Begin typing your search above and press return to search.

మొన్న కృతి.. నిన్న శ్రీలీల.. నేడు భాగ్య‌శ్రీ‌!

ఇప్పుడు భాగ్యశ్రీ బోర్సే కూడా వస్తూ వస్తూనే వరుసగా ఆఫర్స్ దక్కించుకుంటోంది. మరి టాలీవుడ్ లో అమ్మడి కెరీర్ ఎలా సాగుతుందో చూడాలి.

By:  Tupaki Desk   |   7 Aug 2024 3:30 AM GMT
మొన్న కృతి.. నిన్న శ్రీలీల.. నేడు భాగ్య‌శ్రీ‌!
X

టాలీవుడ్ లో హీరోయిన్లకు కొరత ఉండదు. ప్రతీ వారం ఓ కొత్త భామ ఇండస్ట్రీకి పరిచయం అవుతూనే ఉంటుంది. వారిలో కొందరు వరుస అవకాశాలు దక్కించుకుని కొన్నాళ్లపాటు హవా కొనసాగిస్తారు. మరికొందరు మాత్రం ఒకటీ రెండు చిత్రాలకే పరిమితం అవుతుంటారు. అందుకే క్రేజ్ ఉన్నప్పుడే దాన్ని క్యాష్ చేసుకోవాలని భావిస్తుంటారు. ఇప్పుడు భాగ్యశ్రీ బోర్సే అనే మరో కొత్త హీరోయిన్ తెలుగు తెర‌కు పరిచయం కాబోతోంది. ఫస్ట్ మూవీ రిలీజ్ కాకుండానే క్రేజీ ఆఫర్స్ అందుకుంటూ దూసుకుపోతోంది.

రవితేజ హీరోగా హరీశ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'మిస్టర్ బచ్చన్'. ఈ చిత్రంతోనే అందాల ముద్దుగుమ్మ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా టాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తోంది. ఇప్పటికే రిలీజైన ప్రమోషనల్ కంటెంట్ లో అమ్మడు అందరి దృష్టిని ఆకర్షించింది. పోస్టర్లతోనే యువ హృదయాలను కొల్లగొట్టింది. పాటల్లో తన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మాస్ సాంగ్ లో రవితేజ ఎనర్జీని మ్యాచ్ చేస్తూ స్టెప్పులేయడమే కాదు, మెలోడీ సాంగ్ లో తన గ్లామర్ తో స్క్రీన్ ప్రెజెన్స్ తో ఆకట్టుకుంది. దీంతో ఇప్పుడు భాగ్యశ్రీ యూత్ కి క్రష్ గా మారిపోయింది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈమె సందడే కనిపిస్తోంది.

పూణేకు చెందిన భాగ్యశ్రీ బోర్సే.. మోడలింగ్ రంగంలో గుర్తింపు తెచ్చుకుని, పలు బ్రాండ్ ఎండార్స్మెంట్స్ చేసింది. 'యారియాన్ 2' మూవీతో బాలీవుడ్ లో తెరంగేట్రం చేసింది. ఇటీవల 'చందు ఛాంపియన్' చిత్రంలో స్పెషల్ రోల్ చేసింది. ఈ క్రమంలో 'మిస్టర్ బచ్చన్' సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అయింది. అయితే ఈ మూవీ రిలీజ్ కాకుండానే అమ్మడు పెద్ద బ్యానర్స్ లో స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలు అందుకుంటున్నట్లు తెలుస్తోంది.

యువ హీరో విజయ్ దేవరకొండ, డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి కాంబోలో రూపొందుతున్న 'VD 12' సినిమాలో భాగ్యశ్రీ బోర్సేని హీరోయిన్ గా తీసుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. అలానే హీరో నాని నటించే ఓ మూవీ కోసం ఆమెను సంప్రదిస్తున్నారని అంటున్నారు. ఇప్పటికైతే అందం, అదృష్టం రెండూ ఈ ముద్దుగుమ్మకు కలిసొచ్చాయి. 'మిస్టర్ బచ్చన్' విడుదలైన తర్వాత అభినయం కూడా ఉందని ప్రూవ్ అయితే, అనతి కాలంలోనే క్రేజీ హీరోయిన్ గా మారే ఛాన్స్ ఉంది.

యంగ్ హీరోయిన్లలో కృతిశెట్టి, శ్రీ‌లీల‌ మాత్రమే ఓవర్ నైట్ స్టార్ డమ్ అందుకున్నారు. 'ఉప్పెన' సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన కృతి.. బ్యాక్ టూ బ్యాక్ స్టార్ హీరోల చిత్రాల్లో నటించే అవకాశాలు కొట్టేసింది. అయితే లైన్ గా రెండు మూడు ఫ్లాప్స్ పడటంతో స్పీడ్ తగ్గించింది. మరోవైపు 'పెళ్లి సందడి'తో తెలుగులోకి వచ్చిన శ్రీలీల.. ధమాకా తర్వాత చేతినిండా ప్రాజెక్ట్స్ తో బిజీగా మారిపోయింది. కానీ ఈ మధ్య పరాజయాలు పలకరించడంతో స్లో అండ్ స్టడీగా వెళ్తోంది. ఇప్పుడు భాగ్యశ్రీ బోర్సే కూడా వస్తూ వస్తూనే వరుసగా ఆఫర్స్ దక్కించుకుంటోంది. మరి టాలీవుడ్ లో అమ్మడి కెరీర్ ఎలా సాగుతుందో చూడాలి.