బెల్లంకొండ మల్టీస్టారర్ డేట్ మారిందా?
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా విజయ్ కనకమేడల దర్శకత్వంలో రూపొందిన 'భైరవం' సినిమా విడుదలకు సిద్ధం అవుతోంది.
By: Tupaki Desk | 12 March 2025 1:53 PM ISTబెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా విజయ్ కనకమేడల దర్శకత్వంలో రూపొందిన 'భైరవం' సినిమా విడుదలకు సిద్ధం అవుతోంది. బెల్లంకొండతో పాటు ఈ సినిమాలో మంచు మనోజ్, నారా రోహిత్ ముఖ్య పాత్రల్లో నటించిన కారణంగా అంచనాలు భారీగా పెరిగాయి. ఇది ఒక మల్టీస్టారర్ మూవీగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఏకంగా ముగ్గురు హీరోలు ఈ సినిమాలో ఉండటంతో ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. అందుకే ఏమాత్రం అంచనాలకు తగ్గకుండా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే విధంగా దర్శకుడు విజయ్ ప్లాన్ చేస్తున్నాడు. తన గత చిత్రాల మాదిరిగానే ఈ సినిమాలోనూ విభిన్నమైన స్టోరీ పాయింట్ను టచ్ చేసినట్లు తెలుస్తోంది.
నిన్న మొన్నటి వరకు 'భైరవం' సినిమాను ఏప్రిల్ 4న ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు మేకర్స్ చెబుతూ వచ్చారు. ఏప్రిల్ 4న సినిమా విడుదల దాదాపు కన్ఫర్మ్ అని అంతా అనుకుంటున్నారు. ఇలాంటి సమయంలో సినిమాను మరింత క్వాలిటీతో, ఎక్కువ శాతం మంది ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు గాను వాయిదా వేయాలని నిర్ణయించారట. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం భైరవం సినిమాను ఏప్రిల్ 18న విడుదల చేయాలని నిర్ణయించారు. ఆ సమయంలో అనుష్క నటించిన 'ఘాటీ' సినిమా విడుదల కాబోతుంది. అనుష్క ఘాటీ సినిమాను ఏప్రిల్ 18న విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటన వచ్చింది.
ఘాటీ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఆలస్యం కావడంతో విడుదల వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి. దాంతో ఆ తేదీని భైరవం సినిమాకి వినియోగించాలని మేకర్స్ భావిస్తున్నారట. అందుకే భైరవం సినిమాను ఏప్రిల్ 4 నుంచి ఏప్రిల్ 18కి వాయిదా వేసినట్లు తెలుస్తోంది. ఈ విషయమై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన అతి త్వరలోనే వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే మేకర్స్ సినిమా పబ్లిసిటీ కార్యక్రమాలు మొదలు పెట్టారు. త్వరలోనే సినిమా నుంచి పాటను విడుదల చేయబోతున్నట్లు సమాచారం అందుతోంది. రెండు వారాల ఆలస్యంగా సినిమా విడుదల కాబోతున్న కారణంగా ప్రమోషన్కి మరింత సమయం లభిస్తుంది. కనుక ఎక్కువ పబ్లిసిటీ చేసే అవకాశాలు ఉన్నాయి.
మంచు మనోజ్ చాలా కాలం తర్వాత నటిస్తున్న సినిమా కావడంతో పాటు నారా రోహిత్ సైతం ఈ సినిమాలో నటించడం వల్ల అంచనాలు పెరిగాయి. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సినిమాలు వరుసగా నిరాశ పరిచిన ఆయన నుంచి సినిమా వస్తుంది అంటే ఒక వర్గం ప్రేక్షకుల్లో అంచనాలు, ఆసక్తి ఉంటుంది. కనుక ఈ సినిమా కంటెంట్ బాగుంటే తప్పకుండా భారీ వసూళ్లు నమోదు చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమాలో అదితి శంకర్, ఆనంది, దివ్య పిళ్లై హీరోయిన్స్గా నటించారు. శ్రీ చరణ్ అందించిన సంగీతం సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచే అవకాశాలు ఉన్నాయి.