Begin typing your search above and press return to search.

ఆరోజు మైత్రీ పెద్ద సర్ప్రైజ్.. పుష్ప-2 కోసం మాత్రం కాదు

పుష్ప-2 బదులు తమ బ్యానర్ పై రూపొందుతున్న మరో తక్కువ బడ్జెట్ మూవీని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.

By:  Tupaki Desk   |   23 Jun 2024 6:10 AM GMT
ఆరోజు మైత్రీ పెద్ద సర్ప్రైజ్.. పుష్ప-2 కోసం మాత్రం కాదు
X

టాలీవుడ్ లో మోస్ట్ సక్సెస్ ఫుల్ ప్రొడక్షన్ హౌస్ గా మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ వరుస సినిమాలతో దూసుకుపోతోంది. అటు బడా హీరోలతో భారీ బడ్జెట్ మూవీలు తెరకెక్కిస్తూ.. ఇటు కంటెంట్ బేస్డ్ చిత్రాలు తీస్తూ హిట్లు అందుకుంటోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ పుష్ప-2, ఫణీంద్ర నర్సెట్టి డైరెక్షన్ లో 8 వసంతాలు సహా అనేక సినిమాలను నిర్మిస్తోంది. ప్రస్తుతం ఆ చిత్రాలన్నీ సెట్స్ పైనే ఉన్నాయి.

అయితే పుష్ప-2 మూవీని మైత్రీ మూవీ మేకర్స్.. ఆగస్టు 15వ తేదీన విడుదల చేయాలనుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత అనేక సార్లు మూవీ పోస్ట్ పోన్ అవుతుందని వార్తలు వచ్చినా.. కచ్చితంగా రిలీజ్ చేసి తీరుతామని మైత్రీ సంస్థ అనౌన్స్ చేసింది. కౌంట్ డౌన్ పోస్టర్లు కూడా షేర్ చేసింది. కానీ ఇటీవల మూవీ రిలీజ్ ను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. డిసెంబర్ 6వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నట్లు తెలిపింది.

షూటింగ్ పార్ట్ పెండింగ్ ఉండడం వల్ల నిర్ణయం తీసుకున్నట్లు చెప్పింది. మంచి క్వాలిటీ అవుట్ పుట్ ఇవ్వడమే టార్గెట్ అని పేర్కొంది. అయితే ఆగస్టు 15వ తేదీన ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, పూరి జగన్నాథ్ కాంబోలో రెడీ అవుతున్న డబుల్ ఇస్మార్ట్ రిలీజ్ అవ్వనున్నట్లు అనౌన్స్మెంట్ వచ్చిన విషయం తెలిసిందే. దీంతో పాటు మరికొన్ని చిన్న చిత్రాలు ఆ రోజు రిలీజ్ అయ్యే అవకాశం ఉన్నట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.

కానీ లేటెస్ట్ బజ్ ప్రకారం.. డిస్ట్రిబ్యూషన్ పై కూడా మంచి పట్టు ఉన్న మైత్రీ మూవీ మేకర్స్ ఆగస్టు 15వ తేదీని వదులుకోవడానికి ఇష్టపడడం లేదట. పుష్ప-2 బదులు తమ బ్యానర్ పై రూపొందుతున్న మరో తక్కువ బడ్జెట్ మూవీని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం మైత్రీ బ్యానర్ పై మూడు చిన్న ప్రాజెక్టులు తెరకెక్కుతున్నాయి. వాటి షూటింగ్స్ చివరి దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది.

దీంతో వాటిలో ఒక సినిమాను స్వాతంత్ర్య దినోత్సవం కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మైత్రీ సంస్థ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఏ సినిమా అనేది కూడా మైత్రీ వారు ఫిక్స్ అయినట్లు టాక్ వినిపిస్తోంది. జులై కల్లా ఫస్ట్ కాపీ రెడీ చేయాలని నిర్ణయించినట్లు వార్తలు వస్తున్నాయి. త్వరలో ప్రమోషన్స్ స్టార్ట్ చేసి.. ఆగస్టు 15వ తేదీన రిలీజ్ చేయాలని అనుకుంటున్నట్లు వినికిడి. మరి మైత్రీ బ్యానర్ నుంచి ఏ సినిమా వస్తుందో చూడాలి.