Begin typing your search above and press return to search.

మైత్రి దూకుడు.. దిల్ రాజు జెట్ స్పీడ్!

అయితే సినిమాల నిర్మాణం వరకే కాకుండా.. డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ లోకి కూడా ప్రవేశించింది మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ.

By:  Tupaki Desk   |   25 Aug 2024 3:30 AM GMT
మైత్రి దూకుడు.. దిల్ రాజు జెట్ స్పీడ్!
X

మైత్రీ మూవీ మేకర్స్.. టాలీవుడ్ లో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. శ్రీమంతుడు మూవీతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన సంస్థ.. తనదైన శైలితో ఆడియన్స్ మెప్పిస్తోంది. వై రవి శంకర్, నవీన్ యెర్నేని ఆధ్వర్యంలో నడుస్తున్న టాప్ బ్యానర్ భారీ బడ్జెట్ తో ఒకదాని తర్వాత ఒక్కో సినిమాను నిర్మిస్తోంది. కాన్సెప్ట్ ఓరియెంటెడ్ చిత్రాలు కూడా ప్రొడ్యూస్ చేస్తోంది. అయితే సినిమాల నిర్మాణం వరకే కాకుండా.. డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ లోకి కూడా ప్రవేశించింది మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ.

ఇప్పుడు నైజాంలో బడా సినిమాలు దగ్గర నుంచి చిన్న చిత్రాల వరకు అనేక మూవీలను పంపిణీ చేస్తోంది మైత్రీ మూవీ మేకర్స్‌ డిస్ట్రిబ్యూషన్‌ ఎల్ఎల్‌పీ (Mythri Movie Distribution LLP). ఇటీవల అనేక చిత్రాలు రిలీజ్ చేసింది. త్వరలోనే మరిన్ని సినిమాలను విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. అయితే ఒకప్పుడు నైజామే కాదు.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ నిర్మాత దిల్ రాజే అన్ని సినిమాలను రిలీజ్ చేసేవారన్న విషయం తెలిసిందే.

స్టార్ కథానాయకుల నుంచి కొత్త హీరోల వరకు.. ఎవరి సినిమా అయినా దిల్ రాజు సంస్థే విడుదల చేసేది. ఓవైపు నిర్మిస్తూ.. మరోవైపు రిలీజులు చేసింది. భారీ లాభాలు అందుకుని టాప్ బ్యానర్ గా ఎదిగింది. ఒకప్పుడు నైజాం కింగ్ గా దిల్ రాజును అనే వారు. కానీ ఇప్పుడు పరిస్థితి అంతా ఒక్కసారిగా మారిపోయింది. చిత్రాలు నిర్మిస్తూనే.. డిస్ట్రిబ్యూషన్ ఫీల్డ్ లోకి మైత్రీ మూవీ మేకర్స్ ఎంట్రీతో SVC సంస్థకు సినిమాలు రావడం లేదన్న విషయం వాస్తవమే.

తెలుగు సినిమాలు రిలీజ్ చేసే అవకాశం మైత్రీ సంస్థ అందుకుంటుంటే.. డబ్బింగ్ చిత్రాల ఛాన్సులు ఏషియన్ సురేష్ దక్కించుకుంటున్నారు. దీంతో SVC డిస్ట్రిబ్యూషన్ ఒకప్పుడు దూసుకుపోయినా.. ఇప్పుడు అడపాదడపా అవకాశాలు అందుకుంటోంది. అయితే చాలా రోజులకు దిల్ రాజు ఒక సినిమాను డిస్ట్రిబ్యూట్ చేయనున్నారు. టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని సరిపోదా శనివారం మూవీని పంపిణీ చేయనున్నారు. ఆగస్టు 29వ తేదీన గ్రాండ్ గా విడుదల అవ్వనుంది.

వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్న చిత్రాన్ని డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డీవీవీ దానయ్య నిర్మించారు. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల రిలీజ్ చేసిన ట్రైలర్.. మంచి రెస్పాన్స్ అందుకుంది. పాన్ ఇండియా లెవెల్ లో విడుదలవ్వనున్న ఈ సినిమా కోసం నాని బాగానే ప్రమోట్ చేస్తున్నారు. తెలుగులో కూడా పలు ఇంటర్వ్యూలు ఇచ్చి హైప్ క్రియేట్ చేశారు. మరి ఈ మూవీ ఎలా ఉంటుందో? దిల్ రాజు ఎలాంటి లాభాలు అందుకుంటారో చూడాలి.