700 కోట్ల బడ్జెట్ మూవీ: దర్శక నిర్మాత ఎందుకు వైదొలిగాడు?
అయితే అతడు నటించాల్సిన క్రిష్ 4 అంతకంతకు ఆలస్యమవుతుండడంపై అభిమానుల్లో తీవ్ర నిరాశ నెలకొంది.
By: Tupaki Desk | 18 March 2025 11:34 AM ISTసూపర్స్టార్ హృతిక్ రోషన్ ప్రస్తుతం `వార్ 2`లో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే అతడు నటించాల్సిన క్రిష్ 4 అంతకంతకు ఆలస్యమవుతుండడంపై అభిమానుల్లో తీవ్ర నిరాశ నెలకొంది. ఈ సినిమాని బడ్జెట్ కారణాలతో సెట్స్ పైకి తీసుకెళ్లలేకపోయానని నిర్మాత రాకేష్ రోషన్ పేర్కొన్నారు. ఇప్పుడు సాధారణ బడ్జెట్లతో సినిమాలు ఎవరూ చూడరని, హాలీవుడ్ తో పోటీపడాల్సి ఉందని కూడా అన్నారు. క్రిష్ 3 ని అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందించిన రాకేష్ రోషన్ క్రిష్ 4 ఆలస్యంపై తన నిరాశను పదే పదే వ్యక్తం చేసారు. కారణం ఏదైనా బ్లాక్ బస్టర్ ఫ్రాంఛైజీలో నాలుగో సినిమా అంతకంతకు ఆలస్యమవుతోంది.
తాజా మీడియా కథనాల ప్రకారం.. దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ అతడి బ్యానర్ మార్ఫ్లిక్స్ ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకోవడం చర్చనీయాంశంగా మారింది. బాలీవుడ్ హంగామా కథనం ప్రకారం.. క్రిష్ 4 బడ్జెట్ ఇప్పటికే రూ. 700 కోట్లకు పెరిగింది. దీనితో ఏ నిర్మాణ సంస్థ రాకేష్ రోషన్ బృందంతో కొనసాగలేదు! అందుకే సిద్ధార్థ్ ఆనంద్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారని సదరు కథనం పేర్కొంది. 'క్రిష్ 4' ఇప్పటికే చాలాసార్లు ఆలస్యం కాగా, బడ్జెట్ విషయంలో రాకేష్ రోషన్ రాజీకి వచ్చేందుకు నిరాకరిస్తున్నారు. అయితే తాజా పరిణామంలో సిద్ధార్థ్ ఆనంద్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడంతో అది మరింత కష్టమవుతోంది. అలాగే దర్శకుడు రాకేష్ రోషన్ సూపర్ హీరో చిత్రానికి దర్శకత్వం వహించరని, ఆ బాధ్యతను వేరొకరికి అప్పగించాలని నిర్ణయించుకున్నారని కూడా కథనాలొస్తున్నాయి.
క్రిష్ 4 ఇప్పుడు కొత్త బ్యానర్లో తెరకెక్కుతుంది. రూ. 700 కోట్ల బడ్జెట్ ని సమకూర్చడం అంటే నిర్మాణ సంస్థలకు అది అంత సులువేమీ కాదు. `మహాభారతం` కోసం అమీర్ ఖాన్ కోట్ చేసినంత బడ్జెట్ దీనికి పెట్టాల్సి ఉంటుంది.
హృతిక్ రోషన్ తన సన్నిహితుడు సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వ బాధ్యతలు చేపట్టాలని కోరుకున్నాడు కానీ బడ్జెట్ ఈ నిర్ణయానికి అడ్డంకిగా మారింది. అయితే ఇండియా టుడే కథనం ప్రకారం.... బడ్జెట్ విషయంలో వస్తున్న వార్తలు అవాస్తవ. కానీ క్రిష్ 4 ఇప్పుడు ఫిల్మ్క్రాఫ్ట్ ద్వారా కొత్త స్టూడియోలో తెరకెక్కుతుంది. సిద్ధార్థ్ ఆనంద్ కి చెందిన మార్ఫ్లిక్స్ క్రిష్ 4 కాకుండా ఇతర ప్రాజెక్టులపై దృష్టి సారిస్తుందని సదరు కథనం పేర్కొంది. క్రిష్ ఫ్రాంఛైజీకి తెలుగు రాష్ట్రాల్లోను భారీ ఫాలోయింగ్ ఉంది. ఈ ఫ్రాంఛైజీ నుంచి కొత్త సినిమా ఆలస్యమవ్వడంతో ఇక్కడా ఫ్యాన్స్ నిరాశ గా ఉన్నారు.