Begin typing your search above and press return to search.

ఒకే ఫ్రేమ్ లో బాలయ్య - మెగాస్టార్.. వ్వాటే కాంబో

టాలీవుడ్ సీనియర్ హీరోలు చిరంజీవి, బాలకృష్ణకు ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే.

By:  Tupaki Desk   |   25 Aug 2024 9:54 AM GMT
ఒకే ఫ్రేమ్ లో బాలయ్య - మెగాస్టార్.. వ్వాటే కాంబో
X

టాలీవుడ్ సీనియర్ హీరోలు చిరంజీవి, బాలకృష్ణకు ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న వారిద్దరి సినిమాల కోసం ఫ్యాన్స్ ఎప్పడూ వెయిట్ చేస్తుంటారు. ఆరు పదుల వయసులో వారు కూడా తగ్గేదేలే అన్నట్లు వరుస సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం తమ చేతిలో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేస్తున్నారు. కొత్తవి సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.

ముఖ్యంగా.. కుర్ర హీరోలకు గట్టి పోటీ ఇస్తూ సత్తా చాటుతున్నారు చిరు, బాలయ్య. అయితే సినిమాల పరంగా.. ఇద్దరి మధ్య పోటీ నెలకొన్నా.. ఆఫ్ లైన్ లో మాత్రం మంచి ఫ్రెండ్స్ గా అంటారు. తమదైన శైలిలో పలకరించుకుంటూ అభిమానాన్ని చాటుకుంటూ అంటారు. ఇద్దరు కలిసి కనిపించే సందర్భాలు చాలా తక్కువే ఉన్నా.. ఫ్యాన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటాయి. అలాంటి సీన్ తాజాగా మరోసారి రిపీట్ అయింది.

అందుకు సంబంధించిన ఫోటో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ప్రముఖ గీత రచయిత, సరస్వతీ పుత్ర రామజోగయ్య శాస్త్రి ఇంట రీసెంట్ గా వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ వేడుకకు టాలీవుడ్ కు చెందిన అనేక మంది ప్రముఖులు హాజరయ్యారు. కొత్త జంటకు శుభాకాంక్షలు తెలిపారు. తమ సినిమాల షెడ్యూల్స్ తో బిజీగా ఉన్నా.. చిరంజీవి, బాలకృష్ణ కూడా విచ్చేశారు. వేడుకలో ఒక్కసారిగా ఇద్దరూ ఎదురుపడ్డారు. వెంటనే బాలయ్య.. ఎలా ఉన్నారు బ్రదర్ అని చిరును పలకరించారు.

షేక్ హ్యాండ్ అని మరీ పలకరించిన బాలయ్యకు చిరు కూడా ప్రేమగా రెస్పాండ్ అయ్యారు. ఆ తర్వాత ఇద్దరూ కాసేపు మాట్లాడుకున్నారు. బాలకృష్ణ చిన్నగా జోక్స్ కూడా వేసినట్లు తెలుస్తోంది. అదే సమయంలో త్వరలో జరిగే తన సన్మాన కార్యక్రమానికి రావాలని చిరును బాలయ్య ఇన్వైట్ చేశారు. మెగాస్టార్ కూడా వస్తానని తెలిపారు. సినిమాల్లోకి బాలయ్య వచ్చి 50 ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా నటసింహన్ని ఘనంగా సన్మానించనున్నారు. అందుకు చిరంజీవికి ఇప్పటికే ఆహ్వానం అందింది.

అయితే ఆహా ఓటీటీలో స్ట్రీమ్ అయ్యే అన్‌ స్టాపబుల్‌ షో ప్రస్తావన కూడా చిరు, బాలయ్య మధ్య వచ్చినట్లు టాక్ వినిపిస్తోంది. బాలకృష్ణ హోస్ట్ చేసే ఆ షోకు ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. ఇప్పటికే పలు సీజన్స్ పూర్తి అవ్వగా.. త్వరలో మళ్లీ స్టార్ట్ కానుంది. అందులో భాగంగా చిరంజీవి, రామ్ చరణ్ వస్తారని ఎప్పటి నుంచో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే బాలయ్య, చిరంజీవి పలకరించుకున్న పిక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారగా.. వ్యాట్ ఏ ఫ్రేమ్ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.