ఛావా తెలుగు రిలీజ్.. గట్టిగానే ప్లాన్ చేశారుగా .
బాలీవుడ్ లో భారీ విజయాన్ని నమోదు చేసుకున్న ఈ చిత్రం.. తెలుగులో కూడా అదే స్థాయిలో ఆదరణ పొందేలా కనిపిస్తోంది.
By: Tupaki Desk | 6 March 2025 6:19 PM ISTఇప్పటికే దేశవ్యాప్తంగా సంచలన విజయాన్ని సాధించిన హిస్టారికల్ ఎపిక్ చిత్రం 'ఛావా' ఇప్పుడు తెలుగులో విడుదలకు సిద్ధంగా ఉంది. బాలీవుడ్ లో భారీ విజయాన్ని నమోదు చేసుకున్న ఈ చిత్రం.. తెలుగులో కూడా అదే స్థాయిలో ఆదరణ పొందేలా కనిపిస్తోంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్లు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. 'ఛత్రపతి శంభాజీ మహారాజ్' మహా వీరుని జీవితగాథ ఆధారంగా రూపొందిన ఈ చిత్రం, హిస్టారికల్ యాక్షన్ జానర్లో మునుపెన్నడూ లేని స్థాయిలో గ్రాండ్ విజువల్ ఎక్స్పీరియన్స్ ను అందించనుందని టాక్.
తెలుగు ప్రేక్షకులకు కూడా చారిత్రక చిత్రాలపై ప్రత్యేకమైన అభిమానం ఉంది. ఇక గీతా ఆర్ట్స్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం, ఏకంగా 550+ స్క్రీన్లలో విడుదల కానుంది. ఇది వాస్తవానికి బాలీవుడ్ చిత్రాలకు టాలీవుడ్ లో రానటువంటి అరుదైన థియేట్రికల్ రిలీజ్ అవుట్పుట్ గా చెప్పుకోవచ్చు. దీనికి కారణం ‘ఛావా’ మొదటి వారం నుంచే దేశవ్యాప్తంగా భారీ డిమాండ్ క్రియేట్ చేసుకోవడమే.
ఈ చిత్రం తెలుగులో విడుదల కానుందని తెలియగానే, హీరో విక్కీ కౌశల్ ప్రత్యేకంగా తెలుగు ప్రేక్షకుల కోసం ఓ వీడియో మెసేజ్ విడుదల చేశాడు. “మేము మొదటి వారం నుంచే తెలుగు ప్రేక్షకుల నుంచి మా చిత్రాన్ని డబ్ చేయాలన్న డిమాండ్ను గమనిస్తున్నాం. ఇప్పుడు మీరు కోరుకున్నట్లుగానే ‘ఛావా’ తెలుగు వెర్షన్ని మార్చి 7న విడుదల చేస్తున్నాం. మహా వీరుడు ఛత్రపతి శంభాజీ మహారాజ్ అసమాన వీరత్వాన్ని, అతని త్యాగాన్ని మీరు బిగ్ స్క్రీన్ పై చూడాలని కోరుకుంటున్నాం” అంటూ హృదయపూర్వకంగా తన భావాలను పంచుకున్నాడు.
ఈ సినిమా తెలుగులో విడుదల కావడానికి ముందు నుంచే ప్రత్యేకమైన ఆసక్తిని పెంచింది. ఇప్పటికే తెలుగు ట్రైలర్ 5 మిలియన్ పైగా వ్యూస్ను సాధించింది. ట్రెండింగ్లో కొనసాగుతూ, ఎక్కడ చూసినా ‘ఛావా’ గురించే మాట్లాడుకుంటున్నారు. బాలీవుడ్లో ఇప్పటికే రూ. 500 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ చిత్రం.. తెలుగు వెర్షన్ ద్వారా మరింత భారీ వసూళ్లు రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఈ సినిమాకు సంబంధించిన ప్రతి అప్డేట్ పై టాలీవుడ్ ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా చారిత్రక అంశాలతోపాటు భారీ యాక్షన్ ఎలిమెంట్స్, విజువల్ గ్రాండియర్ కలగలిపి రూపొందించిన విధానం తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది. ఇప్పటికే బాలీవుడ్లో ఈ సినిమాను చూసిన వారి నుంచి “ఇది ఛత్రపతి శంభాజీ మహారాజ్కు లభించిన ఉత్తమ గౌరవ సూచకం” అని ప్రశంసలు వచ్చాయి. ఇప్పుడు అదే స్థాయిలో తెలుగు ప్రేక్షకులను మెప్పించగలిగితే.. టాలీవుడ్ మార్కెట్లో బాలీవుడ్ సినిమాలకు ఉన్న బౌండరీలు బ్రేక్ అవ్వడం ఖాయం.