సంచలనం: SSR మేనేజర్ దిశా డెత్ కేసులో నాయకులు నటులు కమిషనర్లు
దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ లేడీ మేనేజర్ దిశా సాలియన్ ఆకస్మిక మరణం నాలుగేళ్ల క్రితం సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 26 March 2025 3:41 AMదివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ లేడీ మేనేజర్ దిశా సాలియన్ ఆకస్మిక మరణం నాలుగేళ్ల క్రితం సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. 8 జూన్ 2020న ముంబై మలాడ్లోని ఒక నివాస భవనం 14వ అంతస్తు నుండి పడి మరణించిందని కథనాలొచ్చాయి. జూన్ 14న సుశాంత్ సింగ్ తన బాంద్రా ఇంట్లో చనిపోవడానికి ఆరు రోజుల ముందు దిశా అనుమానస్పదంగా మృతి చెందింది. ఈ రెండు సంఘటనలు మీడియా సహా ప్రపంచం దృష్టిని ఆకర్షించాయి. చాలా కుట్ర సిద్ధాంతాలు పుట్టుకొచ్చాయి. మీడియాలు స్వతంత్ర దర్యాప్తు సంస్థలుగా వ్యవహరించి కథనాలు ప్రచురించడం తీవ్ర విమర్శలకు దారితీసింది.
దిశ తండ్రి సతీష్ సాలియన్ తన కుమార్తె అనుమానాస్పద మరణంపై లోతైన దర్యాప్తు కోసం ఇప్పటికీ పట్టుబడుతున్నారు. ఈ మరణం అనుమానాస్పదమైనది. రాజకీయ నాయకుడు ఆదిత్య థాకరేపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ ఆయన గతంలో హైకోర్టును ఆశ్రయించారు. తాజా పిటిషన్ లో తన కుమార్తె మరణం వెనక రాజకీయ నాయకుడి జోక్యం ఉందని, అనుమానాస్పద పరిస్థితులు ఉన్నాయని ఆరోపిస్తూ అతడు కొత్తగా సిబిఐ దర్యాప్తును కోరాడు. దిశా తండ్రి సతీష్ ఎఫ్ఐఆర్లో మొత్తం తొమ్మిది మందిని నిందితులుగా పేర్కొన్నారు. మాజీ సీఎం ఉద్ధవ్ థాక్రే కుమారుడు ఆదిత్య థాకరే, డినో మోరియా, సూరజ్ పంచోలి, రియా చక్రవర్తి, సూరజ్ పంచోలి, మాజీ ముంబై పోలీసు కమిషనర్ పరంబీర్ సింగ్, తొలగించబడిన పోలీసు అధికారి సచిన్ వాజ్ తదితరులు కూడా ఉన్నారు. ఎఫ్ఐఆర్లో వీరంతా పెద్ద కుట్రలో పాల్గొన్నారని, నిజాన్ని కప్పిపుచ్చారని సతీష్ సాలియన్ న్యాయవాది పేర్కొన్నారు.
ఎఫ్ఐఆర్లో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సిబి) కనుగొన్న విషయాలను ప్రస్తావించినట్లు తెలుస్తోంది. దీని ప్రకారం... ఆదిత్య థాకరేకు మాదకద్రవ్యాల రాకెట్తో సంబంధాలు ఉన్నాయని పేర్కొన్నారు. నిజాన్ని కప్పిపుచ్చిన అధికారిగా పరమ్బీర్ సింగ్ పేరును సూచిస్తూ కుట్ర వెనక ప్రధాన సూత్రధారి అని ఎఫ్.ఐ.ఆర్ లో పేర్కొన్నారు. ప్రజలు, మీడియా దృష్టిని మళ్ళించడానికి, ప్రభావవంతమైన వ్యక్తులను రక్షించడానికి తప్పుడు స్టోరీలు పరమ్ సింగ్ అల్లారని ఆరోపించారు.
తాజా పరిణామం ఇప్పుడు పెద్ద రచ్చవుతోంది. రాజకీయంగా ఉద్రిక్తతలకు దారి తీస్తోంది. ప్రస్తుతానికి, ముంబై పోలీసులు, కేంద్ర దర్యాప్తు సంస్థలు ఎఫ్.ఐ.ఆర్ లో చేసిన ఆరోపణలపై అధికారికంగా స్పందించాల్సి ఉంది. దర్యాప్తు ముందుకు సాగుతున్న కొద్దీ ఈ కేసులో మరిన్ని పరిణామాలకు ఆస్కారం ఉంది. తాజా ఎఫ్.ఐ.ఆర్ గురించి
ఈ ఫిర్యాదును ముంబై కమిషనర్ ఆఫ్ పోలీస్ - జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (క్రైమ్) అధికారికంగా అంగీకరించారు.