Begin typing your search above and press return to search.

మైత్రి వారి 'కిస్‌ కిస్ కిస్సిక్‌'

అల్లు అర్జున్‌ హీరోగా రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించిన 'పుష్ప 2' సినిమా గత ఏడాది డిసెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.

By:  Tupaki Desk   |   8 March 2025 3:00 PM IST
మైత్రి వారి కిస్‌ కిస్ కిస్సిక్‌
X

అల్లు అర్జున్‌ హీరోగా రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించిన 'పుష్ప 2' సినిమా గత ఏడాది డిసెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. దాదాపు రూ.2000 కోట్ల వసూళ్లు రాబట్టిన పుష్ప 2 సినిమాలోని కిస్‌ కిస్‌ కిస్సిక్‌ సాంగ్ ఏ స్థాయిలో హిట్‌ అయిందో అందరికీ తెల్సిందే. దేశ వ్యాప్తంగా పాట ఇంకా కూడా ట్రెండ్‌ అవుతూనే ఉంది. దేవి శ్రీ ప్రసాద్‌ సంగీతాన్ని అందించిన ఆ పాటకు మంచి స్పందన వచ్చింది. అంతే కాకుండా అల్లు అర్జున్‌, శ్రీలీల వేసిన డాన్స్‌ ఓ రేంజ్‌లో ఆకట్టుకుంది. కిస్సిక్ సాంగ్‌కి అంతర్జాతీయ స్థాయిలోనూ ఓ రేంజ్ రెస్పాన్స్ దక్కింది.

ఇప్పుడు కిస్సిక్‌ సంగతి ఎందుకా అనుకుంటున్నారా... అసలు విషయం ఏంటంటే ఏదైనా పాట సూపర్‌ హిట్ అయినా, అందులోని పదాలు సూపర్‌ హిట్ అయినా ఆ లిరిక్స్‌ను సినిమా టైటిల్స్‌గా వినియోగించడం మనం చూస్తూనే ఉన్నాం. కిస్ కిస్ కిస్సిక్ అనే టైటిల్‌తో తెలుగు ప్రేక్షకుల ముందుకు ఒక సినిమా రాబోతుంది. బాలీవుడ్‌లో రూపొందిన 'పింటు కి పప్పీ' సినిమా ను తెలుగులో డబ్‌ చేయబోతున్నారు. గణేష్ ఆచార్య ఈ సినిమాకు ఒక నిర్మాతగా వ్యవహరించడం విశేషం. ఆయనతో మైత్రి మూవీ మేకర్స్‌కి ఉన్న సన్నిహిత్యం కారణంగానే తెలుగులో మైత్రి వారు ఈ సినిమాను విడుదల చేసేందుకు సిద్ధం అయ్యారు.

హిందీలో యూత్‌ ఫుల్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన పింటు కి పప్పీ సినిమాను తెలుగులో భారీ ఎత్తున విడుదల చేసే విధంగా మైత్రి మూవీ మేకర్స్‌ ఏర్పాట్లు చేశారు. తెలుగు రాష్ట్రాల్లో మైత్రి పంపిణీ నెట్‌వర్క్‌ బాగానే ఉంది. కనుక ఎక్కువ థియేటర్‌లలో సినిమాను విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. వీ2ఎస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, గణేష్‌ ఆచార్య మీడియా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లు సంయుక్తంగా నిర్మించిన పింటు కి పప్పీ సినిమా ట్రైలర్‌కి మంచి స్పందన వచ్చింది. యూత్‌ ఫుల్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను రూపొందించారు. శివ్‌ హరే ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు.

హీరో ఎవరికి అయినా ముద్దు పెడితే వారికి వెంటనే పెళ్లి అవుతుంది. ఆ పాయింట్‌ చుట్టూ కథను తిప్పుతూ దర్శకుడు శివ్‌ హరే వినోదాత్మకంగా సినిమాను రూపొందించారు. సినిమాలోని సీరియస్ ఎలిమెంట్స్‌ సైతం ఆకట్టుకునే విధంగా ఉంటాయని మేకర్స్ అంటున్నారు. ఈమధ్య కాలంలో పెద్ద నిర్మాణ సంస్థలు విడుదల చేస్తున్న డబ్బింగ్‌ సినిమాలకు మంచి స్పందన దక్కుతుంది. అందుకే ఈ సినిమాకు తెలుగు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన దక్కనుంది. మార్చి 21న ఈ సినిమాను తెలుగులో అత్యధిక స్క్రీన్స్‌లో విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.