'అఖండ 2' బడ్జెట్ హద్దులు దాటుతుందా...?
నందమూరి బాలకృష్ణ హీరోగా ప్రస్తుతం ఫుల్ జోష్ మీద ఉన్నారు. ఆయన అఖండ సినిమా మొదలుకుని వరుసగా వీర సింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్ సినిమాలతో హిట్ను సొంతం చేసుకున్నారు.
By: Tupaki Desk | 23 March 2025 11:44 PM ISTనందమూరి బాలకృష్ణ హీరోగా ప్రస్తుతం ఫుల్ జోష్ మీద ఉన్నారు. ఆయన అఖండ సినిమా మొదలుకుని వరుసగా వీర సింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్ సినిమాలతో హిట్ను సొంతం చేసుకున్నారు. కలెక్షన్స్ విషయం పక్కన పెడితే వరుసగా నాలుగు సినిమాలకు బాలకృష్ణ సక్సెస్ టాక్ను దక్కించుకున్నారు. ప్రస్తుతం 'అఖండ 2' సినిమాలో బాలయ్య నటిస్తున్న విషయం తెల్సిందే. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న అఖండ 2 పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే వీరిద్దరి కాంబోలో సింహా, లెజెండ్, అఖండ సినిమాలు వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. ముఖ్యంగా అఖండ సినిమా పాన్ ఇండియా రేంజ్లో భారీ వసూళ్లను సొంతం చేసుకున్న విషయం తెల్సిందే.
అఖండ భారీ విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో అఖండ 2 సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. గత ఏడాది కాలంగా అఖండ 2 సినిమా గురించి నందమూరి అభిమానుల్లో చర్చ జరుగుతోంది. అదుగో ఇదుగో అంటూ అఖండ 2 గురించి పెద్ద ఎత్తున పుకార్లు షికార్లు చేశాయి. బోయపాటి శ్రీను షూటింగ్ ప్రారంభించినప్పటి నుంచి అంచనాలు పెంచే విధంగా ఏదో ఒక లీక్ ఇస్తూనే ఉన్నారు. సినిమా కోసం మహా కుంభమేళలో ప్రత్యేకంగా షూటింగ్ చేశారు. అంతే కాకుండా హిమాలయాల్లోనూ షూటింగ్ నిర్వహించడం ద్వారా అంచనాలు భారీగా పెంచారు. ఈ సినిమాలో హీరోయిన్గా ప్రగ్యా జైస్వాల్ నటిస్తున్న విషయం తెల్సిందే.
ఈ సినిమాను 14 రీల్స్ బ్యానర్లో రామ్ ఆచంట, గోపీ ఆచంటలు నిర్మిస్తున్నారు. మొదట ఈ సినిమాను రూ.150 కోట్ల బడ్జెట్తో నిర్మిస్తున్నారనే వార్తలు వచ్చాయి. అఖండ 2 సినిమాకి ఉన్న బజ్ నేపథ్యంలో ఎప్పటికప్పుడు సినిమా బడ్జెట్ను పెంచుతూ వచ్చారు. షూటింగ్ కార్యక్రమాలను ఎక్కడా రాజీ పడకుండా చేస్తున్న కారణంగా పూర్తి అయ్యేప్పటి వరకు రూ.175 కోట్ల నుంచి రూ.200 కోట్ల వరకు బడ్జెట్ పెరిగే అవకాశాలు ఉన్నాయని సినీ వర్గాల వారు మాట్లాడుకుంటున్నారు. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ సినిమాలో ఎస్ జే సూర్య, జగపతి బాబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాలో కావ్య థాపర్ కీలక పాత్రలో కనిపించబోతుందనే వార్తలు వస్తున్నాయి.
అఖండ 2 సినిమాను 2025 సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లు అధికారికంగా ప్రకటన వచ్చింది. అఖండ 2 తాండవం అంటూ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాలో తమిళ్ యంగ్ హీరో ఆది పినిశెట్టి నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా కోసం బోయపాటి రాజీ పడకుండా భారీ ఖర్చుతో అతి పెద్ద సెట్స్ నిర్మాణం చేస్తున్నారు. సెట్స్ నిర్మాణం కారణంగా బడ్జెట్ పరిధి భారీగా పెరిగి పోతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. బాలకృష్ణ ప్రస్తుతం ఉన్న ఫామ్ను బట్టి చూస్తే అఖండ 2 కచ్చితంగా రూ.250 కోట్ల వసూళ్లు నమోదు చేసే అవకాశాలు ఉన్నాయి. కనుక రూ.200 కోట్ల బడ్జెట్ అనేది అఖండ 2 సినిమాకు భారం కాకపోవచ్చనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.