RC16లో ధోని.. మ్యాటరేంటంటే?
చరణ్ 'రంగస్థలం' తర్వాత మళ్లీ ఒక మాస్ ఎమోషనల్ కంటెంట్ ఉన్న కథను ఎంచుకోవడం, ఇందులో స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ ఉండడం ఆసక్తిని పెంచుతున్నాయి.
By: Tupaki Desk | 17 March 2025 1:32 PM ISTరామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు సానా దర్శకత్వంలో RC16 అనే స్పోర్ట్స్ డ్రామా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రారంభం నుంచి భారీ అంచనాలు నెలకొన్నాయి. చరణ్ ‘రంగస్థలం’ తర్వాత మళ్లీ ఒక మాస్ ఎమోషనల్ కంటెంట్ ఉన్న కథను ఎంచుకోవడం, ఇందులో స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ ఉండడం ఆసక్తిని పెంచుతున్నాయి. అలాగే జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుండగా, బాలీవుడ్ నటుడు దివ్యేందు, శివరాజ్ కుమార్, జగపతిబాబు వంటి స్టార్ క్యాస్ట్ ఉండటం సినిమాను మరో లెవెల్కి తీసుకెళ్లేలా ఉంది.
ఈ సినిమా ఒక స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ మూవీ కావడంతో ప్రేక్షకులు కూడా మరింత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బుచ్చిబాబు తన మొదటి సినిమా ఉప్పెనతో లవ్, ఎమోషనల్ ఎలిమెంట్స్ కలిగిన కథను చెప్పిన విధానం అందరికీ నచ్చింది. ఇప్పుడు రామ్ చరణ్ కూడా RC16 కోసం పూర్తిగా కొత్త లుక్లో కనిపించబోతున్నాడనే టాక్ ఉంది. ఈ చిత్రానికి ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందించడంతో మరో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.
తాజాగా ఈ సినిమాలో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ గెస్ట్ రోల్ చేయనున్నాడనే వార్తలు హల్చల్ చేశాయి. కొన్ని కథనాలు ధోనీ, రామ్ చరణ్ కోచ్గా కనిపిస్తాడని పేర్కొన్నాయి. నిజానికి ధోనీకి అలాగే రామ్ చరణ్ కు మంచి స్నేహం ఉంది. హైదరాబాద్ కు వస్తే ధోని రామ్ చరణ్ ను కూడా కలుస్తూ ఉంటాడు. వీరిద్దరి మధ్యలో స్పెషల్ బాండింగ్ ఉంది. అయితే ఇప్పుడు RC16లో ఒక గెస్ట్ రోల్ చేస్తున్నట్లు టాక్ వచ్చింది.
అయితే ఇది ఫేక్ న్యూస్ అని చిత్ర యూనిట్ వర్గాల ద్వారా ఓ క్లారిటీ వచ్చేసింది, సినిమాలో నిజంగా కోచ్ క్యారెక్టర్ ఉన్నప్పటికీ, ఆ పాత్రను ధోనీ పోషించడం లేదు. ధోనీ ఇప్పటివరకు సినిమాల్లో నటించలేదు, అయితే అతను సినిమా నిర్మాణంలో మాత్రం బిజీ అవ్వాలని చూస్తున్నాడు. ఇక సినీ రంగానికి సంబంధించిన పలు కార్యక్రమాలకు వచ్చారు. మరోవైపు RC16 షూటింగ్ వేగంగా సాగుతోంది. జన్వరీలో ముంబైలో ప్రారంభమైన షూటింగ్ ప్రస్తుతం ఇతర ప్రాంతాల్లో జరుగుతోంది.
బుచ్చిబాబు సహజమైన వాతావరణాన్ని చూపించేందుకు ఎక్కువగా అవుట్డోర్ లొకేషన్లను ఎంచుకున్నట్లు సమాచారం. ఇందులో రామ్ చరణ్ పాత్ర చాలా ఎమోషనల్గా, పర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్గా ఉంటుందని టాక్. ఈ సినిమాను వృద్ధి సినిమాస్ బ్యానర్పై వెంకట్ సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతోంది. ధోనీ వార్తలు నిజం కాకపోయినా, సినిమా మీద అంచనాలు మాత్రం రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఇక అధికారిక అప్డేట్ కోసం అభిమానులు వేచి చూస్తున్నారు.