Begin typing your search above and press return to search.

చిరు మూవీ... బేబమ్మ క్లారిటీ ఇచ్చింది!

మెగా హీరో వైష్ణవ్‌ తేజ్ తో ఉప్పెన సినిమాలో నటించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ కృతి శెట్టి.

By:  Tupaki Desk   |   24 Aug 2024 6:40 AM GMT
చిరు మూవీ... బేబమ్మ క్లారిటీ ఇచ్చింది!
X

మెగా హీరో వైష్ణవ్‌ తేజ్ తో ఉప్పెన సినిమాలో నటించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ కృతి శెట్టి. ఆ సినిమాలో కృతి పోషించిన బేబమ్మ పాత్రకు మంచి స్పందన వచ్చింది. అందంతో పాటు అభినయం తో మెప్పించింది అంటూ విమర్శకులు ప్రశంసలు కురిపించారు. ఆ సినిమా తర్వాత టాలీవుడ్‌ లో కృతి శెట్టి వరుసగా సినిమాలు చేసింది. అందులో ఎక్కువ శాతం సినిమాలు నిరాశపరచడంతో టాలీవుడ్ లో ఆఫర్లు తగ్గాయి. దాంతో తమిళ, మలయాళ సినిమాల్లో ఈ అమ్మడు నటిస్తోంది.

తాజాగా మలయాళ మూవీ 'అజయంతే రందం మోషణం' లో టొవినో థామస్ తో కలిసి నటించింది. వచ్చే నెల 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఆ సినిమా ప్రమోషన్‌ లో భాగంగా కృతి శెట్టి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తెలుగు సినిమా ఇండస్ట్రీకి మరియు మలయాళ సినిమా ఇండస్ట్రీకి మధ్య ఉన్న తేడాను చెప్పుకొచ్చింది. అలాగే చిరంజీవి సినిమాలో వచ్చిన ఆఫర్‌ ను తిరస్కరించినట్లుగా వస్తున్న వార్తలపై కూడా ఆ ఇంటర్వ్యూలో కృతి శెట్టి స్పందించింది.

కృతి శెట్టి మాట్లాడుతూ... అజయంతే రందం మోషణం సినిమాలో మూడు ఇంటర్ కనెక్టడ్‌ టైమ్ ల కథను చూపించడం జరిగింది. సినిమా కోసం పని చేసిన ప్రతి ఒక్కరు చాలా కష్టపడ్డారు. విజువల్స్ చాలా అద్భుతంగా ఉంటాయి. ఇండస్ట్రీకి వచ్చిన తక్కువ సమయంలోనే ఇలాంటి ఒక గొప్ప మూవీలో, పెద్ద సినిమాలో నటించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను. ఒక పల్లెటూరి అమ్మాయిగా నేను ఈ సినిమా ద్వారా కనిపించబోతున్నాను. మలయాళం నేర్చుకోవడం కోసం చాలా కష్టపడ్డాను. టొవినో థామస్‌ నాకు భాష నేర్చుకోవడంలో చాలా సహాయం చేశాడు.

టాలీవుడ్‌, కోలీవుడ్‌ లో పోల్చితే మలయాళ సినిమాలకు కాస్త ఎక్కువ సమయం వర్క్‌ చేయాల్సి ఉంటుంది. ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయిన కొత్తలో చాలా ఇబ్బంది పడ్డాను. కొన్ని సార్లు నిద్ర లేకుండా షూటింగ్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఎంత నిద్ర లేకుండా షూటింగ్‌ చేసినా కూడా యూనిట్‌ సభ్యులు అంతా కూడా చాలా యాక్టివ్‌ గా ఉండేవారు. వారితో అలవాటు పడేందుకు నేను చాలా రోజులు కష్టపడాల్సి వచ్చిందని కృతి శెట్టి చెప్పుకొచ్చింది.

ఆ మధ్య చిరంజీవి నటిస్తున్న ఒక సినిమాలో కృతి శెట్టికి అవకాశం వచ్చిందని, కానీ ఆమె ఆ ఆఫర్‌ ను తిరస్కరించిందనే వార్తలు వచ్చాయి. వాటి పై తాజా ఇంటర్వ్యూలో కృతి శెట్టి స్పందించింది. చిరంజీవి గారితో సినిమా ఆఫర్ వచ్చిందని, నేను తిరస్కరించాను అంటూ వచ్చిన వార్తలు పూర్తిగా అవాస్తవం. అసలు చిరు గారి సినిమా కోసం నన్ను ఏ ఒక్కరు సంప్రదించలేదు. అలాంటి ఆఫర్‌ వస్తే తప్పకుండా చేసేందుకు సిద్దంగా ఉంటాను. మంచి సినిమాలు చేయాలని ఎప్పుడూ కోరుకుంటూ ఉంటానని పేర్కొంది.