Begin typing your search above and press return to search.

మిథున్ చ‌క్ర‌వ‌ర్తికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు!

తాజాగా ఈ ఏడాది ఈ అవార్డుకు ప్ర‌ముఖ న‌టుడు మిథున్ చ‌క్ర‌వ‌ర్తి ఎంపిక‌య్యారు.

By:  Tupaki Desk   |   30 Sep 2024 6:02 AM GMT
మిథున్ చ‌క్ర‌వ‌ర్తికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు!
X

దేశంలోనే సినీ రంగానికి సంబంధించి ప్ర‌తిష్టాత్మ‌కంగా భావించే అవార్డుల్లో దాదాసాహెబ్ ఫాల్కే ప్ర‌ధాన‌మైన‌ది. తాజాగా ఈ ఏడాది ఈ అవార్డుకు ప్ర‌ముఖ న‌టుడు మిథున్ చ‌క్ర‌వ‌ర్తి ఎంపిక‌య్యారు. ఈ విష‌యాన్ని కేంద్ర స‌మాచార, ప్ర‌సార మంత్రిత్వ శాఖ తాజాగా అధికారికంగా కాసేప‌టి క్రిత‌మే ప్ర‌క‌టిం చింది. అక్టోబర్ 8న జరగనున్న 70వ జాతీయ చలనచిత్ర అవార్డుల వేడుకలో ఈ పుర‌స్కారాన్ని అందుకుంటారు.

దీనికి సంబంధించి మంత్రి అశ్విని వైష్ణవ్ ఎక్స్ వేదిక‌గా ఈ వార్త‌ను పంచుకున్నారు. `మిథున్ అద్భుతమైన సినిమా ప్రయాణం తరతరాలకు స్ఫూర్తినిస్తుంది. భారతీయ సినిమాకు ఆయ‌న చేసిన సేవ‌ల‌కు గుర్తింపుగా దాదాసాహెబ్ ఫాల్కే కి ఆయ‌న్ని జ్యూరీ ఎంపిక చేసింది. ఆయ‌న్ని ప్ర‌క‌టించ‌డం మాకెంతో గౌర‌వంగా ఉంది` అని అన్నారు.

ఇదే ఏడాది మిథున్‌కు ప్రతిష్ఠాత్మక పద్మభూషణ్ కూడా వ‌రించిన సంగ‌తి తెలిసిందే. మిథున్ చ‌క్ర‌వ‌ర్తి 1976లో మృణాల్ సేన్ దర్శకత్వం వహించిన `మృగయా` సినిమాతో తెరంగేట్రం చేశారు. ఈ చిత్రానికి గానూ ఆయ‌న‌ ఉత్తమ నటుడిగా జాతీయ చలనచిత్ర అవార్డు అందుకున్నారు. తొలి సినిమాతోనే జాతీయ అవార్డు అందుకోవ‌డం ఆయ‌న‌కే చెల్లింది. ఆ త‌ర్వాత 1980వ దశకంలో తిరుగులేని స్టార్‌డమ్ సొంతం చేసుకున్నారు.

1979లో వ‌చ్చిన‌ స్పై థ్రిల్లర్ `సురక్షా` చిత్రం ద్వారా ఆయ‌న‌ స్టార్‌డమ్ రెట్టింపు అయింది. ఆ తర్వాత `డిస్కో డాన్సర్`, `డ్యాన్స్ డ్యాన్స్స‌`, `ప్యార్ ఝుక్తా నహీ`, `కసమ్ పైదా కర్నే వాలేకి`, `కమాండో` వంటి సూప‌ర్‌ హిట్స్ చిత్రాల్లో న‌టించారు. హిందీ , బెంగాలీతో పాటు క‌న్న‌డ‌, తెలుగు, ఓరియా, భోజ్ పురి చిత్రాల్లోనూ న‌టించారు. గోపాల గోపాల సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు సుప‌రిచిత‌మ‌య్యారు.