Begin typing your search above and press return to search.

రాజ‌కీయ‌నాయ‌కులు పానీ పూరి అమ్ముకోవాలా? కంగ‌న ఫైర్!

మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే నమ్మకద్రోహానికి గురయ్యారని స్వామి అవిముక్తేశ్వరానంద సరస్వతి ఆవేద‌న‌గా వ్యాఖ్యానించిన సంగ‌తి తెలిసిందే.

By:  Tupaki Desk   |   19 July 2024 5:22 AM GMT
రాజ‌కీయ‌నాయ‌కులు పానీ పూరి అమ్ముకోవాలా? కంగ‌న ఫైర్!
X

మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే నమ్మకద్రోహానికి గురయ్యారని స్వామి అవిముక్తేశ్వరానంద సరస్వతి ఆవేద‌న‌గా వ్యాఖ్యానించిన సంగ‌తి తెలిసిందే. స‌హ‌చ‌రుడి ద్రోహం వల్ల మహారాష్ట్ర ప్రజలు తీవ్రంగా ప్రభావితమయ్యారని ఇటీవల ముగిసిన లోక్‌సభ ఎన్నికల్లో కూడా అదే కనిపిస్తోందని స్వామీజీ అన్నారు. ప‌రోక్షంగా స్వామి వారు ఏక్ నాథ్ షిండేని విమ‌ర్శించారు. దీనిపై బాలీవుడ్ నటి, లోక్‌సభ ఎంపీ కంగనా రనౌత్ త‌న‌దైన శైలిలో విరుచుకుప‌డ్డారు. శివసేనకు చెందిన ఏక్నాథ్ షిండేను సమర్థిస్తూ కంగ‌న స్వామివారికి వివ‌ర‌ణ ఇచ్చారు.

అయితే షిండేకు మ‌ద్ధ‌తుగా నిలిచిన కంగ‌న స్వామీజీపై త‌న‌దైన శైలిలో విరుచుకుప‌డ్డారు. ``రాజకీయ నాయకుడు రాజకీయాలు చేయకపోతే పానీ పూరీలు (గుల్ల కాయ‌లు) అమ్ముతారా? అంటూ కంగ‌న ప్ర‌శ్నించారు. రాజకీయాలలో పొత్తులు, ఒప్పందాలు, పార్టీ విభజన వంటివి చాలా సాధారణమని, రాజ్యాంగబద్ధమని ఆమె అన్నారు. జ్యోతిర్మఠానికి చెందిన శంకరాచార్యులు (అవిముక్తేశ్వ‌ర స్వామి) చేసిన ప్రకటనపై కంగ‌న ఫైర్ అయ్యారు.

స్వామి వారు అస‌లేమ‌న్నారంటే..? ``మనమంతా సనాతన ధర్మాన్ని అనుసరించేవాళ్లం. మనకు పాప‌- పుణ్య విచ‌క్ష‌ణలు ఉన్నాయి. విశ్వాసఘాట్ (ద్రోహం) అతిపెద్ద పాపాలలో ఒకటి. ఉద్ధవ్ ఠాక్రేకు కూడా అదే జరిగింది`` అని శంక‌రాచార్య స్వామి అన్నారు. స్వామి అవిముక్తేశ్వరానంద సరస్వతి ఆదివారం శివసేన (యుబిటి) నాయకుడు ఉద్ధవ్ ఠాక్రేను ముంబైలోని ఆయన నివాసంలో కలిశారు. సమావేశం అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, శివసేన సీనియర్ నాయకుడు ఏక్‌నాథ్ షిండే పార్టీని నిలువునా చీల్చడంతో మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయవలసి వచ్చిన థాకరేకి తన సంఘీభావం తెలిపారు.

షిండేకు మద్దతుగా హిమాచల్ ప్రదేశ్‌లోని మండి ఎంపీ X (గతంలో ట్విట్టర్)లో ఇలా రాసారు. ``రాజకీయాల్లో పొత్తులు, ఒప్పందాలు, పార్టీ విభజన చాలా సాధారణం.. రాజ్యాంగబద్ధం. కాంగ్రెస్ పార్టీ 1907లో చీలిపోయింది. మళ్లీ 1971లోను ఈ ప‌రిస్థితి వచ్చింది. చాలా సార్లు చీలిన పార్టీ అది అని కంగ‌న విమ‌ర్శించారు. రాజకీయ నాయకుడు రాజకీయాల్లో రాజకీయం చేయకపోతే పానీ పూరీలు అమ్ముతారా? అని ప్ర‌శ్నించింది.

శంకరాచార్య జీ తన మాటలను, మ‌తపరమైన విద్యను దుర్వినియోగం చేశారని కంగ‌న విమ‌ర్శించారు. ``రాజు స్వయంగా తన ప్రజలను దోపిడీ చేయడం ప్రారంభిస్తే, రాజద్రోహమే అంతిమ మతం అని కూడా మతం చెబుతుంది. శంకరాచార్య జీ మన గౌరవనీయులైన మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేపై ద్రోహి, ద్రోహి అని నిందించడం ద్వారా ప్ర‌జ‌లందరి మనోభావాలను కించపరిచారు. శంకరాచార్య జీ ఇలాంటి చిల్లర మాటలు మాట్లాడి హిందూ మతం గౌరవాన్ని కించపరుస్తున్నారు`` అని కంగన అన్నారు.

శివసేన (UBT), కాంగ్రెస్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలతో కూడిన ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని MVA ప్రభుత్వం కూలిపోవ‌డానికి కార‌ణం షిండే తిరుగుబాటు. భారతీయ జనతా పార్టీ మద్దతుతో ముఖ్యమంత్రి అభ్య‌ర్థిగా కొనసాగిన ఏక్నాథ్ షిండే తిరుగుబాటు తర్వాత థాక్రే ప్ర‌భుత్వం జూన్ 2022లో పడిపోయింది.