Begin typing your search above and press return to search.

హీరో ద‌ర్శ‌న్‌పై క‌ర్నాట‌క సినీ ప‌రిశ్ర‌మ‌ బ్యాన్?

ఇటీవలే త‌న అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో అరెస్టయిన కన్నడ నటుడు దర్శన్ ప్రస్తుతం 6 రోజుల పోలీసు కస్టడీలో ఉన్నారు.

By:  Tupaki Desk   |   15 Jun 2024 11:46 AM GMT
హీరో ద‌ర్శ‌న్‌పై క‌ర్నాట‌క సినీ ప‌రిశ్ర‌మ‌ బ్యాన్?
X

ఇటీవలే త‌న అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో అరెస్టయిన కన్నడ నటుడు దర్శన్ ప్రస్తుతం 6 రోజుల పోలీసు కస్టడీలో ఉన్నారు. అతడికి హత్య కేసుతో సంబంధం ఉందనే కోణంలో విచారిస్తున్నారు. జూన్ 11 న మైసూరు లోని ఓ ఇంట్లో బెంగళూరు పోలీసులు అత‌డిని అరెస్టు చేశారు.

అభిమాని హ‌త్యోదంతం, అరెస్ట్ తర్వాత దర్శన్ సినిమాలపై నిషేధం విధించాలనే డిమాండ్ వినిపించింది. తాజా క‌థ‌నాల‌ ప్రకారం.. దర్శన్ న‌టించిన చిత్రాలను నిషేధించడానికి కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (KFCC) నిరాకరించింది. ఫిలింఛాంబ‌ర్ న‌టీన‌టుల సంఘం ప్ర‌తినిథులు గురువారం సమావేశమై.. పోలీసులు తమ విచారణను ముగించే వరకు దర్శన్‌పై ఎలాంటి చర్యలు తీసుకోబోమని తేల్చిచెప్పారు.

KFCC ప్రెసిడెంట్ MN సురేష్ విలేకరులతో మాట్లాడుతూ, ``అతడిని సినిమా పరిశ్రమ నుండి నిషేధించాలని మేం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. అత‌డు 2011లో కూడా వివాదంలో చిక్కుకున్నప్పుడు అలాంటి నిర్ణయం తీసుకోలేదు. అతడి భార్య అతనిపై గృహ హింస కేసు పెట్టింది. విచారణ పూర్తయ్యే వరకు మేము వేచి ఉంటాము`` అని వ్యాఖ్యానించారు. అయితే బాధితుడు రేణుకాస్వామి కుటుంబాన్ని పరామర్శించేందుకు ప్రతినిధి బృందాన్ని పంపాలని నిర్ణయించుకున్నాం.

ఇటీవల రేణుకా స్వామి తల్లిదండ్రులు బెంగళూరులో మీడియాతో మాట్లాడుతూ.. తమ కుమారుడికి న్యాయం చేయాలని, చిత్ర పరిశ్రమలో దర్శన్‌పై నిషేధం విధించాలని డిమాండ్ చేశారు. స్వామి తండ్రి మాట్లాడుతూ- ``నా కొడుకు భార్య గర్భవతి. నేను రిటైర్ అయ్యాను. ఆమె తన జీవితాన్ని ఎలా నడిపించాలి?`` అని ప్ర‌శ్నించారు. రేణుకా స్వామి తల్లి రత్నప్రభ కూడా ద‌ర్శ‌న్ ని.. దొంగ నేరస్థుడు! అని ఆరోపించారు. భవిష్యత్తులో నా కొడుకులాగా ఎవ్వరినీ బాధపెట్టకుండా ఉండేందుకు భగవంతుడు దర్శన జ్ఞానాన్ని ప్రసాదించాలి! అని పార్థించారు.

పోలీసు అధికారుల వివ‌రాల ప్రకారం.. అభిమాని రేణుకా స్వామి... దర్శన్ దీర్ఘకాల భాగస్వామి, నటి పవిత్ర గౌడకు అసభ్యకరమైన సందేశాలు పంపాడ‌ని ఆరోపణలు వచ్చాయి. హిందూలో వచ్చిన కథనం ప్రకారం, రేణుకా స్వామిని దర్శన్ మైసూరులోని ఓ పొలానికి రావాల్సిందిగా పిలిచారు. అక్కడ అత‌డు స్వామిని చిత్రహింసలకు గురిచేసి చంపి, మృతదేహాన్ని కామాక్షిపాళ్యలోని కాలువలో పడవేసాడు. రేణుకా స్వామి హత్య కేసులో దర్శన్‌తో పాటు పవిత్ర మరో 11 మందిని కూడా అరెస్టు చేశారు.