ఎంచుకున్న బ్యాక్ డ్రాప్ సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తోంది. మూడవ చిత్రం 'అవతార్: ఫైర్ & యాష్' మొదటి రెండు భాగాలను తలదన్నేలా ఉంటుందని కామెరూన్ ఇంతకుముందే అభిమానులను టీజ్ చేసాడు.
అవతార్: ది వే ఆఫ్ వాటర్ విడుదలైన మూడు సంవత్సరాల తర్వాత అవతార్ 3 విడుదలకు సిద్ధమవుతోంది. ఈ ఏడాది చివరి నాటికి థియేటర్లలో ఇది విడుదల కానుంది. ఫ్రాంచైజీలోని ప్రముఖ నటి జోయ్ సల్దానా 2025 సినిమాకాన్లో మూడో భాగం టీజర్ ట్రైలర్ ని విడుదల చేసారు. లాస్ ఏంజిల్స్లో జరిగిన ఈ కార్యక్రమంలో హాలీవుడ్ దిగ్గజ తారలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అవతార్ రిలీజ్ గురించి తారలు ప్రస్థావించారు. ఈ సంవత్సరం చివర్లో ప్రాజెక్ట్ విడుదలను ఖరారు చేయడంలో, సజావుగా విడుదలయ్యేలా అన్నిటినీ చక్కబెట్టడం కోసం జేమ్స్ కామెరూన్ ప్రయత్నిస్తున్నారని, అందుకే ఆయన ఈ వేడుకకు హాజరు కాలేదని కూడా వెల్లడించారు.
ఫైర్ అండ్ యాష్ రెండవ చిత్రం ముగింపు తర్వాత సీక్వెన్సులతో ప్రారంభమవుతుంది. 'ది వే ఆఫ్ వాటర్' నెయ్టిరి- జేక్ కుమారుడు నెటెయెమ్ మరణాన్ని క్లైమాక్స్ లో చూసాం. అతడు పెద్దవాడు అయ్యాడు. సినిమా కాన్లో నెక్ట్స్ కథేంటో టీజర్ లో రివీల్ చేసారు. జోయ్ 'అవతార్'లో నెయ్టిరి పాత్రలో నటించింది. సామ్ వర్తింగ్టన్ పోషించిన జేక్ సుల్లీకి జంటగా నటించింది. మూడ చిత్రం ప్రేక్షకులు ఇప్పటివరకు చూసిన వాటికి భిన్నంగా ఉంటుంది. ఫ్యాన్స్ కోరుకునేది కచ్ఛితంగా ఇందులో ఉంటుంది అని జోయ్ పేర్కొన్నారు. ఫైర్ అండ్ యాష్ పండోర అందమైన ప్రపంచాన్ని విస్తరిస్తుంది. రెండు కొత్త వంశాలను పరిచయం చేస్తుంది. విలన్ల ప్రపంచం పెరుగుతుంది. శాంతిని కోరుకునే విండ్ట్రేడర్స్ సంచార, విమాన ప్రయాణ వంశంగా కనిపిస్తారు. మరోవైపు వారికి పూర్తి విరుద్ధంగా యాష్ ప్రజలు దేవుడిని విడిచిపెట్టి యుద్ధాలకు దిగుతారు. ఆ రెండు తెగల మధ్య యుద్ధం పరాకాష్ఠకు చేరుకుంటుంది.. అని తెలిపారు.
ఆసక్తికరంగా భూమి నుండి వచ్చిన సైన్యం మూడవసారి తిరిగి పండోరా పైకి వస్తుంది. పండోరా తెగలు, మానవ జాతి మధ్య సంఘర్షణను మళ్ళీ వేడెక్కిస్తుంది. కథ ముందుకు సాగుతున్న కొద్దీ ఎమోషన్స్ రగిలిస్తాయని తెలిపారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కామెరూన్ ఓ మ్యాగజైన్ తో మాట్లాడుతూ మూడో భాగం రెండో భాగం కంటే పెద్దదిగా ఉంటుందని తెలిపారు. ఊపిరి పీల్చుకోనివ్వని ట్విస్టులు ఈ కథలో ఉంటాయని అవతార్ స్క్రీన్ రైటర్ అమండా సిల్వర్ అన్నారు. ఫైర్, యాష్ పాత్రలతో పాటు కొత్తగా చేరే పాత్రలతో, వైవిధ్యమైన భీకర విలన్లతో రక్తి కట్టిస్తుందని తెలిపారు.