'గేమ్ ఛేంజర్' హీరోయిన్ రెండేళ్లు కనిపించదట!
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కిరాయా అద్వానీ రెండేళ్ల క్రితం హీరో సిద్దార్థ్ మల్హోత్రాను వివాహం చేసుకుంది.
By: Tupaki Desk | 9 March 2025 12:00 AM ISTబాలీవుడ్ స్టార్ హీరోయిన్ కిరాయా అద్వానీ రెండేళ్ల క్రితం హీరో సిద్దార్థ్ మల్హోత్రాను వివాహం చేసుకుంది. హీరోయిన్గా ఫుల్ జోష్ మీద ఉన్న సమయంలోనే సిద్దార్థ్ను కియారా పెళ్లి చేసుకున్న విషయం తెల్సిందే. పెళ్లి తర్వాత కూడా వరుసగా సినిమాలు చేసినా కియారా అద్వానీ రెండేళ్ల బ్రేక్ తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవల కియారా అద్వానీ తాను తల్లి కాబోతున్నట్లు అధికారికంగా ప్రకటన చేసింది. అందుకు సంబంధించి ఒక ఫోటోను షేర్ చేసింది. భర్త సిద్దార్థ్ మల్హోత్రాతో కలిసి ఇన్ స్టాగ్రామ్లో షేర్ చేసిన పోస్ట్తో తల్లి కాబోతున్నట్లు దృవీకరించిన కియారా అద్వానీ సినిమాల నుంచి షార్ట్ బ్రేక్ తీసుకోబోతున్నట్లు అధికారికంగా ప్రకటన చేసింది.
ఇప్పటికే మొదలైన సినిమాలను ముగించాలని కియారా అద్వానీ భావిస్తుంది. ఆరంభ దశలో ఉన్న సినిమాల నుంచి తప్పుకునే విధంగా చర్చలు జరుపుతోంది. ముఖ్యంగా డాన్ 3 సినిమా నుంచి కియారా అద్వానీ దాదాపుగా తప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. బాలీవుడ్లో ఇప్పటికే రెండు సినిమాలకు కియారా అద్వానీ ఓకే చెప్పింది. కానీ అందులో ఒక్కటి కూడా షూటింగ్ ప్రారంభం కాలేదు. అందుకే ఆ సినిమాల నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. గేమ్ ఛేంజర్ సినిమాతో ఇటీవలే తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన కియారా అద్వానీ బాలీవుడ్లో త్వరలో వార్ 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే.
వార్ 2 సినిమా షూటింగ్ ఇంకాస్త బ్యాలన్స్ ఉందని, వచ్చే నెలలో ఆ షూటింగ్ను పూర్తి చేసే విధంగా దర్శక నిర్మాతలకు కియారా అద్వానీ విజ్ఞప్తి చేసిందనే వార్తలు వస్తున్నాయి. కియారా అద్వానీపై చిత్రీకరించాలి అనుకున్న సినిమాలను ముగించే విధంగా ప్లాన్ చేస్తున్నారట. అంతే కాకుండా మరో రెండు సౌత్ ప్రాజెక్ట్ల నుంచి ఈ అమ్మడు తప్పుకుందనే వార్తలు వస్తున్నాయి. ఆ విషయమై క్లారిటీ రావాల్సి ఉంది. బాలీవుడ్లో హీరోయిన్స్ తల్లి అయిన ఏడాదిలోపే సినిమాల షూటింగ్స్లో పాల్గొనడం మనం చూస్తూ ఉంటాం. కానీ కియారా అద్వానీ మాత్రం కనీసం రెండేళ్ల బ్రేక్ తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం అందుతోంది.
తెలుగులో కియారా అద్వానీ భరత్ అనే నేను, వినయ విధేయ రామ సినిమాల్లో నటించింది. ఇటీవల ఈమె రామ్ చరణ్, శంకర్ కాంబోలో వచ్చిన గేమ్ ఛేంజర్లోనూ నటించిన విషయం తెల్సిందే. గేమ్ ఛేంజర్ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్న కియారా అద్వానీకి నిరాశే మిగిలింది. ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుని ఉంటే కచ్చితంగా టాలీవుడ్లో మరికొన్ని సినిమాల్లో నటించే అవకాశాలు దక్కేవి అనేది ఇండస్ట్రీ వర్గాల టాక్. ప్రస్తుతం ఈ అమ్మడు పూర్తిగా సౌత్ సినిమాలపైనే ఫోకస్ పెట్టింది. అయితే తల్లి కాబోతున్న నేపథ్యంలో రెండేళ్ల పాటు బ్రేక్ తీసుకునే అవకాశాలు ఉన్నాయి. అందుకే కియారా అద్వానీ ఇప్పటికే కమిట్ అయిన సినిమాల నుంచి సైతం తప్పుకుందనే వార్తలు వస్తున్నాయి. ఈ ఏడాదిలో ఆమె నటించే సినిమాలు వచ్చే అవకాశం ఉంది. కానీ 2026లో కియారా అద్వానీ సినిమాలు రాకపోవచ్చు. మళ్లీ 2027 వరకు కియారా అద్వానీ సినిమా వచ్చే అవకాశాలు లేవు.