Begin typing your search above and press return to search.

బిగ్ న్యూస్: 'బాహుబలి 3' పై నిర్మాత క్లారిటీ!

అలాంటి చిత్రానికి కొనసాగింపుగా పార్ట్-3 ప్లాన్ చేస్తున్నట్లుగా కోలీవుడ్‌ నిర్మాత కేఈ జ్ఞానవేల్ క్లారిటీ ఇచ్చారు.

By:  Tupaki Desk   |   17 Oct 2024 6:37 AM GMT
బిగ్ న్యూస్: బాహుబలి 3 పై నిర్మాత క్లారిటీ!
X

భారతీయ చిత్ర పరిశ్రమ ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తంగా చెప్పిన చిత్రం "బాహుబలి". దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి సృష్టించిన వెండితెర అద్భుతం ఇది. 'బాహుబలి: ది బిగినింగ్' & 'బాహుబలి: కన్ క్లూజన్' పేర్లతో రెండు భాగాలుగా వచ్చి, బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాలు సాధించాయి. తెలుగు సినిమా దశ దిశను మార్చేసాయి. అలాంటి చిత్రానికి కొనసాగింపుగా పార్ట్-3 ప్లాన్ చేస్తున్నట్లుగా కోలీవుడ్‌ నిర్మాత కేఈ జ్ఞానవేల్ క్లారిటీ ఇచ్చారు.

'బాహుబలి' రెండు భాగాలను తమిళంలో స్టూడియో గ్రీన్ బ్యానర్ మీద కేఈ జ్ఞానవేల్ రాజా రిలీజ్ చేశారు.ప్రస్తుతం ఆయన భారీ బడ్జెట్ తో 'కంగువ' చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. అయితే ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో కంగువ పార్ట్-2 కోసం గ్యాప్ తీసుకోవడం గురించి నిర్మాత మాట్లాడారు. సీక్వెల్స్ తీయడానికి గ్యాప్ తీసుకోవడం రెగ్యులర్ ఫార్ములానే అని చెబుతూ.. 'బాహుబలి' ప్రస్తావన తీసుకొచ్చారు. 'బాహుబలి 3' గురించి కీలక సమాచారం అందించారు.

"లాస్ట్ వీక్ 'బాహుబలి' మేకర్స్‌తో మాట్లాడాను. వాళ్ళు 'బాహుబలి 3' ప్లాన్ చేసే పనిలో ఉన్నారు. బాహుబలి 1&2 బ్యాక్ టూ బ్యాక్ వచ్చాయి. గ్యాప్ తీసుకొని పార్ట్-3 ప్లాన్ చేస్తున్నారు. 'కల్కి 1' చిత్రాన్ని తీసుకునే, మధ్యలో రెండు సినిమాలు చేసిన తర్వాత 'కల్కి 2' చేయబోతున్నారు. సేమ్ 'సలార్ 2' కూడా అంతే. గ్యాప్ అనేది రెగ్యులర్ ఫార్ములానే. ఒక్కసారి క్యారక్టర్ కు కనెక్ట్ అయితే గ్యాప్ తీసుకొని దాని మీద సినిమాలు వర్కవుట్ చెయ్యొచ్చు. సింగం 1,2,3లలో సినిమా సినిమాకు మధ్యలో మూడు నాలుగు వేరే చిత్రాలు వచ్చాయి" అని జ్ఞానవేల్ రాజా తెలిపారు. ఈ కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.

బాహుబలి రెండు భాగాలు బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచిన తర్వాత, 'బాహుబలి 3' సినిమా కూడా చెయ్యాలని అభిమానులు కోరుకున్నారు. ఇదే విషయం మీద గతంలో RRR మూవీ ప్రమోషన్స్ లో రాజమౌళి స్పందించారు. "తప్పకుండా పార్ట్-3 ఎక్స్పెక్ట్ చెయ్యొచ్చు. బాహుబలి చుట్టూ జరిగే ఇతర ఎన్నో సంఘటనలను ఈసారి మీకు చూపించనున్నాం. దీనిపై వర్క్ చేస్తున్నాం. మా నిర్మాత శోభు యార్లగడ్డ కూడా దీనికి సుముఖంగా ఉన్నారు. ఇప్పుడే రాకపోవచ్చు కానీ.. భవిష్యత్తులో బాహుబలి రాజ్యం నుంచి ఆసక్తికరమైన వార్త మాత్రం తప్పక వస్తుంది" అని రాజమౌళి తెలిపారు. ఇప్పుడు జ్ఞానవేల్ రాజా సైతం 'బాహుబలి 3' పై స్పష్టత ఇవ్వడంతో ఫ్యాన్స్ ఎంతో ఎగ్జైట్ అవుతున్నారు. ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని పోస్టులు పెడుతున్నారు. దీంతో ఇది సోషల్ మీడియాలో ట్రెండింగ్ టాపిక్ గా మారింది.

రాజమౌళి ప్రస్తుతం సూపర్ స్టార్ మహేశ్‌ బాబుతో సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు. #SSMB29 అని పిలవబడుతున్న ఈ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే స్క్రిప్టు వర్క్ కూడా పూర్తయిపోయిందని సమాచారం. అమెజాాన్ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని 2025 జనవరిలో సెట్స్ మీదకి తీసుకెళ్లనున్నారు. దీని తర్వాత జక్కన్న 'బాహుబలి 3' పనులు మొదలుపెట్టే అవకాశం ఉంది.

ఇకపోతే 'బాహుబలి' ఫ్రాంచైజీలో రెబల్ స్టార్ ప్రభాస్, అనుష్క శెట్టి, రానా దగ్గుబాటి, తమన్నా భాటియా, రమ్యకృష్ణ, సత్యరాజ్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. వీరందరికీ ఈ సినిమాలు మంచి గుర్తింపు తెచ్చి పెట్టాయి. ముఖ్యంగా ప్రభాస్ ను పాన్ ఇండియా స్టార్ గా మార్చేశాయి. 'బాహుబలి 1' సినిమా బాక్సాఫీసు దగ్గర రూ.600 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టగా.. 'బాహుబలి 2' చిత్రం రూ.1800 కోట్లకు పైగా కలెక్షన్స్ తో సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది.