Begin typing your search above and press return to search.

'పుష్ప 2'.. రామోజీ ఫిల్మ్‌ సిటీలో ఏం జరుగుతుందంటే!

అల్లు అర్జున్‌ ఈ సినిమా తో ఆగస్టు లోనే రావాల్సి ఉన్నా షూటింగ్‌ ఆలస్యం అయింది.

By:  Tupaki Desk   |   28 Sep 2024 11:38 AM GMT
పుష్ప 2.. రామోజీ ఫిల్మ్‌ సిటీలో ఏం జరుగుతుందంటే!
X

అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 సినిమా పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. పుష్ప పార్ట్‌ 1 పాన్‌ ఇండియా రేంజ్ లో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ముఖ్యంగా నార్త్‌ ఇండియాలో పుష్ప సినిమా వంద కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. అందుకే పుష్ప 2 సైతం అంతకు మించి ఉంటుంది అని, వెయ్యి కోట్ల టార్గెట్‌ తో రాబోతుంది అంటూ మేకర్స్ ధీమాతో ఉన్నారు. అల్లు అర్జున్‌ ఈ సినిమా తో ఆగస్టు లోనే రావాల్సి ఉన్నా షూటింగ్‌ ఆలస్యం అయింది. దాంతో సినిమా వాయిదా పడి డిసెంబర్‌ కి షిప్ట్‌ అయింది. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుతున్నారు.

సినీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం కీలకమైన అల్లు అర్జున్‌ - ఫహద్‌ ఫాసిల్ లపై సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. కీలకమైన ఆ సన్నివేశాల చిత్రీకరణ తో టాకీ పార్ట్‌ దాదాపుగా పూర్తి అయినట్లే అని సమాచారం అందుతోంది. అంతే కాకుండా ఒక ఐటెం సాంగ్ ను సైతం వచ్చే నెలలో పూర్తి చేస్తారట. మొత్తానికి అక్టోబర్ లో సినిమా కి గుమ్మడి కాయ కొట్టే విధంగా ప్లాన్‌ చేస్తున్నారు. పుష్ప 2 సినిమా షూటింగ్‌ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్‌ సిటీ లో జరుగుతోంది. ఈ షెడ్యూల్‌ లో అల్లు అర్జున్‌, ఫాహద్‌ ఫాసిల్ లు పాల్గొంటున్నారు. ఇద్దరి మధ్య ఉండే సన్నివేశాలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా ఉంటాయట.

పుష్ప 2 కోసం ఫహద్‌ డేట్లు ఎక్కువగా కావల్సి ఉందట. గతంలో ఆయన డేట్లు అడిగితే ఇతర సినిమాలకు కమిట్‌ అవ్వడంతో ఇవ్వలేక పోయారు. అందుకే ఆగస్టు లో సినిమా విడుదల అవ్వాల్సి ఉన్నా వాయిదా పడింది. ఇప్పుడు ఆ సన్నివేశాల చిత్రీకరణ చేస్తున్నారు. మలయాళంలో ఫహద్‌ హీరోగా ఒక సినిమాకు ఎన్ని డేట్లు కేటాయిస్తాడో అంతకు మించి డేట్లు కేటాయించినా పుష్ప 2 షూటింగ్‌ పూర్తి అవ్వలేదు. సుకుమార్‌ ఒకటికి రెండు సార్లు షూట్‌ చేయడంతో పాటు, ఇతర విషయాల కారణంగా పుష్ప 2 కోసం ఫహద్‌ ఎక్కువ డేట్లు ఇవ్వాల్సి వచ్చిందని సమాచారం అందుతోంది.

అల్లు అర్జున్ కి జోడీగా రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. వీరి కాంబోలో ఇప్పటికే పాటల చిత్రీకరణ పూర్తి అయింది. పుష్ప మొదటి పార్ట్‌ లో సమంత హీరోయిన్ గా నటించగా, సెకండ్‌ పార్ట్ లో బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ ఐటెం సాంగ్‌ ను చేసే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటి వరకు పుష్ప 2 ఐటెం సాంగ్ హీరోయిన్‌ ఎవరు అనే విషయమై క్లారిటీ రాలేదు. దేవిశ్రీ ప్రసాద్‌ అందిస్తున్న సంగీతం సినిమాకు మరోసారి అదనపు ఆకర్షణగా నిలుస్తుందని అంటున్నారు. పాన్ ఇండియా రేంజ్ లో ఉన్న క్రేజ్ నేపథ్యంలో రూ.500 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసే అవకాశాలు ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.