రిలీజ్ అవ్వాలంటే బకాయిలు చెల్లించాల్సిందేనా!
కోలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ కి కొంత కాలంగా దెబ్బ మీద దెబ్బ పడుతోన్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 14 March 2025 11:21 AM ISTకోలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ కి కొంత కాలంగా దెబ్బ మీద దెబ్బ పడుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వరుస పరజాయాలతో సదరు సంస్థ తీవ్ర ఆర్ధిక సంక్షోభాన్ని ఎదుర్కుంటుంది. ఆ సంస్థకు 'పొన్నియన్ సెల్వన్ 2' తర్వాత ఒక్క విజయం కూడా లేదు. 'చంద్రముఖి-2', 'మిషన్ చాప్టర్ 1', 'లాల్ సలామ్','ఇండియన్ -2','వెట్టేయాన్' చిత్రాలన్నీ కూడా ఆశించిన ఫలితాలు సాధించలేదు. వీటిలో కొన్ని చిత్రాలు డిజాస్టర్లను నమోదు చేసాయి. రూపాయి లాభం మాట పక్కనబెట్టు కనీసం పెట్టుబడి కూడా తేలేక పోయాయి.
అన్నీ భారీ కాన్వాస్ పై తెరకెక్కిన చిత్రాలే. రాజీ లేని నిర్మాణం తో రూపొందినవే. ఇటీవల రిలీజ్ అయిన 'విదాముయార్చీ'కూడా అదే పరంపర కొనసాగించింది. అజిత్ ఇమేజ్ తో భారీ ఓపెనింగ్స్ రాబట్టినప్పటీకీ లాంగ్ రన్ లో సినిమా నిలబడలేకపోయింది. ఈ సినిమా బడ్జెట్ 200 కోట్లపైనే వినిపించింది. వసూళ్లు చూస్తే కనీసం అందులో సగం కూడా రాబట్టలేకపోయింది. 75 నుంచి 90 కోట్ల మధ్యలోనే రికవరీ చేసింది.
దీంతో ఇప్పుడు ఆశలన్నీ 'ఎంపురాన్ : లూసీఫర్ 2' పైనే పెట్టుకుంది. భారీ అంచనాల మద్య రిలీజ్ అవుతున్న చిత్రమిది.
'లూసిఫర్' తొలి భాగం మంచి విజయం సాధించిన నేపథ్యంలో రెండవ భాగం బ్లాక్ బస్టర్ ఖాయమనే ప్రచారం ఊపందుకుంది. అయితే ఈసినిమా రిలీజ్ అవ్వాలంటే పాత బకాయిలు తీర్చాల్సిన పరిస్థితి ఏర్పడిందని వినిపిస్తుంది. ఇప్పటికే ప్రొడక్షన్ హౌస్ భారీ ఆర్థిక ఒత్తిడిలో ఉంది. ప్రొడక్షన్ హౌస్ ద్వారా క్లియర్ చేయాల్సిన అప్పులున్నట్లు సమాచారం. దీంతో మార్చి 27న పాన్ ఇండియాలో రిలీజ్ అవ్వాల్సిన 'లూసీఫర్ -2' రిలీజ్ అవుతుందా? లేదా? అన్నది గందరగోళంగా మారింది.
ఎంపురాన్ విడుదలకు ముందు పాత బకాయిలను క్లియర్ చేయాలని ఫైనాన్షియర్లు , ఇతరులు లైకాపై ఒత్తిడి చేస్తున్నారట. మరోవైపు ఆశీర్వాద్ సినిమాస్- సహ నిర్మాతలు ఈ చిత్రాన్ని సొంతంగా విడుదల చేయాలనే యోచనలో ఉన్నారట. ఆర్థిక గందరగోళం కారణంగా ప్రాజెక్ట్ నుంచి లైకా తప్పుకోవాలని లైకా పై ఒత్తిడి తీసుకొస్తున్నట్లు సమాచారం. మరి ఈ పరిస్థితులను అన్నింటిని దాటుకుని లైకా ఓన్ బ్రాండ్ తో రిలీజ్ అవ్వాలంటే ఉన్న పళంగా బకాయిలు క్లియర్ చేయాల్సిందే ప్రచారం జరుగుతోంది.