తల్లి కాబోతున్న కియారా
బాలీవుడ్ స్టార్ కపుల్ కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలోనే తాము ఓ బిడ్డకు జన్మనివ్వబోతున్నట్టు సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు.
By: Tupaki Desk | 28 Feb 2025 4:51 PM ISTబాలీవుడ్ స్టార్ కపుల్ కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలోనే తాము ఓ బిడ్డకు జన్మనివ్వబోతున్నట్టు సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. తమ జీవితానికి సంబంధించిన గొప్ప గిఫ్ట్ త్వరలోనే రానుందంటూ బేబీ ఎమోజీని జోడిస్తూ ఇద్దరి చేతుల్లో బేబీ సాక్స్ను పట్టుకుని ఓ ఫోటోను పోస్ట్ చేస్తూ విషయాన్ని వెల్లడించారు.
కియారా, సిద్ధార్థ మల్హోత్రా 2023లో ఫిబ్రవరి 7న రాజస్థాన్ లో పెళ్లి చేసుకున్నారు. షేర్షా మూవీ నుంచి వీరిద్దరికీ పరిచయం ఏర్పడి అది ముందు స్నేహంగా మారి, ఆ తర్వాత ప్రేమకు దారి తీసింది. తర్వాత ఇరు కుటుంబ సభ్యులను ఒప్పించి పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకుని ఇద్దరూ ఒక్కటయ్యారు. రీసెంట్ గా సెకండ్ వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకున్న ఈ జంట ఇప్పుడు తల్లిదండ్రులు కానున్నట్టు అనౌన్స్ చేశారు.
విషయం తెలుసుకున్న సెల్రబిటీలు, ఫ్యాన్స్ కియారా, సిద్ధార్థ్ జంటకు శుభాకాంక్షలు తెలుపుతూ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఇప్పుడు ఈ వార్త నెట్టింట వైరల్ అవుతుంది. రీసెంట్ గా గేమ్ ఛేంజర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కియారా చేతిలో ప్రస్తుతం పలు సినిమాలున్నాయి. ప్రస్తుతం యశ్ హీరోగా వస్తున్న టాక్సిక్ మూవీతో పాటూ వార్2లో కూడా నటిస్తోంది కియారా.
ఇదిలా ఉంటే గత నెలలో కియారా ఆరోగ్యం గురించి కొన్ని వార్తలు వినిపించాయి. కియారా అనారోగ్యంతో బాధపడుతుందని, ఆరోగ్యం బాలేనందున హాస్పిటల్ లో కూడా చేరిందని సోషల్ మీడియాలో పుకార్లు వచ్చాయి. ఇప్పుడు ఈ గుడ్ న్యూస్ చెప్పడంతో ఆమె అనారోగ్యం గురించి వచ్చిన వార్తలకు చెక్ పడినట్లైంది. కియారా తల్లి కాబోతుందని తెలుసుకున్న ఆమె ఫ్యాన్స్ ఎంతో ఆనందిస్తున్నారు.