సీతమ్మ ఎఫెక్ట్... అతడికి ఫుల్ డిమాండ్
అయితే పాత సినిమాల రీ రిలీజ్లు కేవలం ఫ్యాన్స్ కి మాత్రమే అని మొదట్లో అనుకునే వారు. కానీ ఇప్పుడు రీ రిలీజ్ల జోరు విపరీతంగా పెరిగింది.
By: Tupaki Desk | 10 March 2025 5:01 PM ISTఒకప్పుడు కొత్త సినిమాలనే విడుదలైన ఏడాదిలోపు రీ రిలీజ్ చేసే వాళ్లు. రీ రిలీజ్లోనూ ఫలానా సినిమా మంచి వసూళ్లు దక్కించుకుంది అంటూ వార్తలు వచ్చేవి. కానీ ఇప్పుడు ఓటీటీ, టీవీల్లో వస్తున్న కారణంగా సినిమాలు విడుదలైన మూడు నాలుగు వారాల తర్వాత థియేటర్లలో కనిపించడం లేదు. ఆ తర్వాత వచ్చిన జనాలు పెద్దగా పట్టించుకునే అవకాశం లేదు. అందుకే ఈమధ్య కాలంలో కొత్త సినిమాల రీ రిలీజ్లు ఉండటం లేదు. అయితే పాత సినిమాల రీ రిలీజ్ మాత్రం నెలకు రెండు మూడు ఉంటున్నాయి. అయితే పాత సినిమాల రీ రిలీజ్లు కేవలం ఫ్యాన్స్ కి మాత్రమే అని మొదట్లో అనుకునే వారు. కానీ ఇప్పుడు రీ రిలీజ్ల జోరు విపరీతంగా పెరిగింది.
ముఖ్యంగా మహేష్ బాబు సినిమాల రీ రిలీజ్ సందడి ఒక్క షో, ఒక్క రోజుతో పూర్తి కావడం లేదు. కనీసం మూడు నాలుగు రోజుల పాటు సినిమాలు థియేటర్లో సందడి చేస్తున్నాయి. ఇటీవల మహేష్ బాబు నటించిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు రీ రిలీజ్ అయింది. సినిమాను ఒక్క షో లేదా ఒక్క రోజుకు పరిమితం చేయలేదు. మూడు రోజుల పాటు సినిమాను థియేటర్లలో ఆడించారు. మూడు రోజుల్లోనూ భారీగా వసూళ్లు నమోదు అయ్యాయి. బాక్సాఫీస్ వద్ద సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు రీ రిలీజ్ షోలు దక్కించుకున్న కలెక్షన్స్ లెక్కలు మైండ్ పోగొడుతున్నాయి. అందుకే మహేష్ బాబు సినిమా అంటే మినిమం ఇలాగే ఉంటుంది అంటూ ఫ్యాన్స్ తెగ సందడి చేస్తున్నారు.
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా తర్వాత మహేష్ బాబు నటించిన అతడు సినిమా రీ రిలీజ్కి సిద్ధం అవుతుంది. మహేష్ బాబు కొత్త సినిమా ఇప్పట్లో వచ్చే అవకాశాలు లేవు. రాజమౌళి కనీసం రెండేళ్ల వరకు మహేష్ బాబు సినిమాను విడుదల చేయక పోవచ్చు. అందుకే మహేష్ బాబు నటించిన కల్ట్ క్లాసిక్ సినిమాలను రీ రిలీజ్ చేసేందుకు నిర్మాతలు, బయ్యర్లు రెడీ అవుతున్నారు. ఈ జాబితాలో మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన మొదటి సినిమా 'అతడు' చేరబోతుంది. మహేష్ బాబు కెరీర్లో చాలా స్పెషల్ మూవీగా అతడు నిలుస్తుంది అనడంలో సందేహం లేదు. అప్పుడు కమర్షియల్గా అతడు హిట్ కాలేదు అనే విషయం తెల్సిందే.
అప్పట్లో హిట్ కాకపోయినా ఆ తర్వాత టీవీలో సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. అందుకే అతడు సినిమా థియేట్రికల్ రీ రిలీజ్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున డిస్ట్రిబ్యూట్ చేసేందుకు ప్రముఖ నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్ సైతం అతడు రైట్స్ను కొనుగోలు చేసేందుకు ముందుకు వస్తున్నారు. మురళి మోహన్ నిర్మించిన అతడు సినిమాను తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ఆగస్టు 9న మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా రీ రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పటికే సినిమాకు సాంకేతిక హంగులు అద్దే కార్యక్రమం మొదలైంది. సినిమాలోని బ్యాక్ గ్రౌండ్ స్కోర్కి చాలా మంది అభిమానులు ఉంటారు. కనుక సౌండ్ను అత్యాధునిక పరిజ్ఞానం వినియోగించి ఆధునీకరిస్తున్నారని సమాచారం అందుతోంది. మొత్తానికి అతడు సినిమా వస్తే రెగ్యులర్ సినిమాలు సైతం సైడ్ కావాల్సి రావచ్చు.