Begin typing your search above and press return to search.

ఆ విషయంలో చిరంజీవికి తొందరేం లేదు!

దీంతో చిరుకి కొన్నాళ్లపాటు రెస్ట్ తీసుకునే అవకాశం దొరికినట్లయింది.

By:  Tupaki Desk   |   21 Oct 2024 2:30 PM GMT
ఆ విషయంలో చిరంజీవికి తొందరేం లేదు!
X

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘విశ్వంభ‌ర‌’. ఎన్నో ఏళ్ళ తర్వాత చిరు నటిస్తున్న సోషియో ఫాంటసీ జోనర్ సినిమా ఇది. ముందుగా ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని మేకర్స్ భావించారు. దానికి తగ్గట్టుగానే షెడ్యూల్స్ ప్లాన్ చేసి, షూటింగ్ చేసారు. అయితే చివరకు తనయుడు రామ్ చరణ్ నటిస్తున్న 'గేమ్ చేంజర్' కోసం పొంగల్ రేసు నుంచి తప్పుకొని, తన సినిమాని వాయిదా వేసుకున్నారు. దీంతో చిరుకి కొన్నాళ్లపాటు రెస్ట్ తీసుకునే అవకాశం దొరికినట్లయింది.

నిజానికి గత నెలలో చిరంజీవి అనారోగ్యానికి గుర‌య్యారు. గత నెలలో చికెన్ గున్యాతో మూడు వారాల పాటు ఇబ్బంది ప‌డ్డారు. అయినా సరే ‘విశ్వంభర‌’ సినిమాని సంక్రాంతికి విడుద‌ల చేయాలనే ఉద్దేశ్యంతో షూటింగ్ లో పాల్గొన్నారు. ఆరోగ్యం సహకరించకపోయినా సెట్స్ లో అడుగుపెట్టి, కొన్ని కీలకమైన సన్నివేశాలను పూర్తి చేసి సినిమా పట్ల తన డెడికేషన్ ను చాటుకున్నారు. అయితే సినిమా విడుద‌ల వాయిదా పడటంతో, షూటింగులకు బ్రేక్ ఇచ్చి ప్రస్తుతం కాస్త విశ్రాంతి తీసుకుంటున్నారు.

‘విశ్వంభర‌’ సినిమాని సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. తనకు కలిసొచ్చిన మే 9వ తేదీన విడుద‌ల చేసే ఆలోచనలో ఉన్నారనే టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఒక సాంగ్ మాత్రమే బ్యాలెన్స్ వుందని ఇటీవల చిత్ర బృందం తెలిపింది. సినిమా రిలీజ్ కు ఇంకా చాలా టైం ఉంది కాబట్టి, త్వరగా షూటింగ్ పూర్తి చెయ్యాలనే ఒత్తిడి చిరంజీవిపై లేదు. ఎలాగూ పోస్ట్ ప్రొడక్షన్ కు ఎక్కువ సమయం పడుతుంది. మెగాస్టార్ కు వీలుకుదిరినప్పుడు పెండింగ్ పార్ట్ షూటింగ్ పెట్టుకోవచ్చు.

చికెన్ గున్యా నొప్పులు వెంటనే తగ్గేవి కాదు. ఇప్పుడు చిరంజీవి ఆరోగ్యం మెల్ల‌మెల్ల‌గా కుదుట ప‌డుతోంది. ఓపిక తెచ్చుకొని అప్పుడప్పుడు కొన్ని ఈవెంట్స్ కు కూడా అటెండ్ అవుతున్నారు. తన సన్నిహితుడు అక్కినేని నాగార్జునతో కలిసి కేరళ వెళ్లి కళ్యాణ్ జెవెలర్స్ నవరాత్రి సెలబ్రేషన్స్ లోనూ పాల్గొన్నారు. ‘విశ్వంభ‌ర‌’ సినిమాకు సంబంధించిన షూటింగ్ ఒత్తిడి లేకపోవడంతో, ప్రస్తుతం కాస్త విశ్రాంతి తీసుకుంటున్నారు. చిరు తన తదుపరి ప్రాజెక్ట్ విషయంలోనూ ఇప్పుడప్పుడే నిర్ణయం తీసుకునే అవకాశం లేదనే టాక్ వినిపిస్తోంది.

చివరగా 'భోళా శంకర్' సినిమాతో డిజాస్టర్ ఫలితాన్ని అందుకున్న చిరంజీవి.. ఈసారి ‘విశ్వంభ‌ర‌’తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని ఫిక్స్ అయ్యారు. దీని తర్వాతే నెక్స్ట్ మూవీ గురించి ఆలోచిస్తారని అంటున్నారు. ఇప్పటికే మోహ‌న్ రాజా, హరీష్ శంక‌ర్ లాంటి దర్శకుడు బిగ్ బాస్ కు స్టోరీలు వినిపించారనే టాక్ ఉంది. ముందుగా ఎవరితో చేస్తారనే విషయం మీద సంక్రాంతి త‌ర‌వాత క్లారిటీ రావొచ్చు.

‘విశ్వంభ‌ర‌’ విషయానికొస్తే, బింబిసార ఫేమ్ వశిష్ఠ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో త్రిష కృష్ణన్, ఆషికా రంగనాథ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన చిరు ఫస్ట్ లుక్, టైటిల్ గ్లిమ్ప్స్ ఆకట్టుకున్నాయి. దసరా సందర్భంగా రిలీజ్ చేసిన టీజర్ కు మిశ్రమ స్పందన లభించింది. ముఖ్యంగా వీఎఫ్ఎక్స్ మీద ఆడియన్స్ నుంచి ఎక్కువ కంప్లెయింట్స్ వచ్చాయి. విడుదలకు చాలా సమయం ఉంది కాబట్టి, ఇవన్నీ కరెక్ట్ చేసుకుంటారని అభిమానులు భావిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఆస్కార్ గ్రహీత ఎంఎం కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు.