Begin typing your search above and press return to search.

ఈసారి మూడు పాత్ర‌ల్లో క్వీన్ చించుడే

ఇప్పుడు కంగ‌న న‌టించిన బ్లాక్ బ‌స్ట‌ర్ ఫ్రాంఛైజీ త‌ను వెడ్స్ మ‌ను రీబూట్ అవుతోంది.

By:  Tupaki Desk   |   4 Oct 2024 10:30 PM GMT
ఈసారి మూడు పాత్ర‌ల్లో క్వీన్ చించుడే
X

కోరి ఎన్ని వివాదాల్లో త‌ల దూర్చినా క్వీన్ కంగ‌న‌కు న‌టిగా కెరీర్ ప‌రంగా ఎదురే లేదు. ఈ బ్యూటీ వ‌ర‌స ప‌రాజ‌యాల్లో ఉన్నా కానీ, త‌న సొంత సినిమా ఎమ‌ర్జెన్సీని రిలీజ్ చేయ‌లేక‌పోతున్నా కానీ, అవ‌కాశాలు వెంట‌ప‌డుతూనే ఉన్నాయి. ఇప్పుడు కంగ‌న న‌టించిన బ్లాక్ బ‌స్ట‌ర్ ఫ్రాంఛైజీ త‌ను వెడ్స్ మ‌ను రీబూట్ అవుతోంది. ఈ ఫ్రాంఛైజీలో మూడో భాగం తెర‌కెక్క‌నుంద‌ని స‌మాచారం. ఆస‌క్తిక‌రంగా ఇందులో కంగ‌న త్రిపాత్రాభిన‌యం చేయ‌నుంద‌ట‌. పూర్తి వివ‌రాల్లోకి వెళితే...


2011లో ఆనంద్ ఎల్ రాయ్, కంగనా రనౌత్ , ఆర్ మాధవన్ మొదటిసారి కలిసి 'తను వెడ్స్ మను' లాంటి క్లాసిక్ ని అందించారు. ఇది బాక్సాఫీస్ వద్ద స్లీపర్ హిట్‌గా నిలిచింది. నాలుగు సంవత్సరాల తరువాత ఈ ముగ్గురూ సీక్వెల్ కోసం తిరిగి కలిశారు. ఇది భారీ బ్లాక్‌బస్టర్‌గా మారడమే కాకుండా నాయికా ప్ర‌ధాన చిత్రాల్లోనే అత్యధిక వసూళ్లు చేసిన హిందీ చిత్రంగా రికార్డు సృష్టించింది. అప్పటి నుండి తను వెడ్స్ మను 3 గురించి ఊహాగానాలు కొనసాగుతున్నాయి. అయినా కానీ మేకర్స్ ఈ విషయంపై మౌనంగా ఉన్నారు. అయితే ఇప్పుడు ఆనంద్ ఎల్ రాయ్ .. అతడి రైటింగ్ పార్ట్‌నర్ హిమాన్షు శర్మ మూడవ భాగం ప్లాట్‌ను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. స‌న్నిహిత‌ వర్గాల సమాచారం ప్రకారం.. తను వెడ్స్ మను 3 గత చిత్రాల ముగింపు నుంచి మొద‌ల‌వుతుంద‌ని తెలిసింది. మొదటి రెండు చిత్రాల మాదిరిగానే మూడవ భాగంలో హాస్యం, శృంగారం, నాటకీయత కలగలిసి వాస్త‌విక‌త‌ను ప్ర‌తిబింబించేలా క‌థాంశం ఉంటుంది. ప్రాథమిక కాన్సెప్ట్ లాక్ అయింది. 2025 ద్వితీయార్థంలో షూటింగ్ ప్రారంభించడమే లక్ష్యం అని తెలుస్తోంది.

ఈసారి కంగనా రనౌత్ త్రిపాత్రాభినయం చేస్తుందని, ఆర్ మాధవన్ తన ఏకైక పాత్రను కొనసాగిస్తున్నాడని సోర్స్ వెల్లడించింది. కంగనా కెరీర్ లో మొదటిసారి త్రిపాత్రాభినయం చేయడానికి థ్రిల్లింగ్‌గా ఉంది. ఆనంద్ ఎల్ రాయ్ నుండి పూర్తి కథనం కోసం ఎదురుచూస్తోంది. ఇది కంగ‌న‌కు సవాల్ లాంటిది. నటిగా కొత్త కోణాలను అన్వేషించడానికి అనుమతిస్తుంది``అని అంతర్గత సోర్స్ వెల్ల‌డించింది. 'తను వెడ్స్ మను రిటర్న్స్‌'లో కంగనా ద్విపాత్రాభినయం చేసిన సంగతి తెలిసిందే. ధనుష్, కృతి సనన్‌లతో ఆనంద్ ఎల్.రాయ్ తన ప్రస్తుత ప్రాజెక్ట్ `తేరే ఇష్క్ మే`ని పూర్తి చేసిన తర్వాత చిత్రీకరణ జూలై లేదా ఆగస్టు 2025లో ప్రారంభమవుతుంది. ఈలోగా కంగనా ఎమర్జెన్సీ విడుదలకు సిద్ధమవుతోంది. తను వెడ్స్ మను 3 విడుద‌ల‌కు 2026 వ‌ర‌కూ ఛాన్స్ లేదు.

సీక్వెల్ ఆలోచ‌న లేదంటూనే...

మొదట్లో తను వెడ్స్ మనుకి సీక్వెల్ చేసే ఆలోచన లేదని దర్శకుడు ఆనంద్ ఎల్ రాయ్ ప్ర‌క‌టించినా కానీ, త‌ర్వాత రెండో భాగం తీసాడు. ఇప్పుడు మూడో భాగాన్ని ప్లాన్ చేస్తున్నాన‌ని చెప్పాడు. ఇందులో పాత్రలన్నీ మూడో భాగం కోసం అడుగుతున్నాయి. మనకు గొప్ప కథ దొరికిన నిమిషంలో ఈ ప్ర‌య‌త్నం చేస్తున్నామ‌ని చెబుతున్నారు.

తను వెడ్స్ మను 3 కథలో కొత్త‌ద‌నం ఏమిటో ఆనంద్ ఎల్ రాయ్ వివ‌రించాడు. నేను నిజంగా వెతుకుతున్నది ప్రత్యేకమైన స్త్రీ-పురుష సంబంధాన్ని... తను వెడ్స్ మనులోని డైనమిక్స్ రాంఝనా నుండి భిన్నంగా ఉన్నాయి. రాంఝనా అత్రంగి రే నుండి భిన్నంగా ఉంటుంది. అత్రంగి రే హసీన్ దిల్‌రూబా నుండి చాలా భిన్నంగా ఉంటుంది. దర్శకుడిగా, నిర్మాతగా ప్రతిసారీ కొత్త ప్రేమకథను అన్వేషించాల్సిన అవసరం ఉందనిపిస్తుంది. నేను ఒక నిర్దిష్టమైన చురుకుదనం ఉన్న ప్రేమ‌క‌థ కోసం వెతుకుతున్నాను. తను వెడ్స్ మనులో నేను మద్యపానం మరియు ధూమపానం చేసే అమ్మాయిని చూపించాను. దర్శకుడిగా నేను ఆమెను జడ్జ్ చేయలేదు. అందుకే నా ప్రేక్షకులు ఇలాంటి పాత్ర‌ను అంచనా వేయలేదు... అని తెలిపాడు.