ఇంకా చిట్టి అంటున్నారు, అప్పుడే 4 ఏళ్లు అయిందా!
తెలుగు సినిమా కరోనా దెబ్బతో తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న సమయంలో వచ్చిన 'జాతిరత్నాలు' సినిమా బాక్సాఫీస్ను షేక్ చేసింది.
By: Tupaki Desk | 12 March 2025 4:15 PM ISTతెలుగు సినిమా కరోనా దెబ్బతో తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న సమయంలో వచ్చిన 'జాతిరత్నాలు' సినిమా బాక్సాఫీస్ను షేక్ చేసింది. తెలుగు ప్రేక్షకులు కంటెంట్ బాగుంటే కరోనాను కూడా లక్ష్య పెట్టకుండా థియేటర్లకు వచ్చి సినిమాలను చూస్తారు అని జాతిరత్నాలు సినిమా నిరూపించింది. నవీన్ పొలిశెట్టి హీరోగా ఫరియా అబ్దుల్లా హీరోయిన్గా నటించిన జాతిరత్నాలు సినిమా ట్రెండ్ సెట్టర్గా నిలిచింది. సినిమా అంటే ఇలా కూడా ఉంటుందా, కామెడీ అంటే ఇలా కూడా చేయవచ్చా అంటూ ఫిల్మ్ మేకర్స్ సైతం నోరు వెళ్ల బెట్టి చూసే విధంగా, ప్రతి ఒక్కరిని నవ్వించే విధంగా జాతిరత్నాలు సినిమా నిలిచింది.
2021, మార్చి 11న విడుదలైన జాతిరత్నాలు సినిమా అప్పుడే నాలుగు ఏళ్లు పూర్తి చేసుకుంది. సినిమా వచ్చి నాలుగు ఏళ్లు అయినా సోషల్ మీడియాలో, బుల్లి తెరపై ఎక్కడ చూసినా కూడా జాతిరత్నాల కామెడీ సీన్స్, పోస్టర్స్ కనిపిస్తూ వస్తున్నాయి. దాంతో జాతిరత్నాలు సినిమా ఈమధ్య వచ్చింది అనే ఫీల్ అందరికీ ఉంటుంది. కానీ సినిమా వచ్చి అప్పుడే నాలుగు ఏళ్లు అయిందంటే నమ్మశక్యంగా లేదని నెటిజన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. నవీన్ పొలిశెట్టిని తెలుగులో యంగ్ స్టార్ హీరోల సరసన నిలిపిన జాతిరత్నాలు సినిమా మరోసారి థియేట్రికల్ రిలీజ్ అయినా భారీ వసూళ్లు రాబట్టే అవకాశాలు ఉన్నాయని ఆ సినిమా అభిమానులు అంటూ ఉంటారు.
నవీన్ పొలిశెట్టితో పాటు ఈ సినిమాలో ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ చేసిన కామెడీ కారణంగా సినిమాకు పెట్టిన బడ్జెట్తో పోల్చితే లాభాలు ఏకంగా ఏడు రెట్లు వచ్చినట్లు టాక్. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇంత శాతం లాభాలు దక్కించుకున్న సినిమాలు చాలా తక్కువగా ఉంటాయి. అందులో జాతిరత్నాలు ఒకటి అనడంలో సందేహం లేదు. జాతిరత్నాలు సీక్వెల్ చేయాలని మేకర్స్ ను చాలా కాలంగా ప్రేక్షకులు డిమాండ్ చేస్తున్నారు. కానీ మేకర్స్ మాత్రం ఇప్పటి వరకు సీక్వెల్ విషయమై ఆసక్తి చూపడం లేదు. అనుదీప్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాతో ఫరియా సైతం మంచి గుర్తింపు సొంతం చేసుకుంది.
జాతిరత్నాలు 4 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఫరియా సోషల్ మీడియా ద్వారా స్పందించింది. నా జీవితంలో ఎప్పటికీ మరచిపోలేని మధుర జ్ఞాపకంకు 4 ఏళ్లు అయిందంటే నమ్మలేకుండా ఉంది. ఈ సినిమాను గత నెలలోనే అన్ని చోట్ల ప్రచారం చేసినట్లు, ఇటీవల ప్రమోషన్స్ కార్యక్రమంలో పాల్గొన్నట్లు అనిపిస్తుంది. జాతిరత్నాలు సమయంలో పొందిన అనుభూతులను ఇప్పుడు మిస్ అవుతున్నాను. ఇప్పటికీ నన్ను మీలో చాలా మంది చిట్టీ అని పిలుస్తున్నారు. అలాంటిది అప్పుడే నాలుగు ఏళ్లు పూర్తి కావడం అనేది ఆశ్చర్యంగా ఉందని ఫరియా పోస్ట్ చేసింది.