పాకిస్తాన్ ఏమైనా పర్యటక ప్రాంతమా.. హీరోయిన్కి డైరెక్టర్ కౌంటర్
హీరో పాకిస్తాన్కి వెళ్లే సమయంలో భార్యను తీసుకు వెళ్తాడని స్క్రిప్ట్లో ఉందని అమీషా చెబుతోంది.
By: Tupaki Desk | 13 Feb 2025 2:30 AM GMTసన్నీ డియోల్ సూపర్ హిట్ మూవీ 'గదర్ ఏక్ ప్రేమ్ కథ'కి సీక్వెల్గా రూపొందిన 'గదర్ 2' చిత్రం 2023లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా విడుదలై ఏడాదిన్నర అవుతున్నా ఒక వివాదం కొనసాగుతోంది. సినిమాలో క్లైమాక్స్ మార్చి తన పాత్రకు అన్యాయం చేశాడంటూ అమీషా పటేల్ ఒక ఇంటర్వ్యూలో తీవ్ర విమర్శలు చేసింది. దర్శకుడు అనిల్ శర్మ తనకు అనుకూలంగా సినిమా స్క్రిప్ట్ను మార్చేశారు. క్లైమాక్స్తో పాటు సినిమాలోని చాలా సన్నివేశాలను తనకు అనుకూలంగా ఉన్న వారి కోసం మార్చేశారు అంటూ అమీషా పటేల్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. హీరో పాకిస్తాన్కి వెళ్లే సమయంలో భార్యను తీసుకు వెళ్తాడని స్క్రిప్ట్లో ఉందని అమీషా చెబుతోంది.
కేవలం రూ.60 కోట్ల బడ్జెట్తో రూపొందిన 'గదర్ 2' సినిమా వరల్డ్ బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.700 కోట్ల వసూళ్లు రాబట్టింది. చిన్న సినిమాగా విడుదలైన గదర్ 2 సినిమా 2023లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీగా నిలిచింది. అయినా సినిమాపై ఇలాంటి ఒక వివాదం కొనసాగడం విడ్డూరంగా ఉందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అమీషా పటేల్ వ్యాఖ్యలపై నలుగురు నాలుగు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా దర్శకుడు అనిల్ శర్మ స్పందించారు. అమీషా పటేల్ వాదనను కొట్టి పారేసిన ఆయన తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేశారు. అంతే కాకుండా అమీషా పటేల్ తీరుపై, ఆమె చేస్తున్న వ్యాఖ్యలపై దర్శకుడు అనిల్ శర్మ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు.
అనిల్ శర్మ మాట్లాడుతూ... గదర్ 2 స్క్రిప్ట్ చెప్పిన సమయంలో సకీనా కూడా పాకిస్తాన్కి వెళ్తుందా అని ఆమె అడిగారు. అప్పుడు అలాంటి ఆలోచన ఏమీ లేదని క్లీయర్గా చెప్పాను. నా నిర్ణయం మంచిదేనా? కాదా? అనే విషయాన్ని ప్రేక్షకులు తేల్చారు. సినిమా హిట్ కావడంతో తాను తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని ప్రేక్షకులు సమర్థించారని అన్నారు. స్క్రిప్ట్ చదివిన తర్వాతే మీరు గదర్ 2 సినిమాను చేసేందుకు ఒప్పుకున్నారు. సినిమాలో నటించిన ప్రతి ఒక్కరికీ హైలైట్ కావాలని కోరిక ఉంటుంది. కానీ అన్ని సార్లు అది సాధ్యం కాదు. సందర్భానుసారంగా సినిమాలోని కొందరికి మంచి పేరు వస్తుంది. సినిమాలోని సకీనా పాత్ర హైలైట్ కాకపోవడం తన తప్పు కాదని అన్నారు.
తారసింగ్ తన కొడుకును కాపాడటం కోసం పాకిస్తాన్ వెళ్తాడు. అక్కడికి భార్యతో ఎలా వెళ్తాడు. అయినా ఫ్యామిలీతో కలిసి వెళ్లడానికి పాకిస్తాన్ ఏమైనా పర్యటక ప్రాంతమా అని దర్శకుడు అనిల్ శర్మ అన్నారు. పాకిస్తాన్కి తారసింగ్ భార్యను వెంట పెట్టుకు వెళ్తే కొడుకును కాపాడటం ఎలా సాధ్యం అవుతుంది అని అనిల్ శర్మ అన్నారు. గదర్ 2 కథ చెప్పిన సమయంలో విలన్ను సకీనా పాత్ర చంపుతుందని దర్శకుడు అన్నాడని అమీషా పటేల్ చెబుతోంది. దర్శకుడు మాత్రం సినిమాకు ఏది కావాలో అదే చేశాము. సినిమా సక్సెస్ కోసం తీసుకోవాల్సిన నిర్ణయాలను తీసుకున్నాం. కొన్ని సార్లు ముందుగా అనుకున్నట్టుగా కాకుండా చిన్న చిన్న మార్పులు చేయాల్సి ఉంటుందని ఆయన అన్నారు. అయితే అమీషా పటేల్ విమర్శలను మాత్రం ఆయన తప్పుబడుతున్నారు. సినిమా సక్సెస్ తర్వాత ఇలాంటి విమర్శలు కరెక్ట్ కాదని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.