Begin typing your search above and press return to search.

సుబ్బ‌య్య మార్క్ చిత్రంగా ముస్తాబు!

సెంటిమెంట్ బ్యాక్ డ్రాప్ లో ఎన్నో హిట్ సినిమాలు అందించిన ఘ‌న‌త ఆయ‌న సొంతం.

By:  Tupaki Desk   |   27 Sep 2024 5:46 AM GMT
సుబ్బ‌య్య మార్క్ చిత్రంగా ముస్తాబు!
X

సీనియ‌ర్ ద‌ర్శ‌కుడు ముత్యాల సుబ్బ‌య్య ట్రాక్ రికార్డు గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. సెంటిమెంట్ బ్యాక్ డ్రాప్ లో ఎన్నో హిట్ సినిమాలు అందించిన ఘ‌న‌త ఆయ‌న సొంతం. చిరంజీవి, నాగార్జున‌, వెంక‌టేష్‌, బాల‌కృష్ణ ఇలా అప్ప‌టి స్టార్ హీరోలంద‌ర్నీ డైరెక్ట్ చేసి ఎన్నో హిట్ సినిమాలు అందించారు. ద‌ర్శ‌కుడిగా త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన ఇమేజ్ ని ..గుర్తింపును సంపాదించుకున్నారు. ఇక ద‌ర్శ‌కుడిగా ఆయ‌న రిటైర్మెంట్ ఇచ్చి చాలా కాల‌మ‌వుతోంది.

దీంతో సుబ్బ‌య్య స‌మ‌ర్ప‌ణ‌లో కుమారుడు అనంత కిషోర్ నిర్మాత‌గా ఈ మ‌ధ్య‌నే 'తల్లి మనసు' అనే సినిమా ప్రారంభ‌మైంది. ఇందులో కమల్ కామరాజు, రచిత మహాలక్ష్మి, సాత్విక్, సాహిత్య ప్రధాన పాత్రల్లో న‌టిస్తున్నారు. ముత్యాల మూవీ మేకర్స్ పతాకంపై సుబ్బ‌య్య వ‌ద్ద కోడైరెక్ట‌ర్ గ ఆప‌నిచేసిన శ్రీనివాస్ (సిప్పీ) ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. దర్శకుడిగా అత‌డి తొలి సినిమా ఇదే.

ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన ఓ మీడియా స‌మావేశంలో సుబ్బ‌య్య మాట్లాడారు. `నేను దాదాపు ఒకటిన్నర దశాబ్దాలుగా డైరెక్షన్‌కి దూరంగా ఉన్నాను. చాలా మందిని క‌లిసిన‌ప్పుడల్లా మ‌ళ్లీ సినిమాలు ఎప్పుడు చేస్తున్నారు? అని అడుగుతున్నారు. యాంత్రిక జీవితంలో మాన‌వ సంబంధాలు దూర‌మైపోతున్నాయి. ఈ జ‌న‌రేష‌న్ కి ఇలాంటి సినిమాలు అవ‌స‌రం. వాటి విలువ‌లు ఇప్ప‌టి త‌రానికి కూడా తెలియాలి అని చాలా మంది నా వ‌ద్ద అంటుంటారు.

ఇదే విష‌యాన్ని మా అబ్బాయి కి చెప్పాను. వెంట‌నే అత‌డు మ‌న‌మే చేద్దాం అని ముందుకొచ్చాడు. ఈసినిమా నా మునుప‌టి చిత్రాల‌కు చాలా ద‌గ్గ‌ర సంబంధం ఉంటుంది. ఎమోష‌న్ హైలైట్ అవుతుంది. నా విజ‌న్ సిప్పీకి బాగా తెలుసు. అందుకే అత‌డిని ద‌ర్శ‌కుడిగా తీసుకున్నాం. న‌న్ను ఎలా ఆద‌రించారో సిప్పిని కూడా ఆద‌రించాల‌ని కోరుకుంటున్నా` అని అన్నారు.