రియల్ ఎస్టేట్లో సీనియర్ నటికి భారీ లాభాలు
దానిని కేవలం రెండు మూడేళ్లలోనే డబుల్ ట్రిపుల్ చేస్తూ ఆశ్చర్యపరుస్తున్నారు.
By: Tupaki Desk | 27 March 2025 3:25 AMబాలీవుడ్ సెలబ్రిటీలు ఇటీవల రియల్ ఎస్టేట్ బిజినెస్ లో తలమునకలుగా ఉన్నారు. ముంబై అర్బన్, సబర్బన్ ప్రాంతాల్లో పెట్టుబడులు పెడుతూ డబ్బుకు డబ్బు సంపాదిస్తున్నారు. కొందరు ఒక్కో అమ్మకం ద్వారా పదింతలు అధిక ఆదాయం సంపాదించిన వైనం బయటపడుతోంది. అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్, శ్రద్ధాకపూర్, అక్షయ్ కుమార్, ప్రియాంక చోప్రా .. వీరంతా రియల్ వెంచర్లలో తమ సంపాదనను పెట్టుబడిగా పెడుతున్నారు. దానిని కేవలం రెండు మూడేళ్లలోనే డబుల్ ట్రిపుల్ చేస్తూ ఆశ్చర్యపరుస్తున్నారు.
ఇప్పుడు ఇదే బాటలో మరో సీనియర్ హీరోయిన్ రియల్ వెంచర్లలో పెట్టుబడులు పెట్టి వాటిని లాభాలకు సేల్ చేయడం ఆసక్తిని కలిగిస్తోంది. కాజోల్ ఇప్పటికే ముంబైలోని పలు ప్రైమ్ ఏరియాల్లో భారీ ఆస్తులను సంపాదించారు. ఇప్పుడు తన ఆస్తులలో ఒకదాన్ని విక్రయించినట్లు కథనాలొస్తున్నాయి. అక్షయ్ కుమార్ ముంబైలోని బోరివాలి ప్రాంతంలో రెండు ఆస్తులను అమ్మిన కొద్దిసేపటికే ఈ వార్త బయటకు వచ్చింది.
హిందూస్తాన్ టైమ్స్ కథనం ప్రకారం.. కాజోల్ పోవైలో 762 చదరపు అడుగుల అపార్ట్మెంట్ను రూ. 3.1 కోట్లకు సేల్ చేసారు. ఈ డీల్ 20 మార్చి 2025న జరిగింది. చదరపు అడుగుకు దాదాపు రూ. 40,682 చొప్పున ఖరీదుతో ఈ ఫ్లాట్ ని అమ్మారు. ఈ అపార్ట్మెంట్ హిరానందని గార్డెన్స్లోని అట్లాంటిస్ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీలోని 21వ అంతస్తులో ఉంది. రెండు కార్ పార్కింగ్ స్థలాలను కలిగి ఉంది. వృషాలి రజనీష్ రాణే - రజనీష్ విశ్వనాథ్ రాణే ఈ ఆస్తిని కొనుగోలు చేశారు. కాజోల్ అమ్మకంలోనే కాదు కొనుగోళ్లలోను స్పీడ్ గా ఉన్నారు. ఇటీవల కాజోల్ గోరేగావ్ వెస్ట్లో రూ. 28.78 కోట్లకు ఒక కమర్షియల్ ప్రాపర్టీని కొనుగోలు చేసినట్లు జాతీయ మీడియాలో కథనాలొచ్చాయి. 4,365 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ ఆస్తి బంగూర్ నగర్లోని లింకింగ్ రోడ్లోని ఒక భవనం గ్రౌండ్ ఫ్లోర్లో ఉంది.
2023లోను కాజోల్ రియల్ ఎస్టేట్ లో విరివిగా పెట్టుబడులు పెట్టారు. ముంబై ఆ పరిసరాల్లో భారీ వెంచర్లలో పెట్టుబడులు పెడుతున్నారు. ముంబై- అంధేరి వెస్ట్లో రూ. 7.64 కోట్లకు ఆఫీస్ స్థలాన్ని కొనుగోలు చేయడం ద్వారా తన రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని విస్తరించిన కాజోల్ 2,095 చదరపు అడుగుల కార్పెట్ ఏరియాతో తొలుత ఆఫీస్ ని కొనుగోలు చేసారు. ఇది అంధేరిలోని సిగ్నేచర్ భవనం ఎనిమిదవ అంతస్తులో ఉంది. అదే సంవత్సరం ముంబైలోని జుహు ప్రాంతంలో రూ. 16.50 కోట్లకు ఒక రెసిడెన్షియల్ అపార్ట్మెంట్ను కూడా కొనుగోలు చేసిందని మనీకంట్రోల్ కథనం వెలువరించింది. ఈ అపార్ట్మెంట్ 2,493 చదరపు అడుగుల కార్పెట్ ఏరియా అందుబాటులో ఉంది. నాలుగు కార్ పార్కింగ్ స్థలాలు దీనికి ఉన్నాయి.
మరోవైపు కాజోల్ భర్త, స్టార్ హీరో అజయ్ దేవగన్ గత సంవత్సరం ముంబైలో 3,455 చదరపు అడుగుల కార్పొరెట్ కార్యాలయ స్థలాన్ని నెలకు రూ. 7 లక్షల అద్దెకు లీజుకు తీసుకున్నారని కథనాలొచ్చాయి. ఈ ఆస్తి కూడా అంధేరీలోని సిగ్నేచర్ భవనంలోనే ఉంది.
కెరీర్ మ్యాటర్ కి వస్తే.. కాజోల్ నటిగాను బిజీగా మారుతోంది. ఇకపై పాన్ ఇండియా మార్కెట్ లక్ష్యంగా కాజోల్ తన ప్రణాళికలను విస్తరిస్తోంది. తదుపరి `మా` అనే పౌరాణిక హారర్ చిత్రంలో కనిపించనుంది. ఈ చిత్రం జూన్ 2025లో హిందీ, బెంగాలీ, తమిళం, తెలుగు భాషలలో విడుదల కానుంది.