Begin typing your search above and press return to search.

సౌత్ మీద పడ్డ బాలీవుడ్ స్టార్స్!

బాలీవుడ్ స్టార్ హీరోలంతా ఇప్పుడు సౌత్ మీద పడ్డారు. పాన్ ఇండియా సక్సెస్ కోసం దక్షిణాదిని ఆశ్రయిస్తున్నారు.

By:  Tupaki Desk   |   13 March 2024 10:30 AM GMT
సౌత్ మీద పడ్డ బాలీవుడ్ స్టార్స్!
X

బాలీవుడ్ స్టార్ హీరోలంతా ఇప్పుడు సౌత్ మీద పడ్డారు. పాన్ ఇండియా సక్సెస్ కోసం దక్షిణాదిని ఆశ్రయిస్తున్నారు. మన స్టార్ డైరెక్టర్స్ తో సినిమాలు చేయడానికి పోటీ పడుతున్నారు. ఇటీవల టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా హీరో రణబీర్ కపూర్ కు 'యానిమల్' వంటి సెన్సేషనల్ సినిమా అందించారు. అంతకముందు షాహిద్ కపూర్ తో 'కబీర్ సింగ్' సినిమా తీసి హిట్టు కొట్టారు. ఇప్పుడు నార్త్ లో క్రేజీ డైరెక్టర్ గా మారిపోయిన సందీప్.. 'స్పిరిట్' తర్వాత రణబీర్ తో 'యానిమల్ పార్క్' చిత్రాన్ని తెరకెక్కించనున్నారు.

'జవాన్' సినిమాతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చారు తమిళ్ డైరెక్టర్ అట్లీ. చాలా కాలంగా సక్సెస్ లేని కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ కు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అందించారు. దీంతో ఇప్పుడు అట్లీతో జట్టు కట్టడానికి పలువురు హిందీ హీరోలు ప్రయత్నాలు చేస్తున్నారు. సౌత్ స్టార్ డైరెక్టర్ శంకర్, రణ్వీర్ సింగ్ కాంబినేషన్ లో ఓ హిందీ మూవీ కోసం ఇప్పటికే అనౌన్స్ మెంట్ వచ్చింది. ఇది 'అపరిచితుడు' హిందీ రీమేక్ అని అప్పట్లో ప్రచారం జరిగింది. 'గేమ్ చేంజర్' 'ఇండియన్ 2' సినిమాల తర్వాత శంకర్ ఈ ప్రాజెక్ట్ ను పట్టలెక్కించే అవకాశం ఉంది.

లేటెస్టుగా బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్, డైరెక్టర్ ఏఆర్ మురగదాస్ కాంబోలో ఓ సినిమాని అధికారికంగా ప్రకటించారు. గతంలో గజిని, హాలిడే, అకీరా వంటి హిందీ చిత్రాలకి మురగదాస్ దర్శకత్వం వహించారు. ఆయన తెరకెక్కించిన 'స్టాలిన్' రీమేక్ గా 'జయహో' సినిమా చేశారు సల్మాన్. ఇప్పుడు తొలిసారిగా వీరిద్దరూ ఓ క్రేజీ ప్రాజెక్ట్ కోసం కలుస్తున్నారు. ప్రముఖ దర్శక నిర్మాత సాజిద్‌ నడియాడ్‌వాలా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఇది కిక్ సీక్వెల్ గా తెరకెక్కే 'కిక్ 2' అనే ప్రచారం జరుగుతోంది. 2025 ఈద్ స్పెషల్ గా ఈ సినిమా రిలీజ్ కానుంది.

సల్లూ భాయ్ తన తర్వాతి చిత్రాన్ని కూడా దక్షిణాది దర్శకుడితోనే చేయనున్నారు. 'పంజా' ఫేమ్ విష్ణు వర్ధన్ డైరెక్షన్ లో 'ది బుల్' అనే సినిమాని ప్రారంభించనున్నారు. ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. విష్ణు ఇంతకముందు హిందీలో 'షేర్శా' వంటి బ్లాక్ బస్టర్ సినిమా తీశారు. ఇక తెలుగు దర్శకుడు సాయి రాజేశ్ కూడా హిందీ చిత్ర పరిశ్రమలో ఎంట్రీ ఇవ్వబోతున్నారు. కల్ట్ క్లాసిక్ గా నిలిచిన 'బేబీ' చిత్రాన్ని హిందీలోకి రీమేక్ చేస్తున్నారు. అక్షయ్ కుమార్ హీరోగా సౌత్ డైరెక్టర్ సుధా కొంగర 'సర్ఫిరా' అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇది 'ఆకాశం నీ హద్దురా' హిందీ రీమేక్.

ఇప్పుడు తాజాగా టాలీవుడ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కూడా బాలీవుడ్ లో అడుగు పెట్టడానికి రెడీ అవుతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో సీనియర్ హీరో సన్నీ డియోల్ తో సినిమా చేయనున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా రాలేదు కానీ, ఈరోజు దర్శకుడి పుట్టిన రోజు సందర్భంగా త్వరలో ఓ సెన్సేషనల్ ప్రాజెక్ట్ ను డైరక్ట్ చేయబోతున్నట్లు మేకర్స్ ఓ పోస్టర్ తో శుభాకాంక్షలు తెలియజేసారు.

ఇలా బాలీవుడ్ హీరోలంతా సౌత్ డైరెక్టర్స్ తో సినిమాలు చేయటానికి ఆసక్తి కనబరుస్తున్నారు. నిజానికి ఈ ట్రెండ్ కొత్తేమీ కాదు. గతంలో చాలామంది దక్షిణాది దర్శకులు హిందీలోకి వెళ్ళారు. ఆదుర్తి సుబ్బారావు, బాపు దగ్గర నుంచి రామ్ గోపాల్ వర్మ వరకూ.. కృష్ణవంశీ, పూరీ జగన్నాథ్ దగ్గర నుంచి గౌతమ్ తిన్ననూరి, శైలేష్ కొలను వరకూ.. అనేకమంది బాలీవుడ్ లో సత్తా చాటే ప్రయత్నం చేశారు. వారిలో కొందరు అక్కడ కూడా తమ ప్రత్యేకతను చాటుకున్నారు. ఇప్పుడు అదే బాటలో మరికొందరు పయనిస్తున్నారు. మరి రానున్న రోజుల్లో ఇంకెంతమంది సౌత్ డైరెక్టర్స్ నార్త్ లో పాగా వేస్తారో వేచి చూడాలి.