Begin typing your search above and press return to search.

అల్లు అర్జున్‌పై ట్రోల్స్ - హైపర్ ఆది ఆసక్తికర వ్యాఖ్యలు!

ఇటీవలి కాలంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పై సోషల్ మీడియాలో ఎక్కువగా ట్రోలింగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   23 July 2024 10:06 AM GMT
అల్లు అర్జున్‌పై ట్రోల్స్ - హైపర్ ఆది ఆసక్తికర వ్యాఖ్యలు!
X

ఇటీవలి కాలంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పై సోషల్ మీడియాలో ఎక్కువగా ట్రోలింగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికలు పూర్తయిన దగ్గర నుంచి కొందరు ట్రోలర్స్ ఆయన్ను లక్ష్యంగా చేసుకొని ఎడిటెడ్ ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేస్తూ విమర్శిస్తున్నారు. ఇదే విషయం మీద తాజాగా జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది స్పందించారు. ఉద్దేశపూర్వకంగా అల్లు అర్జున్‌ను ట్రోల్‌ చేయడం తగదని అన్నారు.

అశ్విన్‌ బాబు, దిగంగనా సూర్యవంశీ జంటగా నటించిన సినిమా 'శివం భజే'. ఈరోజు మంగళవారం హైదరాబాద్ లోని AAA సినిమాస్ లో ఈ మూవీ ట్రైలర్‌ రిలీజ్‌ ఈవెంట్ జరిగింది. ఈ కార్యక్రమానికి హైపర్ ఆది కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతూ.. అల్లు అర్జున్ ఒక నేషనల్‌ అవార్డు విన్నర్‌ అని, ఆయన్ని మనం అందరం గౌరవించాలని అన్నారు.

"అల్లు అర్జున్ ను ట్రోల్ చేసేవారికి నేను చెప్తున్నాను.. పవన్ కళ్యాణ్ కి కానీ, మెగా ఫ్యామిలీకి కానీ అలాంటి ఫీలింగ్ ఎప్పుడూ ఉండదు. వాళ్లంతా ఎప్పుడూ ఒక్కటే. కాబట్టి నేషనల్ అవార్డ్ సాధించిన అల్లు అర్జున్ కొంతమందిని వాంటెడ్ గా ట్రోల్ చెయ్యడం గానీ, థంబ్ నెయిల్స్ పెట్టడంలాంటివి చెయ్యొద్దు. దయచేసి అలాంటివి ఇక నుంచైనా ఆపేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను." అని హైపర్ ఆది అన్నారు.

ఏపీ ఎన్నికల్లో అల్లు అర్జున్ తన స్నేహితుడు, నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్రరెడ్డికి సపోర్ట్ చేసిన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ పార్టీకి ప్రచారం చేయకుండా ఇలా ప్రత్యర్థి పార్టీకి చెందిన క్యాండిడేట్ కు మద్దతు తెలపడంపై కొందరు మెగా ఫ్యాన్స్, జనసేన కార్యకర్తలు ఫైర్ అయ్యారు. బన్నీ సపోర్ట్ చేసిన అభ్యర్థి ఓడిపోవడం ట్రోలింగ్ కు మరింత అవకాశం కల్పించింది. సోషల్ మీడియా వేదికగా అల్లు అర్జున్ ను, ఆయన ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ విపరీతంగా ట్రోల్ చేశారు. ఇప్పుడిదే విషయం మీద ఆది మెచ్యూర్ గా సమాధానం చెప్పారు.

హైపర్ ఆది ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున ప్రచారంలో పాల్గొన్న సంగతి తెలిసిందే. అయినప్పటికీ ఇప్పుడు అల్లు అర్జున్ పై ట్రోలింగ్ చేయడం సరికాదని అన్నారు. అల్లు, మెగా ఫ్యామిలీ అంతా ఒకటే అని చెప్పారు. ఇప్పటి నుంచైనా అల్లు అర్జున్ ను ట్రోల్ చెయ్యడం ఆపాలని నెటిజన్లకు సూచించారు. పవన్‌ కల్యాణ్‌ అంటే తనకెంతో ఇష్టమని ఆది అన్నారు. పవన్ సంతోషంగా ఉంటే దూరం నుంచి చూసి ఆనందిస్తానని, బాధలో ఉంటే దగ్గరకెళ్లి చూసుకుంటానని పేర్కొన్నారు. పవన్ కల్యాణ్ కోసమే ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నానని, తనకు ఎమ్మెల్సీ ఇస్తారంటూ జరుగుతోన్న ప్రచారంలో వాస్తవం లేదని ఆది స్పష్టం చేశారు.