Begin typing your search above and press return to search.

'దేవర' ఐమాక్స్ వర్షన్‌కి ఫుల్‌ డిమాండ్‌!

మరో వైపు యూఎస్ తో పాటు పలు ఓవర్సీస్‌ సెంటర్స్ లో అడ్వాన్స్ బుకింగ్‌ కూడా నమోదు అవ్వడం జరిగింది.

By:  Tupaki Desk   |   6 Sep 2024 7:45 AM GMT
దేవర ఐమాక్స్ వర్షన్‌కి ఫుల్‌ డిమాండ్‌!
X

యంగ్ టైగర్‌ ఎన్టీఆర్‌ ఆర్‌ఆర్‌ఆర్ సినిమా తర్వాత చేస్తున్న చిత్రం 'దేవర'. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా కోసం ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులు గత ఏడాది కాలంగా వెయిట్‌ చేస్తున్న విషయం తెల్సిందే. కొన్ని కారణాల వల్ల ఆలస్యం అవుతూ వచ్చిన దేవర సినిమాను ఎట్టకేలకు విడుదల చేసేందుకు సిద్ధం చేశారు. ఈనెల 27న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న దేవర సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు మెల్ల మెల్లగా మొదలు అవుతున్నాయి. మరో వైపు యూఎస్ తో పాటు పలు ఓవర్సీస్‌ సెంటర్స్ లో అడ్వాన్స్ బుకింగ్‌ కూడా నమోదు అవ్వడం జరిగింది.

ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో గతంలో వచ్చిన సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. అందుకే ఈ సినిమాకు ఓవర్సీస్ లో అంతకు మించి అన్నట్టుగా బిజినెస్ జరిగింది. దానికి తగ్గట్లుగానే భారీ ఎత్తున అడ్వాన్స్ బుకింగ్‌ జరుగుతున్నట్లు సమాచారం అందుతోంది. దేవర సినిమా ఐమాక్స్ వర్షన్ రిలీజ్ ను మేకర్స్ ఇటీవలే కన్ఫర్మ్‌ చేశారు. ఇప్పటికే ఐమాక్స్ వర్షన్ కి సంబంధించిన టికెట్లు కూడా బుకింగ్‌ పూర్తి అయ్యాయని, కచ్చితంగా భారీ వసూళ్లను దేవర సినిమా రాబట్టే అవకాశాలు ఉన్నాయని ఈ అడ్వాన్స్ బుకింగ్‌ ను చూస్తూ ఉంటే అర్థం అవుతుందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో గత కొన్ని రోజులుగా ఉన్న పరిస్థితులు మెల్ల మెల్లగా కుదుట పడుతున్నాయి. ఈ నేపథ్యంలో సినిమా విడుదల సమయానికి అంతా సవ్యంగా ఉండటం ఖాయం, తద్వార తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్‌ మరోసారి రికార్డ్‌ బ్రేకింగ్‌ ఓపెనింగ్ కలెక్షన్స్ ను రాబట్టే అవకాశాలు లేకపోలేదు. ఇక ఓవర్సీస్ లో తన రికార్డ్‌ లను తానే బ్రేక్‌ చేసుకునే విధంగా ఓపెనింగ్స్ నమోదు చేయడం ఖాయం అంటూ ఎన్టీఆర్‌ ఫ్యాన్స్ చాలా నమ్మకంగా కనిపిస్తున్నారు. సోషల్ మీడియాలో దేవర సినిమా జోరు మామూలుగా లేదు. అడ్వాన్స్ బుకింగ్‌ ఆరంభంకు ముందు నుంచే హడావుడి మొదలు అయింది.

అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్‌ టాలీవుడ్‌ లో ఈ సినిమాతో అడుగు పెట్టబోతుంది. బాలీవుడ్‌ లో గత నాలుగు అయిదు సంవత్సరాలుగా సినిమాలు చేస్తున్న జాన్వీ కపూర్‌ కి ఇప్పటి వరకు కమర్షియల్‌ సక్సెస్ దక్కలేదు. ఈ సినిమాతో జాన్వీ కి ఆ లోటు తీరబోతుంది. ఎన్టీఆర్‌, జాన్వీ కపూర్‌ కాంబో పై ఫ్యాన్స్ లో ఆసక్తి నెలకొంది. అందరి అంచనాలకు తగ్గట్లుగా వీరి కాంబో ఉండబోతుందని ఇప్పటికే విడుదల అయిన పాటలు చెప్పకనే చెబుతున్నాయి. ఎన్టీఆర్‌, జాన్వీ కపూర్ ల రొమాంటిక్‌ పాటలకు మంచి రెస్పాన్స్‌ దక్కింది. అంతే కాకుండా జాన్వీ కపూర్‌ అందాల షో తో సినిమా కి మరింతగా కమర్షియల్‌ హంగులు అద్దినట్లు అయింది. ఈ సినిమాలో బాలీవుడ్‌ స్టార్‌ సైఫ్ అలీ ఖాన్ నటించగా, అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్నాడు, కళ్యాణ్‌ రామ్‌, సుధాకర్‌ మిక్కిలినేని కలిసి నిర్మించారు.